స్వాగతం

ఖదీర్ బాబు గారి అభిమానులకు స్వాగతం

Thursday 29 November 2012

''న్యూబాంబే టైలర్స్''లోని చిన్న కుర్రాడినే

''loveyourlife'' బ్లాగర్  ''అంకిసెట్టి''గారి
అభిప్రాయం ఇక్కడ.
అందరి అభిమానాలు ఇక్కడ పంచుకోవాలి అనే
సదుద్దేశ్యం తో ఇక్కడ ఇవటం జరిగింది.
thank you ankisetti gaaru
(ankisetty gaari link)

ay, May 15, 2004



Mr. khadeer babu, darga mitta kathalu.
poleramma banda. new bombay tailors..
they are very small in volume
but speak a lot in their emotions...
in new bombay tailors,
i never forgot the emotion it created in me,
i always get the oldguy of new bombay tailors
on my mental plane
whenever i think khadeer babu....

Tuesday 27 November 2012

“గెట్‌ పబ్లిష్‌డ్‌’'..రివ్యు



కాంతి అవరోధాన్ని కళ్లముందు నిలబెట్టిన ఖదీర్‌ బాబు కథానిక: “గెట్‌ పబ్లిష్‌డ్‌’!

apr  -   Sun, 28 Mar 2010, IST

తెలుగు కథానిక పురోగమనం నూరేళ్లుగా సాగుతూ వుంది. ఈ సుదీర్ఘ జైత్రయాత్రలో ఎన్నెన్ని విజయాలు, ఎన్నెన్ని మైలురాళ్లు! ఇదిగో ఇప్పుడు మరో విజయం, మరో మైలురాయి కథానిక పరిణామ వికాసాల్లో ఇరవై ఒకటో శతాబ్దం ఒక కొండగుర్తు కానున్నది. దానికి సూచనగా ఈ పదేళ్ల కాలంలోనూ చాలా గొప్ప కథలు వచ్చాయి. అవన్నీ దిగ్భ్రమ కలిగించే తేజోరేఖలు. ఇదిగో -మరో ప్రత్యేకమైన గొప్ప కథానిక, దిక్చక్రాన్ని తేజ:పుంజం చేస్తూ మన ముందు కొచ్చింది. అదే మహ్మమ్మద్‌ ఖదీర్‌ బాబు రచన “గెట్‌ పబ్లిష్‌డ్‌’! 36 పేజీల చిన్న పుస్తకం. ఏ పత్రికలోనూ రాకుండా, డైరెక్ట్‌ కతానికగా ప్రత్యేక బుక్‌లెట్‌గా వచ్చింది. (హైదరాబాద్‌ బుక్‌ట్రస్ట్‌ ఫ్లాట్‌ నెం. 85, బాలాజీ నగర్‌, గుడి మల్కాపూర్‌, హైదరాబాద్‌ -67 ఫోన్‌ 23521849) వారి ప్రచురణ. ఒక్కమాట. కథనిడివి 36 పేజీలే అనుకోవద్దు. గురజాడ వారి 5 కథానికల్లోనూ రెండు సరిగ్గా ఒక్కొక్కటి 36 పేజీలే వున్నాయి! ఎందరెందరో ప్రసిద్ధుల కథానికలు పెద్ద కథానికలే. ఇతివృత్తం “డిమాండ్‌’ అది!
చారిత్రక అవసరం అనదగిన ఈ “మాష్టర్‌ పీస్‌’ కథానికలో వస్తువుని ముందుగా తెలుసుకుందాం. షకీల్‌ ఒక బాధ్యతాయుతమైన పదవిలోని పాత్రికేయుడు. అతనొక రిపోర్ట్‌ తయారు చేస్తున్నాడు. ఆ రిపోర్టే ఈ కథానిక.
