స్వాగతం

ఖదీర్ బాబు గారి అభిమానులకు స్వాగతం

Wednesday 24 October 2012

పూరి జగన్నాద్ ...రీచార్జ్

''రీచార్జ్'' పడుతున్న కెరటాన్ని పైకి లేపే స్పూర్తి 

నిరాశ పడే హృదయానికి ఆశ పూసే లేపనం 

ఆకాశమే హద్దుగా తమ జీవితపు నేల నుండి 
పైకేగిసిన ఎన్నో జీవితాల....ఆశయాలు,అనుభూతులు 
విజయాలు,నిట్టూర్పులు ....

ఖదీర్ బాబు.ఎం.డి కలం నుండి మీకోసం .

ఎవణ్ణి కొడితే దిమ్మ తిరగకుండా మైండ్ బ్లాంక్ అవకుండా
స్టడీగా ఉంటాడో వాడే పూరి.
మూడు బులెట్లు దిగాయి... బాడీ పడి ఉంది... పోయుంటాడు అనుకుంటే ఎలా? నాలుగో బులెట్ కోసం లేచి నిలబడేవాడే పూరి.
గోల్కొండ ఖిల్లాలో షూటవుట్. మూట గట్టి పారేశాం...
శాల్తీ గల్లంతే అనుకుంటే ఎలా? బతికి వచ్చేవాడే పూరి.
సినిమా ఇండస్ట్రీ చాలాసార్లు పూరీని నీటిలో కాల్చింది. నిప్పులో నాన్చింది. చెద పట్టించి భూస్థాపితం చేయాలని చూసింది.
కాని- ప్రతిసారి ఫీనిక్స్‌లా లేచి వచ్చాడు పూరి.
ఇండస్ట్రీ సముద్రం. కల్లోల కెరటాలు సహజం.
సమర్థుడైన నావికుడికే అక్కడ చోటు... అని నమ్మాడు పూరి.
పరీక్ష ఎదురైన ప్రతిసారీ నెగ్గాడు.
తెగిన ప్రతిసారీ అతుక్కున్నాడు.
సాహసం పెద్ద మాట. ధైర్యం ప్రతిఒక్కరికీ సరిపోయే మాట.
కొంచెం ధైర్యం ఉంటే చాలు.
మీరూ పూరి! మీరు కూడా పూరి!! మీరే పూరి!!!


ఇంటర్వ్యూ, కథారూపం : ఖదీర్

శత్రువు విసిరిన కత్తి కంటే
స్నేహితుడు విసిరిన కత్తి కచ్చితంగా దిగబడుతుంది.

