స్వాగతం

ఖదీర్ బాబు గారి అభిమానులకు స్వాగతం

Thursday 23 August 2018

కథ మినార్ ఆవిష్కరణ

కథ మినార్ ఆవిష్కరణ 

కొన్ని జ్ఞాపకాలు అంతే 
ఆగకుండా ముంచెత్తుతూనే ఉంటాయి 
బహుశా వేసిన కొత్త దారి చూసుకొమ్మని కాబోలు !!



ఖదీర్ బాబు గారి మాటల్లోనే ..... 


రచయితలకు నమస్కరించుకుని....
వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ గార్ల ‘కథ’ పుస్తకాల ఆవిష్కరణ రోజంతా జరుగుతుంది. ఉదయం చాలామంది ఆవిష్కరణ సమయంలో ఉంటారు. భోజన విరామం తర్వాత సహజంగానే చాలామంది తగ్గుతారు. ఆ సమయంలో ఆ సంకలనంలోని రచయితలకు ‘కాంప్లిమెంటరీ కాపీ’ ఇస్తుంటారు. అందరూ ఉండగా ఇస్తే వాళ్లకు గౌరవం కదా అంటాను నేను. నా ‘ఖాదర్ లేడు’ కథను మధురాంతకం నరేంద్ర, రాసాని గార్లు ‘కథా వార్షిక’లో అచ్చు వేసి హైదరాబాద్‌లో ఆవిష్కరణ పెట్టారు. వేదిక మీద పిలిచి కాపీ ఇస్తారనుకొని వెళ్లాను. సభ ముగించుకుని వెళ్లిపోయారు. రెండు రోజుల పాటు తిరుపతికి ఫోన్లు చేసి మరీ వారితో పేచీ పడ్డాను. 25 ఏళ్ల కథాసాహితి బృహత్ సంకలనం వేసినప్పుడు తెలుగు యూనివర్సిటీకి వెళితే హాలు బయట ఐడి కార్డు చూపి కాంప్లిమెంటరీ కాపీ తీసుకోమనే అర్థంలో మాట్లాడారు. ఇది రచయితలకు అవమానం అని వేదిక మీద తగాదా పడ్డాను.
సంకలనాలు వచ్చాయి అంటే అందుకు కారణం సంపాదకులు కాదు... ప్రచురణకర్తలు కాదు... రచయితలు. వారు రాస్తేనే సంకలనాలు వస్తాయి. కనుక ఆవిష్కరణ అయిన వెంటనే తొలి కాపీ అందుకోవాల్సింది వారు. మొదటి నమస్కారం స్వీకరించాల్సిందీ వారు. ‘నూరేళ్ల తెలుగు కథ’, ‘కొత్త కథ’, ‘ఉత్తమ తెలుగు వాన కథలు’ సభలలో ఈ గౌరవం పాటించాను. నా సూచన అందుకుని ‘ప్రాతినిధ్య’ ఆవిష్కరణలోనూ ఇదే గౌరవం పాటించారు.
‘కథా మినార్’ ఆవిష్కరణలో ఆవిష్కరణ అయిన వెంటనే రచయితలకు సగౌరవంగా కాపీలు అందించాం. వేదిక మీద ఉన్న పెద్దలనే కాదు సభలో ఉన్న సాహితీకారులనూ ఇందులో భాగం చేశాం.
ఈ పని చేసినందుకు షరీఫ్, నేను ఎంతో సంతోషించాం.
ఫొటోలు చూస్తే మీరూ సంతోషిస్తారు.
పి.ఎస్: ‘కథామినార్’ అక్షరాలు రాసిచ్చిన లక్ష్మణ్ ఏలేకు మలిప్రతి.

Wednesday 1 August 2018

కథ మినార్

కథ మినార్ 
ఒక్కో పుస్తకం ఒక్కో అడుగుగా 
సాగుతూ ఉంటే 
కొన్ని కథలు కష్ట సుఖాలు చెప్పుకుంటే 
ఒకే కష్టం ఒకే పడవ మీద సాగితే 
అది ఒక చరిత్రే 
దానిని జ్ఞాపకంగా మలిచే మినారే 

ఖదీర్ బాబు,వేంపల్లి షరీఫ్ లు కలిసి ముందుకు 
తెస్తున్న కథల పుస్తకము ఇది. 