“గెట్‌ పబ్లిష్‌డ్‌’ లో (షకీల్‌ కాకుండా) మూడు పాత్రలు. ఒకటి ఏడేళ్ల ముష్టాక్‌. వాడు మసీదు దగ్గరికొచ్చేవారి చెప్పుల్ని భద్రపరిచి తిరిగి ఇచ్చేసే “”పని’’లో వున్నవాడు. “ముష్టాక్‌ నల్ల బంగారం. నల్ల ముత్యం. వాస్తవానికి వాణ్ణొక నల్లటి ముతకరబ్బరు బంతి అనాలి. చూడటానికి ముద్దుగా వుంటాడు. పట్టుకోవడానికి కండగా వుంటాడు’. “వాడి కళ్లల్లో కరెంటు ఉంటుంది. వొంట్లో తూనీగ ఎగురుతూ ఉంటుంది...’ వాడికి అమ్మా నాన్నా ప్రాణం. వారికి వీడు ఇంటిదీపం, కంటి వెలుగు. రెగ్యులర్‌గా మసీదుకు వచ్చీపోయే షకీల్‌కి -వీడొక ప్లెజంట్‌ స్మార్ట్‌ బాయ్‌. ముష్టాక్‌ తల్లి -ఫాతిమా -రెండోపాత్ర. “నేరేడు చెట్టు నీడలో, చుట్టూ చెప్పులు పెట్టుకుని, నల్లటి గువ్వలాగా...’ “ఆమె గొంతే ఆమె ఆకారం. ఆమె మాటే ఆమె వునికి...’ ఫాతిమా ఒక విలక్షణమైన ముస్లిం స్త్రీ. “మసీదులోని తెల్లటి గోడల మధ్య నల్లటి చారికలా కనిపిస్తూ ఉంటుందామె’ అంటాడు కథకుడు. ఇదీ వర్ణనాశిల్పం అంటే. పులుముడుకాదు. ఏకపదవాక్యంతో గుండె మీద ఆర్తినీ, అంత: కరణనీ గీరగలగాలి కథకుడు! ఆ తర్వాత ఆమె చుడీబజార్‌లో యాచిస్తూనూ కనిపిస్తూ ఉంటుందిట! ఇక, ఈమె భర్త- నయాబ్‌-మూడోపాత్ర. అతను అత్తర్‌ నయాబ్‌-పేరుకు. ఇతని కథ కొంచెం పెద్దదే. ఆటో డ్రైవర్‌గా, సెవెన్‌సీటర్‌ డ్రైవర్‌గా చేశాడు. ఏదీ అచ్చిరాలేదు. సంపాదనలేదు.
ప్రపంచంలో అక్కడక్కడా, అక్కడా ఇక్కడా -ఉగ్రవాదదాడులు, ఎవరు ఎవర్ని “టార్గెట్‌’ చేస్తారో, ఎందుకు చేస్తారో తెలీదు. విసిరిన పంజాదెబ్బకు ఎందరో మృతులు, ఎందరో క్షతగాత్రులు. అయితే పంజావిసిరిందెవరు? తెలీదు. అదో పెద్ద యక్షప్రశ్న. హైదరాబాద్‌లోనూ దుర్ఘటనలు. ఒక దురదృష్టకరరాత్రి.. బాగా పొద్దుపోయిన తర్వాత అన్నం ముందు కూర్చున్న నయాబ్‌ని లాగి, కొట్టి, ఫాతిమానీ నెట్టేసి గాయపరచి, ముష్టాక్‌కీ నాలుగు తగలనిచ్చి -నయాబ్‌ని “వాళ్లు’ లాక్కుపోయారు. ఆ తర్వాత జరగాల్సినదంతా జరిగింది. అదొక “ట్రీట్‌మెంట్‌ కథ’. ఇక్కడ ఫాతిమాని ఎవరు ఊరడించగలరు? ముష్టాక్‌ వొళ్లు తెలీని జ్వరంలో కాలిపోతున్నాడు. షకీల్‌ లాంటివాళ్లు అదీ ఇదీ చేద్దామని ముందుకొస్తే ఆమె తరస్కరిస్తుంది. ఉన్న వాళ్లిద్దరూ జీవచ్ఛవాలైనారు. దిగులు బండలయ్యారు. ఆ “ట్రామా’ అక్షరాలకి ఒదుగుతుందా!? చివరికి