******* 

ఆ రోజు ఉదయం పూరి జగన్నాథ్ నిద్రలేచేసరికి ఎదురుగా నలుగురు ఫైనాన్షియర్స్ కూచుని ఉన్నారు. సాధారణంగా పూరి నిద్రలేవగానే ఎవరినీ కలవడానికి ఇష్టపడరు. ఆయన దగ్గర మేలిమిజాతి జాగిలాలు చాలా ఉన్నాయి. వాటితో ఆడుకోవడానికి ఇష్టపడతారు. ఒక్కోటి లక్ష రూపాయలు పెట్టి కొన్న మలేసియా చిలుకలు ఉన్నాయి. వాటిని పలకరించడానికి ఇష్టపడతారు. టీపాయ్ మీద లైట్స్ సిగరెట్ ప్యాకెట్ ఉంటుంది. ముట్టించడానికి ఇష్టపడతారు. వేడి వేడి కాఫీ ఉంటుంది. సిప్ కొట్టడానికి ఇష్టపడతారు.
ఆ సంగతి అందరికీ తెలుసు.
కాని- వీళ్లెందుకు వచ్చినట్టు?
‘డబ్బు’ అన్నారు వాళ్లు.
‘ఏం డబ్బు?’ అన్నారు పూరి.
‘తీసుకున్న డబ్బు’ అన్నారు వాళ్లు.
పూరికి ఏం అర్థం కాలేదు. ఆయన ఆర్థిక వ్యవహారాలన్నీ ఒక స్నేహితుడు చూసుకుంటాడు. చెక్కులు, పత్రాలు, సంతకాలు, కొనడాలు, అమ్మడాలు... అన్నీ అతడే. కాని ఒకటే షరతు. తన ఖర్చును అతడు అదుపు చేయకూడదు. అతడి పొదుపును తను చెక్ చేయకూడదు.
లెక్క గోల్‌మాల్ అయ్యిందా?
‘వాడితో మాట్లాడకపోయారా?’ అన్నారు ఫోన్ తీస్తూ.
రింగ్ చేస్తే స్విచ్‌డ్ ఆఫ్ వచ్చింది. సాధారణంగా ఆ సమయానికే ఆ స్నేహితుడు ఆఫీసుకు వచ్చి పనులు చూసుకుంటూ ఉంటాడు. కబురు చేస్తే కనిపించలేదు. బహుశా ఇక కనిపించకపోవచ్చు.
టోపీ!
లెక్కలు మొదలయ్యాయి. అప్పుల కౌంట్ మొదలయ్యింది.
కోటి... రెండు కోట్లు... మూడు కోట్లు....
‘పర్లేదు... ఐదు కోట్లకు ముంచిపోతే మేనేజ్ చేయొచ్చు’ అనుకున్నారు పూరి.
ఆరు కోట్లు... ఏడు కోట్లు... ఎనిమిది కోట్లు...
‘పర్లేదు.. పది కోట్లయినా సరే... కష్టపడవచ్చు’ అనుకున్నారు పూరి.
పదకొండు కోట్లు... పన్నెండు కోట్లు... పదమూడు కోట్లు...
‘పదిహేను అంటే కష్టమే’ చెమటలు తుడుచుకున్నారు పూరి.
పదహారు కోట్లు పదిహేడు కోట్లు...
పూరి నిశ్శబ్దమైపోయారు.
ఇరవై ఒకటి ఇరవై రెండు....
పూరికి మాట పోయింది.
ఇరవై తొమ్మిది... ముప్పయ్!
పూరి పెదాలు పూర్తిగా ఎండిపోయాయి.
లెక్క తేలింది. ముప్పయ్ కోట్ల అప్పు!
పూరి ఎప్పుడూ డబ్బును సన్నిహితంగా చూడలేదు. అంకెలు లెక్కలను పట్టించుకోలేదు. అసలు సృజనాత్మకంగా ఉండే మనిషి అకౌంట్స్‌లో దిగలేడని ఆయన అభిప్రాయం. కాని ఇప్పుడు దాని విశ్వరూపాన్ని చూడాల్సి వస్తోంది.
‘వ..వ.. వడ్డీ ఎంత కట్టాల్సి ఉంటుంది’ అని అడిగారాయన.
ఇది సినిమా ఫైనాన్స్. కనుక ఆ లెక్కే వేరుగా ఉంటుంది.
‘నెలకు కోటి’
కోటి రూపాయలా!
పూరిలో కదలికలు లేవు. మెదడు బ్లాంక్ అయిపోయింది. లాన్‌లో కుక్కలు తమను పలకరించమని పెద్దగా మొరుగుతున్నాయి. చిలుకలు ముద్దు చేయమని గోలపెడుతున్నాయి.
పూరి కదలడం లేదు.
నిజానికి ఇటీవల తన గ్రాఫ్ అద్భుతంగా ఉంది. పోకిరి ఇచ్చాడు. సూపర్ డూపర్ హిట్. దేశముదురు ఇచ్చాడు. సూపర్ హిట్. చిరుత ఇచ్చాడు. సూపర్ హిట్. బుజ్జిగాడు ఇచ్చాడు. యావరేజ్. ఈ గ్రాఫ్ ప్రకారం అయితే ఇప్పుడు తన దగ్గర ఇరవై ముప్పయ్ కోట్లు ఉండాలి. కాని లెక్కలు తీస్తే ఉల్టా తనే అప్పు ఉన్నాడు.
‘పోనీ... ఐపి పెట్టు’ ఎవరో సలహా ఇచ్చారు.
ఐపి. అంటే దివాళా.
మొదట మానసికంగా దివాళా తీసినవాడే తర్వాత ఆర్థిక దివాళాతనాన్ని ప్రకటిస్తాడు. తన అంతరాత్మకు ఇంకా శక్తి ఉంది. అది దివాళాతీయడానికి అంగీకరించడం లేదు. అందుకే ఆ సలహా ఇచ్చిన వ్యక్తితో పూరి అన్నారు- ‘ఎవడో నన్ను ముంచాడని నేను నలుగురినీ ముంచలేను. భటుడు లొంగిపోవచ్చు. కాని రాజు కాదు’

*******

జూబ్లీహిల్స్‌లో కట్టుకున్న సొంత ఆఫీస్- 12 కోట్లు. పిల్లల పేరున పెట్టిన రెండు సొంత స్థలాలు - రెండు కోట్లు. పడుంటాయి కదా అని కొన్న రెండు డ్యూప్లెక్స్‌లు - రెండు కోట్లు. పెళ్లిరోజు శ్రీమతికి కానుకగా ఇచ్చిన సొంత అపార్ట్‌మెంట్- కోటి. మిగిలిన చిల్లర మల్లర- రెండు కోట్లు.
అన్నీ పోయాయి.
పూరి ఇప్పుడు జీరో. బిగ్ జీరో.
కాకలు తీరే యోధుడిలో అయినా భయం ప్రవేశించే క్షణాలవి. పూరికి కూడా భయం వేసింది. ఆ వెంటనే ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. కాని ఎందుకనో అలెగ్జాండర్ గుర్తుకొచ్చాడు. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ తిరుగు ప్రయాణంలో కేవలం ఒక విషజ్వరానికి మరణించాడు. తను అలా మరణించకూడదు. భయం అనే విషజ్వరం తనలో ప్రవేశించకూడదు.
మళ్లీ తీయాలి. గెలవాలి. పోగొట్టుకున్నది మళ్లీ సంపాదించాలి. ఓడిపోకుండా నిలబడాలి.
ఎందుకంటే- అలా ఉంటానని తను తన తండ్రికి మాట ఇచ్చాడు.