ఖదీర్ బాబు గారి మాటల్లోనే చదవండి ..... 



చూపుడువేలి చివర అశ్రువు
ఈ కాలం ఈ కథల కాలం. ఈ కాలం ఈ కథలు ఒక దగ్గర కూడవలసిన కాలం. ఈ కాలం ఈ కథలను పరికించాల్సిన కాలం. ఈ కాలం ఈ కథలతో తోడు నడవాల్సిన కాలం. కాలం ఎప్పడూ తనకు తానుగా పురిగొల్పి కొన్ని పనులు చేయించుకుంటుంది. వేంపల్లె షరీఫ్, నేను కలిసి చేసిన పని కాలం నిర్దేశనం వల్ల రూపుదిద్దుకున్నదే. ముస్లింల జీవితం, ఘర్షణ, వేదన, ప్రతిపాదన... వీటికి మించిన వర్తమాన చర్చనీయాంశం మరొకటి ఉన్నదా? అందుకే ఈ సంకలనం తయారైనది. మరో రకంగా చెప్పాలంటే ఒక ప్రాంతం తాలూకు నిర్దిష్టమైన మానసిక, భౌతిక స్పందన దేశ పరిణామాల పట్ల ఎలా ఉన్నదో తెలియడానికి ఈ ప్రయత్నం జరిగింది. అందుకే ‘ఆంధ్రప్రదేశ్’కు ప్రాతినిధ్యం వహిస్తున్న 23 మంది ‘ముస్లిం రచయితల’ 23 కథలతోటి ‘కథామినార్’ తయారైంది. ‘సలీం’ వంటి సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, ‘వేంపల్లె షరీఫ్’ వంటి యువ సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత ఈ పట్టికలో ఉండటం ముస్లిం కథ ఎంత ప్రతిభావంతంగా వికసించిందో తెలియడానికి ఒక సూచిక. షేక్ హుసేన్, వేంపల్లి అబ్దుల్ ఖాదర్, శశిశ్రీ (బేపారి రహంతుల్లా) వంటి ముందుతరం రచయితలతో పాటు ‘బా’ రహమతుల్లా, ఇనాయతుల్లా, డానీ వంటి మలితరం రచయితలు అక్కంపేట ఇబ్రహీం, మహమూద్, రెహానా, అమర్ అహ్మద్ వంటి ఈ తరం రచయితలు ఈ సంకలనంలో ఉండటం ముస్లిం కథ పరిపుష్టికి నమూనా. 2005 తర్వాతి కాలాన్ని పరిగణనలోకి తీసుకోవడం వల్ల ‘దాదాహయత్’ వంటి ఇద్దరు ముగ్గురు మేలిమి కథకులు ఈ సంకలనంలోకి రాలేదు. ముస్లిం కథలు మెజారిటీలను సెన్సిటైజ్ చేయడానికి వారితో ఎక్కువ సంభాషించడానికి రాయాలనే అభిప్రాయం ఒకటి ముస్లిం సమాజంలో ఉంది. ముస్లింల అంతర్గత సమస్యల సంగతి తర్వాత చూడవచ్చు అనే అభిప్రాయం కూడా ఉంది. కాని ఈ సంకలనంలోని కథలు లోపలి సమాజాన్ని బయటి సమాజాన్ని కూడా చూపుడువేలు చూపి నిలదీస్తాయి. పరిస్థితులను చర్చిస్తాయి. తమవైపు ద్వేషపు చూపుడువేలు ఆడించేవారిని ఆశ్రువులతో తడుపుతాయి. ఆరు నెలల సుదీర్ఘ శ్రమ... భిన్నమైన ఉద్వేగాల రాపిడి... సంతోషంతో కూడిన ఉద్వేగం... మావైపు నుంచి ఒక అంకం ముగిసింది. ఇక కరచాలనం మీ వంతు.
టైటిల్ లెటర్స్: లక్ష్మణ్ ఏలే; కవర్ డిజైన్: లేపాక్షి; పబ్లిసిటీ స్లైడ్: మహి బెజవాడ.