పదహారు రోజుల తర్వాత నయాబ్‌ని ఎవరో ఇంటి ముందు పడేసి పోయారు. కావడమే “మూలుగు’ వచ్చింది. బతికి వుండీ ఎందుకూ పనికిరాని ఒక మూటవచ్చింది. మీకూ నాకూ -నయాబ్‌ పరిస్థితిని అర్థం చేసుకోవటానికి -చాలా “బతుకు’ చిత్రాలు దోహదం చేస్తాయి. కళ్లకు కడతాయి. “మళ్లీ నవంబర్‌ 26 వచ్చింది’! ఆ తర్వాత వాళ్లు ఏమయ్యారో తెలీదు! అవును. ఇదే కథ! ముగ్గురు అమాయకుల ఛిద్రజీవన విషాదకావ్యం!
నయాబ్‌ కుటుంబం పడిన హింస. అనుభవించిన బాధ. జరిగిన హాని. ఎవరు బాధ్యుల? ఎవరు జవాబుదారీ వహిస్తారు? ఇవీ షకీల్‌ అడగయే అడుగుతున్న ప్రశ్నలు. సభ్యసమాజం జవాబీయవలసిన ప్రశ్నలు. “ఈ దేశంలో కొందరు ఐడెంటీ చూపలేరు. అలాగని ఐడెంటిటీలేని వారుగా కూడా బతకలేరు. అందుకనే ఒక్కోసారి వాళ్ల ఐడెంటీయే వాళ్లకు ప్రమాదం తెచ్చిపెడుతూ వుంటుంది’! ఇదీ “గెట్‌ పబ్లిష్‌డ్‌’ కథానికకు ఇతివృత్త కేంద్రకం.
రాజ్యహింసని నిరసిస్తూ అనేక ప్రక్రియల్లో ఈ సరికే అనేక గొప్ప రచనలు వచ్చాయి. కథానికలూ వచ్చాయి. ఒక వర్గం “ఎలియెనేషన్‌’ వస్తువుగా గుజరాత్‌గాయం గానూ ఎన్నో కథలూ ఎంతో కవిత్వమూ వెలువడినాయి. అయితే ఖదీర్‌బాబు రాసిన ఈ కథానిక వస్తుశిల్పాల్లో, శైలిలో అనన్య సామాన్యమైనది. వాస్తవికతనీ, భౌతిక సందర్భాన్నీ ఎందరో చెప్పగలరు. అయితే, కథానికకు శిల్పాన్నికూర్చి దాని, “స్పెసిఫిగ్‌ గ్రావిటీ’ని పెంచే శైలితో -వస్తువుకొక వాతావరణాన్నీ, నేపధ్యాన్నీ ఏర్పరచి ఈ కథని ఒక అసాధారణ రచనని చేశారు -ఖదీర్‌బాబు.
ఖదీర్‌బాబు శైలీశిల్ప పరిణతిలో ఉద్వేగం వుంది కానీ, ఉద్రేకం లేదు. ఆర్తి వుందికానీ ఆవేశం లేదు. ధర్మాక్రోశం వుంది కానీ మతమౌఢ్యం లేదు. సాహిత్య కారుడుగా జీవించాడతను. పరమ నిగ్రహంతో, నిర్మోహతతో -మని,తనానికీ, మంచి తనానికీ జరుగుతున్న -ఘోరమైన, దారుణమైన అన్యాయాన్ని నిరసించాడు. ఈ దేశం, ఈ ప్రజ, ఈ జాతి, ఈ సంస్కృతి -సడెన్‌’గా మరచిపోతున్న రవ్వంత అనురాగం గోరంత కారుణ్యాల ఆవశ్యకతని ఆవిష్కరించాడు. “ఒక్క దోషికి శిక్ష పడకపోయినా పర్వాలేదు కాని, నూరు మంది నిర్దోషులు తప్పించుకోవాలి’ అన్న న్యాయఘంటికని మళ్లీ మ్రోగించాడు.“
గెట్‌పబ్లిష్‌డ్‌’ -చదువరి మనసులో అగ్గిరగులుస్తుంది. ఛీకొట్టాల్సిన వారినీ, దానినీ ఛీ కొట్టిస్తుంది. అదే దాని శక్తి! మరోసారి, హేట్సాఫ్‌ టు ఖదీర్‌!!