*******

నర్సీపట్నం అంటే విశాఖ ఏజెన్సీకి సింహద్వారం. అక్కణ్ణుంచే అడవి మొదలవుతుంది. అక్కడి నుంచే విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు పట్టువదలని పోరాట పటిమ మొదలవుతుంది. అలాంటి నర్సీపట్నం దాపునే బాపిరాజు కొత్తపల్లి అనే పల్లెలో పుట్టాడు పూరి. తండ్రి వ్యవసాయం చేస్తాడు. వర్తకమూ చేస్తాడు. పిప్పళ్లు, పసుపు, కాఫీ.... కాని వ్యవసాయంతో పాటు ఆయనకు సినిమాలన్నా ఇష్టం. సాహిత్యం అంటే ఇంకా ఇష్టం. ఇంట్లో ఒక షెల్ఫ్‌లో శ్రీశ్రీ, చలం పుస్తకాలు ఇంకో షెల్ఫ్‌లో విజయచిత్ర దొంతరలు ఉండేవి. జీవితం అంటే శ్రమతో పాటు కళ కూడా అని నమ్ముతాడాయన. అందుకే నెలకు రెండుసార్లు ఊరి చుట్టుపక్కల ప్రొజెక్టర్ తెచ్చి సినిమాలు ఆడించేవాడు. ఆయన వెనుకే డేరా పట్టుకొని పూరి బయలుదేరేవాడు.
అప్పుడు పూరికి పన్నెండేళ్లుంటాయి.
ఏదో ఊరికి సినిమా ఆడించడానికి బస్సులో వెళుతున్నారు. అడవి మధ్యలో ప్రయాణం. దూరంగా కార్చిచ్చు. సరసరమని అడవిని కాల్చుకు తింటోంది. పూరి ఆ కార్చిచ్చును చూశాడు.
పక్కనే ఉన్న తండ్రిని అడిగాడు- ‘నాన్నా... ఆ మంటకు అడవి మొత్తం తగలబడిపోతే?’
తండ్రి నవ్వారు. ‘తగలబడదురా. అడవి తనకు తానే ఆ మంటను ఆర్పుకుంటుంది’
పూరికి మళ్లీ సందేహం వచ్చింది- ‘మళ్లీ అంటుకుంటే’
తండ్రి సమాధానం - ‘మళ్లీ ఆర్పుకుంటుంది’
పూరి సందేహం- ‘మళ్లీ తగలబడితే’
తండ్రి అప్పుడు నవ్వి, ఓర్పుగా సమాధానం చెప్పారు-‘చూడు... ఎన్నిసార్లు తగలబడినా అడివే శాశ్వతం. కార్చిచ్చు కాదు. కార్చిచ్చు వస్తుంది పోతుంది. మండుతుంది ఆరిపోతుంది. కాని అడవి ధైర్యంగా భయం లేకుండా విశాలంగా మహాశక్తిలా నిలబడే ఉంటుంది. మనిషి కూడా అలా నిలబడి ఉండాలి. ఎన్నో కష్టాలు వస్తుంటాయ్. పోతుంటాయ్. కాని మనిషి మాత్రం ధైర్యంగా సహనంగా ఓర్పుగా గెలవడానికి నిలబడే ఉండాలి’
పూరి తల పంకించాడు. ఏదో ఒక జీవిత సత్యం తెలుసుకున్నట్టుగా అతడి కళ్లు మిలమిలా మెరిసిపోతున్నాయి.
తండ్రి అతడి చేతిని మెల్లగా పట్టుకుంటూ అడిగారు- ‘ఏం. అడవిలాగా ఉంటావా?’
‘ఉంటాను నాన్నా’ పూరి మాట ఇచ్చాడు.

*******

రామానాయుడు స్టూడియోలో షూటింగ్ జరుగుతోంది. లోపల కె.మురళీమోహనరావు ఉన్నారు. పెద్ద డెరైక్టర్. ఆయన దగ్గర అసిస్టెంట్ డెరైక్టర్ పోస్ట్ కోసం పూరి బయట నిలుచుని ఉన్నారు. మధ్య మధ్య జేబు తడుముకుంటూ ఉన్నారు. అందులో తండ్రి రాసిన ఉత్తరం ఉంది.
‘బాబూ. సాధారణంగా తండ్రులు ఈ ఉత్తరం ఒకలాగా రాస్తారు. నేను ఒకలాగా రాస్తున్నాను. నీకు కష్టంగా ఉంటే ఊరికి వచ్చెయ్. వ్యవసాయం చేసుకో అని ప్రతి తండ్రీ రాస్తాడు. వద్దు... ఎన్ని కష్టాలు పడైనా సరే అక్కడే నిలదొక్కుకో అని నేను రాస్తున్నాను. నా పుస్తకాల వల్ల, నా వెంట తిరిగి చూసిన సినిమాల వల్ల నీకు చదువు అబ్బలేదు. కళలో రాణించడానికే నువ్వు ప్రతిభ చూపావు. దసరా సెలవుల్లో ఊరి కుర్రాళ్లను పోగేసి నువ్వు వేసిన నాటకం చూశాక నీలో ప్రతిభ ఉందని నేను మనస్పూర్తిగా నమ్మాను. ఎవరు నిన్ను నిరుత్సాహపరిచినా ఓడిపోవద్దు. నువ్వు డెరైక్టర్ అవుతావు. అవుతావు. కచ్చితంగా అవుతావు. ఇట్లు. మీ నాన్న’.
కాసేపటికి మురళీమోహనరావు బయటకు వచ్చారు.
పూరి నమస్కారం చేశారు.
‘ఏ ఊరు?’
‘నర్సిపట్నం’
‘ఎందుకొచ్చా?’
‘డెరైక్టర్ అవుదామని’
‘ఏంటి అర్హత’
‘మధు ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో కోర్సు చేశాను సార్’
మురళీమోహనరావు రిజర్వుడు మనిషి. ఎవరితోనూ పెద్దగా మాట్లాడరు. కాని పూరిలో ఏం నచ్చిందో భుజం మీద చేయి వేసి లోపలికి తీసుకెళ్లి టిఫెన్ పెట్టించి పూరి టిఫెన్ తింటుండగా సలహా ఇచ్చారు. ‘చూడు బాబూ. నేను బిజీ డెరైక్టర్‌ని. నా దగ్గర నలుగురు అసిస్టెంట్లు ఉన్నారు. నేను చేస్తున్నది నాయుడుగారి సినిమా కనుక ఆయన కోటగా ఇంకో ఇద్దరిని పెడతారు. మొత్తం ఆరుగురు. నీకు చోటుండదు. నేనే కాదు ఏ బిజీ డెరైక్టరూ నీకు అవకాశం ఇవ్వడు. ఎందుకంటే వాళ్ల దగ్గర అసిస్టెంట్లు ఆల్రెడీ ఉంటారు. అందువల్ల ఒక పని చెయ్. బిజీ డెరైక్టర్ దగ్గర చురుగ్గా ఉండే కోడెరైక్టర్లను వెతుకు. వాళ్లను అసెస్ చేయ్. ఒకటి రెండేళ్లలో డెరైక్టర్లవుతారని నీకనిపిస్తే వాళ్లతో స్నేహం చేయ్. అవకాశం అడగొద్దు. ఒట్టి స్నేహమే. కాని- వాళ్లు డెరైక్టర్ అయిన మరు నిమిషం నిన్నే అసిస్టెంట్‌గా తీసుకుంటారు’ అని, షేక్‌హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయాడాయన.
ఆ మాత్రం సూది చాలు. దారం వెతుక్కోవడానికి. పూరి వెంటనే ఒక నెలరోజుల పాటు స్టూడియోలన్నీ తూర్పారబట్టాడు. కె.రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు, రవిరాజా పినిశెట్టి, కోడి రామకృష్ణ, రామ్‌గోపాల్ వర్మ.... రామ్‌గోపాల్ వర్మ దగ్గర పని చేస్తున్నవాళ్లల్లో ఇద్దరు కో డెరైక్టర్లు పూరిని ఆకర్షించారు.
ఒకరు గుణశేఖర్. రెండు కృష్ణవంశీ.
గుణశేఖర్ గంభీరంగా ఉన్నాడు. కృష్ణవంశీ చురుగ్గా హుషారుగా కలుపుగోలుగా ఉన్నాడు.
ఆ మరునిమిషమే కృష్ణవంశీ ఎదురుగా ఉన్నాడు పూరి.
‘నమస్తే డెరైక్టర్ వంశీగారూ’
కృష్ణవంశీ పూరిని ఎగాదిగా చూశారు.
‘నేను డెరైక్టర్ వంశీని కాను. లేడీస్ టైలర్ తీసినాయన వేరే. నేను కృష్ణవంశీని’
‘తెలుసు సార్. రెండు వారాలుగా మీ వర్క్ పరిశీలిస్తున్నాను. మీరు కూడా వంశీగారంత పెద్ద డెరైక్టర్ అవుతారు. అంతకన్నా పెద్ద డెరైక్టర్ అవుతారు సార్. అది నా నమ్మకం’
కృష్ణవంశీ పూరి వైపు మళ్లీ ఎగాదిగా చూశారు. క్రమంగా ఆయన భృకుటి విడిపోయింది. పొగడ్త తాలూకు ప్రశాంతత వ్యాపించింది. ఆ తన్మయంలో ఆయన కళ్లకు పూరి- చేతులు కట్టుకున్న పిడిబాకులా కనిపించాడు.
‘నువ్వు నాకు నచ్చావోయ్’ అన్నాడాయన.
‘ధన్యుణ్ణి ప్రభూ’ అన్నారు పూరి.