Monday 26 November 2012

నామినితో ఖదీర్ బాబు

ఈయన ఎవరు?పరిచయం చేయాల్సిన పని లేదు కదా....
సరే రెండు ముక్కల్లో చెప్పాలంటే ఆకాశం లో 
విహరిస్తున్న కధల బాషని నేలకు తెచ్చి మట్టి పరిమళాన్ని,
పల్లెల ఆప్యాయతలను రుచి చూపించిన పుడింగి 
''నామిని సుబ్రహ్మణ్యం నాయుడు''గారు.

ఈయన ఖదీర్ గారి జీవిత గమనం లో తనదంటూ కొంత 
స్పూర్తిని కలిగించి ''నీ చుట్టూ ఉండేవారి జీవితాలనే నీవు 
ఎందుకు వ్రాయకూడదు?''అని ఖదీర్ గారి కధల 
ప్రవాహాన్ని ''దర్గామిట్ట కధలు''వైపు మళ్లించటం 
ఖదీర్ గారి జీవితం లోఒక చక్కని మలుపు.

ఎన్నో కోణాలలో సాన పెడితేనే కదా వజ్రం అంతగా మెరుస్తుంది.
ఎందరో మహానుభావుల మాటలే కదా వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచేది.

నామిని అంటే ఎవరు .....అమ్మ స్పర్శ,అమ్మ బాష స్పర్శ,
హృదయాన్ని తడిమే ఒక చక్కని ప్రేమ....
మరి ఈ ఫోటో ''ఖదీర్ బాబు ''గారికి తీపిజ్ఞాపకం ఏమో కదా...... 




Tuesday 20 November 2012

అమ్మ ప్రేమలో తడిసిన సన్నజాజి పరిమళాలు

ఖదీర్ బాబు గారి అభిమానులకు ఒక చిన్న మనవి.
ముఖ్యంగా పుస్తక ప్రియులకు .....
ఒక పుస్తకం యొక్క గొప్పదనం చదువరులు వివరించినపుడు 
దాని విలువ ,మాధుర్యం అందరికి తెలుస్తాయి.
మీరు ఖదీర్ గారి కధలు ఏవైనా చదివుంటే వాటిలో 
మీకు నచ్చిన విషయాలను ఇక్కడి వారితో సహృదయంతొ 
పంచుకోండి. ఒకరు వ్రాసిన కధ పై ఇంకొకరు వ్రాసినా పరవాలేదు.
ఎందుకంటె ఎవరి ''ఆలోచనా లోచనాలు'' వారివి ....
ఎన్నో సృజనాత్మక దారుల మధ్య మనం ఏ దారిలో 
పోతున్నాము అనేదే కదా మన ఉనికిని లోకానికి చాటేది.
మీరు ప్రొఫైల్ లో ఉన్న ''మెయిల్ ఐ.డి''కి పంపితే 
ప్రచురిస్తాము.అందరం పంచుకొని సంతోషిస్తాము.

ముందుగా ''దర్గామిట్ట కధలు''లోని ఒక చక్కని కధ 
''మా యమ్మ పూల వ్యాపారం''  ఏముంది దీనిలో?
అసలు దర్గామిట్ట కధలు అని నెల్లూరు జిల్లా సంకేతంగా 
పేరు పెట్టారట,తను కావలి వాస్తవ్యులు అయినప్పటికీ ....
ఎక్కడా తన బాషకి,యాసకి పక్కకి పోకుండా ఒక 
బిడ్డ తన తల్లి పేదరికపు అంచుల్లో ,బురఖా ముసుగు వెనుక 
యెంత గౌరవంగా కాపురాన్ని లాక్కోచ్చిందో చెప్పే తీరు 
మనలను ఆ అమ్మ కష్టానికి ,నిజాయితీకి మన కన్ను చెమర్చి  
నమస్సులు తెలియచేస్తుంది.ఎందుకంటె మనం అందరం 
మాత్రం తల్లులకు బిడ్డలమే కదా .....

ఒక్క సారి ఫోటో చూడగానే పూల పరిమళం గుప్పుమందికదా 
పల్లెల నుండి వచ్చిన వాళ్లకి వాళ్ళ ఊరి పరిమళం కూడా 
తగులుతుంది.ఏమి కనిపిస్తుంది మీకు దానిలో ....
మంచుబిందువుల్లో  తడిసిన స్వచ్చత అంతేనా?
కాని ఈ కధ చదివిన తరువాత మనకు ....పూలను 
హత్తుకున్న అమ్మశ్రమతొ నిండిన స్వేదబిందువులు, 
ఆ చెట్టుతో అల్లుకుని పూలను పైసలుగా మార్చి పిల్లలను 
సాకిన పేదరికపు జీవితాలు కనిపిస్తాయి.

కధ మొత్తం ఖదీర్బాబు గారు స్వగతం లాగా సాగుతుంది.
ఎలా పేదరికం లోని డబ్బులు కరువు పూర్తికాని ఇల్లుగా 
మారి పరదాలు లేని కిటికీలు మనుషుల బ్రతుకులను 
చూపిస్తాయో,కనీసం సన్నజాజి తీగ పరదా గా వాళ్ళు ఎలా
గౌరవాన్ని కాపాడుకుంటారో తెలుస్తుంది.