*******

గంగిగోవు పాలు మూడు గరిటెలు చాలు.
మనీ మనీ.
గులాబీ.
నిన్నే పెళ్లాడతా.
మూడు సినిమాలకు కృష్ణవంశీ దగ్గర అసిస్టెంట్‌గా పని చేశారు పూరి. అయితే సినిమా తీయడం రెండు రకాలు. బాగా తీయడం. క్విక్‌గా తీయడం. ఇద్దరికీ గిరాకీ ఉంటుంది. కాని క్విక్‌గా బాగా తీసేవాడికి సూపర్ గిరాకీ ఉంటుంది. తను అలా తయారవ్వాలి. ప్రాక్టీస్ ఎలా? దూరదర్శన్. పూరి దూరదర్శన్ మీద పడ్డాడు. సింగిల్ ఎపిసోడ్‌లే తన కార్యక్షేత్రం. పాతిక నిమిషాలకు సరిపడా కథా, పాత్రలు, డైలాగులు తనే రాసుకునేవాడు. ఒక్క రోజులో షూటింగ్ ముగించేవాడు. ఇంకో రోజు ఎడిటింగ్. ఎపిసోడ్‌కు పదివేలు వచ్చేవి. దాదాపు వంద ఎపిసోడ్‌లు తీశాడు పూరి దూరదర్శన్ కోసం.
చేయి తిరిగింది. చాలు. సినిమాకు సొంతంగా డెరైక్షన్ చేయాలి.
కాని అనుకోగానే జరగవు అన్నీ.

*******

సుమన్ హీరోగా పూరి దర్శకత్వంలో సినిమా. పేరు పాండు. ఆగిపోయింది.
సూపర్ స్టార్ కృష్ణ హీరోగా పూరి దర్శకత్వంలో సినిమా. పేరు తిల్లానా. ఒక పాట రికార్డ్ అయి ఆగిపోయింది.
సినిమా ఫీల్డ్‌లో అవకాశం రానివాణ్ణి గౌరవిస్తారుగాని అవకాశం వచ్చి ఆగిపోయినవాణ్ణి లెక్క చేయరు. పైగా ‘సుడిలేదండీ మనోడికి’ అని ప్రచారం చేసేస్తారు. ఎవరైనా సినిమా తీయడానికి వచ్చినా ‘ఎందుకు వాడితో తీయడం. ఆగిపోవడానికా’ అని భయపెడతారు.
ప్రతిభ చూపమంటే చూపగలంగాని ఈ ప్రచారాన్ని ఎలా ఆపడం.
పూరికి పిచ్చెత్తింది. వెనక్కు వెళ్లిపోదామా అనిపించింది. నర్సిపట్నంలో పిప్పళ్లు అమ్ముకున్నా హాయిగా బతకొచ్చే అనే కోరిక లాగింది. వెళ్లి కృష్ణవంశీని కలిసి తన నిర్ణయాన్ని చెప్పాడు. కృష్ణవంశీ ఏం మాట్లాడలేదు. సరే. రిలాక్స్ అవుదువు పదా అని ఆ రోజు రాత్రే గౌతమి ఎక్కించి రాజమండ్రి తీసుకెళ్లారు. మంచి వానాకాలం అది. విపరీతంగా వానలు పడుతున్నాయి. గోదావరి ఎర్రగా డికాక్షన్ రంగులో ఉధృతంగా కడుపు ఉబ్బెత్తయి ప్రవహిస్తూ ఉంది. ఆ సాయంత్రం పూరిని వంతెన దగ్గరకు తీసుకెళ్లారు కృష్ణవంశీ షికారుకి. దూరంగా వంతెన. దాని మీద ఐదూ పదిమంది పిల్లలు. అందరూ పదీ పన్నెండేళ్ల వాళ్లు. ఆ పిల్లలు దూరంగా పరీక్షగా చూస్తున్నారు. గోదాట్లో దుంగలు కొట్టుకొచ్చినప్పుడల్లా దబాదబామని అంతెత్తు నుంచి దూకుతున్నారు. వడివడిగా ఈతకొడుతూ దుంగను అందుకుంటున్నారు. వొడ్డుకు ఈడ్చుకుపోతున్నారు. దక్కినవాడికి దక్కినట్టు. దక్కనివాడు మళ్లీ వంతెనెక్కి మళ్లీ దుంగ కొట్టుకొచ్చేంత వరకూ ఆగుతున్నాడు. దుంగ వస్తే దూకుతున్నాడు.
పూరి వాళ్లనే గమనిస్తున్నాడు. కృష్ణవంశీ అన్నారు-
‘చూడూ. గోదాట్లో నీళ్లకు కొదవ లేదు. అడవిలో దుంగలకూ కొదవ లేదు. అందుకోవాలన్న తపన ఉండాలేగాని ఆ చిన్న పిల్లలకంటే చిన్నపిల్లాడివా నువ్వు?’
పూరికి ఇది రెండో పాఠం.
వాళ్లు మళ్లీ హైద్రాబాద్ ట్రైన్ ఎక్కుతుండగా కృష్ణవంశీ అన్నారు- ‘అసలు ఈ ప్రచారాలు అవీ పట్టించుకోకుండా నిన్నూ నీ టాలెంట్‌నూ అసెస్ చేసే హీరోతో సినిమా తీయడానికి ట్రై చేయరాదూ?’
‘నాకేం ప్రాబ్లం లేదు. కాని అలాంటి వారు ఎవరున్నారా అని?’
‘పవన్ కల్యాణ్?’

******* 

పవన్‌తో తొలి సినిమా బద్రి- సూపర్ హిట్.
పవన్ కల్యాణ్ పేరు మార్మోగిపోయింది. పూరి పేరు కూడా.
పూరి ఇప్పుడు ఆకాశంలో ఉన్నాడు. కళ్లు కనిపించడం లేదు. వెలుగు.
వెంటనే జగపతిబాబుతో ‘బాచి’. అట్టర్ ఫ్లాప్.
పూరి ఇప్పుడు పాతాళంలో ఉన్నాడు. ఇప్పుడూ కళ్లు కనిపించడం లేదు. చీకటి.
ఒక హిట్ ఇస్తే పది సినిమాలకు అవకాశాలు వస్తాయి. ఒక ఫ్లాప్ ఇస్తే ఇరవై సినిమాలకు అవకాశాలు వెనక్కిపోతాయి. పూరికి మళ్లీ సినిమా లేదు. ట్రై చేశాడు. లేదు. బద్రిలాంటి సినిమా తీసిన డెరైక్టర్‌ని అన్నాడు. పోవోయ్ అన్నారు. బాగా తీస్తా అన్నాడు. కుదర్దు అన్నారు. డిప్రెషన్.
ఆ టైమ్‌లోనే ఒక పెద్ద సినిమా కుటుంబానికి చెందిన యంగ్ హీరోని కలిశాడు పూరి ఎంతో ఆశతో. ఆ హీరో ఓకే అంటే సినిమా వెంటనే రెడీ అయిపోతుంది. ఎలాగైనా ఓకే చేయించుకోవాలి.
ఫస్ట్ ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం కథ చెప్పాడు - నచ్చలేదు.
సెకండ్ ఇడియట్ కథ చెప్పాడు - నచ్చలేదు.
థర్డ్ దేశముదురు కథ చెప్పాడు - నచ్చలేదు.
పూరికి పౌరుషం తన్నుకొచ్చింది. అరె... ఎన్ని సబ్జెక్ట్‌లు చెప్పినా ఓకే అనడే. అసలు తాను హీరోల మీద ఎందుకు డిపెండ్ కావాలి. నేనే ఒక హీరోని ఎందుకు తయారు చేసుకోకూడదు? తన దృష్టిలో ఒక హీరో ఉన్నాడు. ఇండస్ట్రీ అతణ్ణి హీరో అనకపోయినా తనే అతణ్ణి హీరోని చేస్తాడు. నిన్నే పెళ్లాడతా టైమ్‌లో తనతో పాటు అసిస్టెంట్‌గా పని చేసిన కుర్రాడు. రవితేజ. ఎస్. రవితేజ హీరో.
పూరి రవితేజను పెట్టి ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం సినిమా తీశాడు.
రవితేజ పేరు మార్మోగిపోయింది.
పూరి పేరు మరొక్కసారి.

******* 

సినీ వైకుంఠపాళిలో పూరి యాత్ర మొదలయ్యింది. ఇడియెట్- నిచ్చెన. అమ్మా నాన్నా తమిళమ్మాయి- నిచ్చెన. శివమణి- సగం నిచ్చెన. ఆంధ్రావాలా- మహాసర్పం. అన్ని గడులూ ఎక్కి ఇక పంటకు చేరుకుంటాననగా ఈ సినిమాతో తోకలోకి వచ్చి మొదటి గడిలో నిలుచున్నాడు పూరి.
లేచాడు. బట్టలు దులుపుకున్నాడు. ముఖం కడుక్కున్నాడు. తల దువ్వుకున్నాడు. ఇంట్లో ఆరునెలలు నేను కనిపించను అని చెప్పి పోకిరి స్క్రిప్ట్ రాసుకున్నాడు.
మహేష్‌బాబుతో పోకిరి.
ఒకే ఒక పెద్ద నిచ్చెన. కింద గడి నుంచి ఏకంగా పంట గడికి.
దేశముదురు, చిరుత, బుజ్జిగాడు...
ఇక తనకు తిరుగులేదు అనుకుంటూ ఉండగా స్నేహితుడు కొట్టిన దెబ్బ. లేదా తన నిర్లక్ష్యం. లేదా ఇద్దరి నిర్బాధ్యత.
ముప్పయ్ కోట్ల అప్పు!

******* 

ఇండస్ట్రీలో పూరి పూర్తిగా డిశ్చార్జ్ అయిపోయాడు. ఆ ఫ్రస్ట్రేషన్‌లో తీసిన ‘నేనింతే’ ఔట్. ‘ఏక్ నిరంజన్’... సోసో. ‘గోలీమార్’- యావరేజ్. ‘నేను- నా రాక్షసి’ ఫ్లాప్.
‘ఆగు ఆగు... కాస్త ఆగు’ అనుకున్నారు పూరి.
ఇలాగే ఉంటే నాశనమైపోతాను అని కూడా అర్థమైంది అతనికి.
ఇప్పుడు సరిగ్గా రీచార్జ్ కాకపోతే ఇక జీవితాంతం నేలకు కరుచుకుపోవడమే.
ఈ టైమ్‌లో తనను రీచార్జ్ చేయగలిగిన వారెవరు?
ఇంకెవరు?
షెహన్ షా.
అమితాబ్ బచ్చన్.