కధలోకి వస్తే ''మా అమ్మ కోసే సన్నజాజి పూలని లెక్క పెట్టాలని 
నాకు భలే కోరిక.కోసినాక పూవు పూవుని లెక్కపెట్టి 
నేనే ''పూల రిహానాబీ''కి అమ్మాలని ఆ వచ్చే డబ్బులను నా సొంతానికి 
దర్జాగా వాడుకోవాలని కోరిక''అంటూ పూలవ్యాపారం 
గురించి చెపుతూ మొదలుపెడతారు కధని.ఇంతకీ వంద పూలు 
అమ్మితే యెంత వస్తుందో తెలుసా ?ఇరవై పైసలు అని ,
పూలు అందక వదిలేస్తే వాళ్ళ అమ్మ ''నయాపైసలు రా 
నాయనా గాలికి పోతాఉండాయి''అని వాళ్ళ అమ్మ పడే బాధలో 
ఆ రోజుల్లో పైసా కి ఉన్న విలువ ,వాటితో కాపురాన్ని 
గుట్టుగా లాక్కోచ్చిన వైనం ఇమిడిఉన్నాయి.
వాళ్ళ అమ్మ పూలచెట్టు ఎందుకు వేసింది,దానిని ఎలా జాగ్రత్తగా 
సాకింది ,యెంత ముఖ్యమైన భాగం గా ఆ చెట్టు మారింది 
ఖదీర్ బాబు కధనం మనకు తెలీకుండానే ఆ అమ్మ కష్టం 
లో బాగం పంచుకునేటట్లు చేస్తుంది.
చివరికి అమ్మ దగ్గర కొనుక్కొనే పూల రిహనాబీ డబ్బులు 
ఇవ్వక అమ్మకి తనకి తగువు పడిన వైనం,
పూల రిహానాబి పేదరికపు సవ్వడి సాటి ఇల్లాలు అయిన 
తన తల్లిని కంట తడి పెట్టించిన వైనం మనలను యెంత 
పేదరికం లో అయినా మనుషులు ఆనాడు మరచిపోని 
మమతలు గుర్తు చేస్తాయి.
యమ్మ,నాయన,ఇస్టీలు ,దఫాకు,కాలు సాపుకొని 
ఇలాగా నెల్లూరు యాస తెలిసిన వారి మనసు గంతులు
వేసేలా ఉన్నాయి.చిన్న చిన్న పదాలతో ముందుకు 
సాగే కధనం ఎవరికైనా కధ వ్రాయటం యెంత సులువు 
అనిపించేలా చేస్తుంది.ఉయ్యాలాలా మనసు ఊపిన 
కధ చివరికి అమ్మలా కష్టాలు ఎవరు తీర్చగలరు?
అనే ముగింపుతో భారంగా ముగుస్తుంది.

Friday 16 November 2012

ప్రియమణి ...రీచార్జ్

మనుషులు తమలోని లోపాలు చూసుకుంటూ...
తమ పనితనం లోనే కాదు దేవుడు ఇచ్చిన శరీరం లో 
కూడా లోపాలే చూసుకుంటూ ఉంటారు.
 ఒక్క అడుగు ముందుకు వేయాలన్నా 
భయపడుతుంటారు.
కాని వాళ్ళు తమ బలాల వైపు దృష్టి మళ్లించి ముందుకు 
అడుగు వేస్తె విజయం తప్పక సొంతం అవుతుంది.
''ప్రియమణి రీచార్జ్''ఖదీర బాబు గారి మాటల్లో 

మనిషి చక్రం కనిపెట్టాడు. ఎందుకంటే ఒకేచోట ఉండటం ఇష్టం లేక.
మనిషి వలస వెళ్లాడు. ఎందుకంటే అవకాశాలు లేనిచోట ఉండటం ఇష్టం లేక.
మనిషి దుఃఖపడ్డాడు. ఎందుకంటే సంతోషాన్ని కోల్పోవడం ఇష్టం లేక.
మనిషి గెలవడం నేర్చాడు. ఎందుకంటే ఓడిపోవడం ఇష్టం లేక.
గెలుపును ప్లస్‌గా ఓటమిని మైనస్‌గా సంతోషాన్ని ప్లస్‌గా దుఃఖాన్ని మైనస్‌గా
తూకం వేసుకుంటూ నిత్యం ఘర్షణను అనుభవిస్తూనే ఉన్నాడు.
కాని- రెంటినీ సమానంగా చూడొచ్చు కదా అంటారు ప్రియమణి.
ఆమె తన జీవితంలో ఒక్కరోజు కూడా డిప్రెషన్‌ను ఫీల్ కాలేదు.
ఒక్కరోజు కూడా ఏడుస్తూ దుప్పటి ముసుగుతన్ని పడుకోలేదు.
కళ్ల కింద చారలు, ఒంటరి గదిలో ఆలోచనలు ఎరగరు.
‘ఇట్స్ ఓకే’ అనుకోవడం ఆమె ధోరణి. ఈజీగా తీసుకోవడం ఆమె తత్త్వం.
పాదరసంలా ఏ ఉద్వేగానికీ అంటకుండా జీవించడంలోని సులువు ప్రియమణి కథలో తెలుస్తుంది.
ప్రతి సంఘటన నుంచి మనిషి రీచార్జ్ కావచ్చు... కాకపోతే ఎవరికి వారే
ఆ శక్తిని సమకూర్చుకోవాలని కూడా ఈ కథ చదివితే అర్థమవుతుంది.