*******

రామ్‌గోపాల్ వర్మతో మాట్లాడ్డం ఎప్పుడూ కత్తి మీద సామే. అందుకే జంకుతూ వర్మకు ఫోన్ చేశారు పూరి.
‘నాకో మేలు చేస్తారా?’ అడిగారు.
‘నేను ఎవరికీ మేలు చేయను. అవకాశం కల్పిస్తాను. ఆ అవకాశం వల్ల మేలు పొందుతావో కీడు అనుభవిస్తావో నీ చేతుల్లో ఉంటుంది’
‘సరే. అవకాశమే ఇప్పించండి. అమితాబ్‌తో అపాయింట్‌మెంట్’
‘సొంత కథ? కాపీ కథ?’
‘సొంతదే’
‘గుడ్. రెడీగా ఉండు’

******* 

అమితాబ్ ఇంట్లో కూచుని ఉన్నారు పూరి. ప్రాణం జివ్వుజివ్వుమని కొట్టుకుంటూ ఉంది. ఎన్నాళ్ల కల ఇది. అమితాబ్‌తో సినిమా.
కాసేపటికి మొదట పొడవైన నీడ ఆ తర్వాత పొడవైన మనిషి వచ్చారు. పెద్ద డిస్కషన్ పెట్టలేదు.
‘చెప్పండి పూరి.’
‘మీతో సినిమా’
‘ఏమిటి పాయింట్’
‘పాయింట్ ఏమీ లేదు. మీరు డాన్సులు చేస్తారు. ఫైట్‌లు చేస్తారు. దీవార్‌లోని యాంగ్రీ యెంగ్‌మేన్‌లా ఉంటారు’
అమితాబ్ ఆశ్చర్యంగా చూశారు.
‘ఈ వయసులోనా? నన్నింకా కుర్రాణ్ణనే అనుకుంటున్నావా?’
‘అనుకుంటున్నాను. టైటిల్ కూడా అదే. బుడ్డా హోగా తేరా బాప్’.

*******

జూలై 1, 2011.
బుడ్డా హోగా తేరా బాప్ దేశమంతా విడుదలయ్యింది.
10 కోట్లతో తీసిన సినిమా.
మొదటి వారం 12 కోట్లు వచ్చాయి. శాటిలైట్ రైట్స్ వల్ల 14 కోట్లు వచ్చాయి.
ఒక భాగం అమితాబ్‌కు. ఒక భాగం 18 మోషన్ పిక్చర్స్ వారికి. ఒక భాగం పూరి జగన్నాధ్‌కు.
బాలీవుడ్‌కు ఇది బ్రేకింగ్ న్యూస్.
ఇంత తక్కువలో తీసి ఇంత ఎక్కువ సంపాదించవచ్చా?
పూరి జగన్నాధ్ కోసం నిర్మాతలు ఫోన్లు మొదలుపెట్టారు.
పూరి యధావిధిగా తన కొత్త స్క్రిప్ట్ కోసం బ్యాంకాక్ బయలుదేరారు.

******* 

ఇంకా ఒకటిన్నర కోట్ల అప్పు మిగిలి ఉంది.
రేపోమాపో తీరిపోతుంది. మళ్లీ కొత్త ఆఫీసు కడతారు. మళ్లీ డ్యూప్లెక్స్‌లు కొంటారు. మళ్లీ సొంత ఇల్లు నిర్మించుకుంటారు.
ఇదంతా దేనివల్ల. నిలబడటం వల్ల. నిలబడాలని నిశ్చయించుకోవడం వల్ల.
ఇంటర్వ్యూ ముగించుకొని వస్తుంటే గోడ మీద కొటేషన్ కనిపించింది.
‘కార్చిచ్చులు వచ్చి వెళుతుంటాయి. అడవిలా ఉండు.
ప్రవాహంలో దుంగలు కొట్టుకొస్తాయి. సిద్ధంగా ఉండు’.
అదే రీచార్జ్.

పూరి స్పెషల్
జగన్ పుస్తకాల పురుగు. మహాకవి శ్రీశ్రీ, చలం, గోపీచంద్, శరత్, ముళ్లపూడి వెంకటరమణ, భానుమతి రామకృష్ణ, షేక్స్ స్పియర్, విశ్వనాథ సత్యనారాయణ రచనలతో పాటలు రామాయణం, భారతం, భాగవతాలను చిన్నతనంలోనే చదివేశారు.

జగన్ మంచి రచయిత అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. తను రాసిన తొలి కథ పేరు ‘తొలి చినుకు’. అదో అందమైన ప్రేమకథ. ఎక్కడా పబ్లిష్ కాలేదు. ఆ తర్వాత ఓ పాతిక కథలు రాశారు.