ఇంటర్వ్యూ, కథారూపం : ఖదీర్

ఈ జీవితం నీకు జాతీయ ఉత్తమనటి అవార్డునిచ్చి గౌరవిస్తుంది.
ఇదే జీవితం ఫలానా వాడితో ఎఫైర్ అంటగట్టి అవమానిస్తుంది.
ఒకటి ప్లస్. రెండోది మైనస్.
రెండూ జీవితం ఇచ్చిన బోనస్.
దీనిని సరిగ్గా అర్థం చేసుకోవాలి.
లేకుంటే బతకలేవు. కాకుంటే చచ్చిపోతావు.

******

ప్రియమణికి చిన్నప్పుడు చాలా పొడవైన జుట్టు ఉండేది. రోజూ ఆ జుట్టును అద్దంలో చూసుకొని, ముందుకూ వెనక్కూ తిరిగి పరికించుకొని, మురిసి, వాళ్లమ్మ బుగ్గచుక్క పెట్టబోతుంటే బుగ్గ మీద వద్దని- జుట్టుకు దిష్టి తగలకుండా పాపిట మధ్యన పెట్టమని- అలా ఆ జుట్టును చూసుకునేది. వెర్రిగా తాపత్రయపడేది.
కాని- ఒకరోజు- తనతో ఆటలో గొడవపడిందని- తన ఈడుదే- మేనత్త కూతురు- ఒకరోజు రాత్రి ప్రియమణి నిద్రపోతుండగా జుట్టంతా బబుల్‌గమ్ అంటించేసింది.
తెల్లారితే స్కూల్లో ఫంక్షన్.
ప్రియమణి నిద్రలేచింది. ఇల్లంతా భయంభయంగా ఆవలించింది. ప్రియమణి అద్దంలో చూసుకుంది. జుట్టు వైపు చూసుకుంది. బబుల్‌గమ్ నుంచి జుట్టును విడిపించడానికి ప్రయత్నించింది. ఇక అది సాధ్యం కాదని అర్థమయ్యాక- ఎంత ప్రయత్నించినా జుట్టు బాగుపడదని అర్థమయ్యాక- మారుమాట్లాడకుండా- ఒక్క ఏడుపైనా ఏడవకుండా- నేరుగా బార్బర్ షాపుకు వెళ్లి- బాబ్‌కట్ చేయించుకుని- ఇంటికి వచ్చి అద్దం ముందు చూసుకొని- ముందుకూ వెనక్కూ తిరిగి పరికించుకొని- మురిసి- ఎప్పట్లాగే తల్లి చేత పాపిట మధ్యన దిష్టిచుక్క పెట్టించుకొని స్కూలుకు వెళ్లిపోయింది.
అంతే.
అంతకు మించి ఒక్క ఎక్కువ లేదు. ఒక్క తక్కువా లేదు.
బహుశా ప్రియమణికి ఆ వయసుకే ఏమని అర్థమై ఉండాలి.
జీవితం అంటే ఇంతే. అది నీకు పొడవైన జుట్టునిస్తుంది. ఆ వెంటనే దానికో బబుల్‌గమ్ కూడా అంటిస్తుంది. రెంటినీ సమానంగా చూస్తేనే హాయి. లేదూ పొడవైన జుట్టు దగ్గరే ఆగిపోతాను, అది పోయినందుకు ఏడుస్తాను, నెత్తి పగలకొట్టుకుంటాను అని అంటే ఏడు. అది నీ ఫెయిల్యూర్.
బాబ్‌కట్‌కి షిఫ్ట్ అయ్యావా అది నీ సక్సెస్.
ఇంకోమాటలో చెప్పాలంటే అది నీ రీచార్జ్.