డిగ్రీ చదువుతున్నప్పుడు జగన్ బృందమంతా ఓ నాటకం వేశారు. నాటకం ఎలా వేస్తారో చెప్పే నాటకం అది. అందులో జగన్ మేకప్‌మేన్ పాత్ర వేశారు. డిగ్రీ తర్వాత ఆయన ‘మృదంగం’ అనే నాటకం రాసి, ఊళ్లోనే ప్రదర్శించారు.

జగన్‌కి వంట చేయడం కూడా వచ్చు. భార్య లావణ్యకు తనే వంట నేర్పారు.

జగన్ నాస్తికుడు కాదు. అలాగని ఆస్తికుడూ కాదు. ప్రపంచాన్ని ఏదో శక్తి నడిపిస్తుందని నమ్ముతారు. కానీ, దేవుణ్ణి అంతగా నమ్మరు. నాకు ఆ హెల్ప్ చేయ్, ఈ హెల్ప్ చేయ్ అంటూ దేవుని ముందు ఎప్పుడూ అప్లికేషన్లు పెట్టలేదంటారాయన. గుళ్లకు వెళ్లే అలవాడు కూడా లేదు.

జగన్‌లో మంచి పెయింటర్ కూడా ఉన్నారు. ఐదో తరగతి నుంచి బొమ్మలు బాగా వేస్తుండేవారు. స్కూల్లో ఎప్పుడు డ్రాయింగ్ కాంపిటీషన్ జరిగినా జగనే ఫస్ట్. ఆ పోటీకి ముందు నీకేం గిఫ్ట్ కావాలని అడిగిమరీ కొనేవారట. ఎందుకంటే ... జగన్‌కే ఫస్ట్ వస్తుందని వాళ్లకీ తెలుసు.

కృష్ణవంశీ తీసిన ‘గులాబి’, ‘నిన్నే పెళ్లాడతా’, ‘సిందూరం’ అలాగే రామ్‌గోపాల్‌వర్మ ‘రంగీలా’కు ట్రైలర్స్ కట్ చేసింది జగనే. థియేటర్ల దగ్గర మైకులు పెట్టి జనాభిప్రాయం తెలుసుకునే ‘పబ్లిక్ టాక్’ పద్ధతికి ఓ రకంగా జగనే ఆద్యుడు. ‘రంగీలా’తో ఆ విధానం ఓ ట్రెండ్ అయి కూర్చుంది. సినిమా ట్రైలర్స్ అనే కాకుండా, ఎల్‌ఎమ్‌ఎల్ వెస్పా స్కూటర్, ఆర్‌సిఎఫ్, ఎపిసిఇబి, గోదావరి డిఎపి.. ఇలా మొత్తం 20 వాణిజ్య చిత్రాలు జగన్ డెరైక్ట్ చేశారు.

జగన్ ఇంట్రడ్యూస్ చేసిన వారంతా మంచి పొజిషన్‌లో ఉన్నారు. అమీషాపటేల్, రేణుదేశాయ్, తనూరాయ్, సమ్రీన్, నీలాంబరి, రక్షిత, అశిన్, సమీక్ష, ఆయేషా టకీయా, అనుష్క, హన్సిక, నేహాశర్మ, శియా గౌతమ్, కంగనా రనౌత్... ఈ కథానాయికల జాబితా అంతా పూరి వల్ల తెలుగు తెరంగేట్రం చేసిన వారే. సంగీత దర్శకులు చక్రి, రఘుకుంచె, విశ్వ, గేయరచయిత భాస్కరభట్ల, కందికొండ, ఎడిటర్ వర్మ... వీళ్లందరికీ సినిమా ఇండస్ట్రీలో పెద్ద బ్రేక్ ఇచ్చింది జగన్.

ఇట్లు... పూరి జగన్నాథ్
పుట్టింది : 1966 సెప్టెంబర్ 28 విశాఖపట్నం జిల్లా బాపిరాజు కొత్తపల్లిలో
ఇంటిపేరు: పెట్ల
తల్లిదండ్రులు: సత్యవతి, సింహాచలం
తమ్ముళ్లు: ఉమాశంకర్‌గణేష్ ,సాయిరామ్‌శంకర్
భార్య: లావణ్య
సంతానం: కొడుకు ఆకాష్ , కూతురు పవిత్ర
చదివింది: బిఎస్సీ
నటుడిగా: శివ(హిందీ) ఇట్లు శ్రావణీ సుబ్రహ్మణ్యం, ఏ మాయ చేసావె

3 comments:

  1. great..inspiring...thanks for sharing..
    స్పీడ్ యుగం కావడం వల్ల దాసరి లా ముద్ర వేయలేకపోయారు గానీ.... పూరీ తప్పక ఒక కొత్త ట్రెండ్ సృష్టించిన డైరెక్టర్ గా చెప్పుకోవచ్చు తెలుగు సినిమాల్లొ...క్రియేటివిటీ ఉన్నవాళ్ళు మంచి బిజినెస్ మెన్ కాలేరా???

    ReplyDelete