******

ఆగిన మనిషికి చరిత్ర లేదు. ఆగిన మనిషికి అన్నం కూడా లేదు. ఆగి, ఏడ్చి, మొత్తుకొని, మనిషి అలా ఎప్పుడూ లేడు. 14వ శతాబ్దం నాటికి తమిళనాడు షేక్ అయ్యింది. చోళ, పాండ్య వంటి మహామహా సామ్రాజ్యాల పరంపర ముగిసిపోయింది. ఉత్తరాది దండయాత్రలు మొదలైనాయి. ఏనుగులు గుర్రాలు మొఘలు ఖడ్గాల ఖణఖణలు... గడ్డురోజులు. అయ్యో ఇప్పుడెలా అనుకున్నవాళ్లు పోయారు. లేదూ, ఈ పరిస్థితిని దాటాలి అని ప్రయత్నించినవాళ్లు బతికి బట్టకట్టారు. అలా బతికి బట్టకట్టిన వాళ్లల్లో తమిళ అయ్యర్లు కూడా ఉన్నారు. రాచరిక వ్యవస్థలో ఉపాధికి దిగుల్లేకుండా ఉన్న వీళ్లంతా ఆ తర్వాతి కాలంలో వలస వెతుక్కున్నారు. రకరకాల ప్రాంతాలలో రకరకాల పనుల్లో నిమగ్నమయ్యారు. చాలాపెద్ద సంఖ్యలో తమిళనాడు సరిహద్దుదాటి దాపునే ఉన్న ‘పాల్‌ఘాట్’లో స్థిరపడ్డారు. పాల్‌ఘట్ కేరళలో ఉన్నా, వీళ్లంతా పాల్‌ఘాట్ అయ్యర్‌లుగా గుర్తింపు పొందినా, వలస వచ్చి వందల ఏళ్లు గడిచిపోయినా, వీళ్లంతా తమిళ రక్తాన్ని వీడలేదు. తమిళభాషను వీడలేదు. కష్టించి పని చేయడం కాలంతో పాటు కదిలి వెళ్లడం మానలేదు. అట్లాంటి అయ్యర్‌ల కుటుంబంలోనే ప్రియమణి పుట్టింది. తల్లి బ్యాంక్ ఎంప్లాయి. తండ్రి తేయాకు తోటల్లో పని చేసే ఉద్యోగి. ఊళ్లో చాలామంది బంధుగణం. చుట్టూ కొబ్బరి చెట్లు. తెల్లవారిలేచి చూస్తే పచ్చటి పిలకలేసి కనిపించే అరటి చెట్లు. సాయంత్రమైతే పిల్లలంతా కలిసిమెలిసి చేసే అల్లరి. ఆటలు. వినోదాలు.
రోజులు ఇలా గడిచిపోతే చాలు.
కాని రోజులు ఇలాగే గడిచిపోతే అది జీవితం ఎందుకు అవుతుంది?

******

‘మళ్లీ మనం బయలుదేరాలి. వలస’ అన్నారు వాసుదేవమణి.
‘ఎక్కడికి?’ అంది భార్య.
‘బెంగుళూరు’ అన్నారాయన.
‘ఎందుకు?’ అని ఆమె అడగలేదు.
వరండాలో నిశ్శబ్దంగా, మంచం మీద నిద్రపోతున్నట్టుగా, అయోమయంగా పడి ఉన్న మామగారిని చూసింది. ఆయనకు పార్కిన్‌సన్ వ్యాధి. ముదిరిపోయింది. పాల్‌ఘాట్‌లో చేయవలసిన వైద్యమంతా చేశారు. బెంగుళూరుకు పోయి సాధించేది కూడా ఏమీ లేదు. అలాగని కన్నతండ్రిని వదిలేస్తామా? మంచి వైద్యం చేయించకుండా మానేస్తామా?
‘పాల్‌ఘాట్‌తో మనం ఇంతగా పెనవేసుకొని పోయాం. మనవాళ్లంతా ఇక్కడే ఉన్నారు. బెంగుళూరుకు పోయి ఎలా బతకడం. ఉద్యోగాలు కూడా వదిలేయాలే’
‘తప్పదు’
‘ప్రియ దిగులు పెట్టుకుంటుందేమోనండీ’ అందామె.
ఆయనేం మాట్లాడలేదు. వాకిలిలో, పెరడులో వెతికి, పిల్లలతో ఆడుకుంటున్న ఆ పిల్ల చేతిని పట్టుకొని, ఆర్తిగా దగ్గర కూచోబెట్టుకొని- ‘ఏమ్మా. మనం ఈ ఊరు వదిలేసి బెంగుళూరు వెళ్లిపోతే నువ్వేమైనా దిగులు పెట్టుకుంటావా?’ అని అడిగారు.
ప్రియమణి ఒక నిమిషం ఆలోచించింది.
‘దిగులు ఎందుకు నాన్నా?’
‘నీ ఫ్రెండ్స్ బంధువులు అంతా ఇక్కడే ఉన్నారు కదా’
‘వాళ్లంతా ఎక్కడికి పోతారు నాన్నా? ప్రతి సమ్మర్‌కు వచ్చి కలవ్వొచ్చు. బెంగుళూరుకు వెళదాం. సిటీ. మోడ్రన్‌గా ఉంటుంది. సినిమా హీరోలను చూడొచ్చు. కన్నడ నేర్చుకోవచ్చు.’
తండ్రి ప్రియమణివైపు విస్మయంగా చూశారు. తల్లి ఆశ్చర్యంతో నోరు తెరిచింది.
‘అదేమిటే... నీకు చీమకుట్టినట్టయినా లేదా?’
ప్రియమణి తల్లివైపు చూసింది. ఆ తర్వాత తండ్రివైపు తిరిగి, ఆయన కాలర్ సవరిస్తున్నట్టుగా నటిస్తూ రహస్యాన్ని అభినయిస్తూ అంది- ‘పాపం అమ్మకు మనసొప్పుతున్నట్టులేదు నాన్నా. ఆమెను ఇక్కడే వదిలేసి మనం వెళ్లిపోదామా?’

******

వెడల్పు ముక్కు. కనుక ముక్కుపిల్ల అని పేరు. బక్కగా ఉంటుంది. కనుక బక్కపిల్ల అని పేరు. నల్లగా ఉంటుంది. కనుక నల్లపిల్ల అని పేరు. అబ్బాయిలతో ఆడుతుంది. కనుక మగపిల్ల అని పేరు. బెంగుళూరు బనశంకరి ఏరియా సెకండ్ స్ట్రీట్‌లో ప్రియ పేరు చెప్తే చాలు నొటోరియస్. చదువు మీదా? శ్రద్ధ లేదు. అట్టలు తండ్రి వేయాలి. హోమ్‌వర్క్ అన్న చేయాలి. స్కూల్ బ్యాగ్ తల్లి మోయాలి. ముప్పయి ఐదు మార్కులు వస్తే పాస్ కనుక అంతకు చదివితే చాలు. అలాగని తెలివైనది కాదా అంటే చాలా తెలివైనదే. కాని ఒక్క సబ్జెక్టూ చదవదు. ఇంగ్లిష్ తప్ప.
ప్రియమణి చిన్నప్పటి నుంచి టివిలో ఇంగ్లిష్ వార్తలు చూసేది. తండ్రి తెప్పించే హిందూ పేపర్‌ని ఈ మూల నుంచి ఆ మూల దాకా క్షణ్ణంగా చదివేది. స్కూల్లో ఇంగ్లిష్ టెక్స్ట్‌బుక్‌ను మొదటి మూడు నెలల్లోనే పూర్తి చేసేది. రాత్రి పూట డిక్షనరీ పక్కన పెట్టుకొని నిద్రపోయేది.
ప్రియమణితో ఇంగ్లిష్‌లో మాట్లాడాలంటే టీచర్లు కూడా కొంచెం జంకేవారు.
తల్లికి ఇది ఆశ్చర్యం.
‘ఎందుకే ప్రియా. అన్ని సబ్జెక్ట్‌లూ వదిలేసి ఒక్క ఇంగ్లిష్‌ని పట్టుకొని ఊగులాడుతున్నావు?’ అని అడిగేది.
ప్రియ నవ్వేది.
‘నీకు తెలియదులే అమ్మా. దానినే జనరేషన్ గ్యాప్ అంటారు’ అనేది.
‘ఏడ్చావులే. ఎచ్చులు ఆపి సమాధానం చెప్పు’ అని తల్లి వెంటపడేది.
అప్పుడు ప్రియ సమాధానం చెప్పేది- ‘అమ్మా. మలయాళం వస్తే కేరళలో బతుకుతావు. కన్నడ వస్తే కర్నాటకలో బతుకుతావు. తమిళం వస్తే తమిళనాడులో మేనేజ్ చేస్తావు. ఇవన్నీ సింగిల్ పాకెట్‌లు. అదే ఇంగ్లిష్ నేర్చుకుంటే గ్లోబ్‌లో ఎక్కడైనా బతకొచ్చమ్మా. ఆరు పాకెట్‌ల ప్యాంట్ వేసుకొని తిరిగినట్టే’
తల్లి విస్మయంతో నోరు వెళ్లబెట్టేది.
ప్రియ తర్వాతి షాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యేది.

******

బృందావన్ గార్డెన్స్‌లో కావేరీ నీళ్లు ఎగుడు దిగుడుగా ప్రవహిస్తున్నాయి. బెంగుళూరు స్టూడెంట్స్ పిక్‌నిక్‌కు వచ్చారంటే బృందావన్ గార్డెన్స్‌లోని వాచ్‌మెన్‌లు వేయి కళ్లతో కాపలా కాస్తారు. స్టూడెంట్స్ వస్తే పూలకు గ్యారంటీ లేదు. నీళ్లకూ గ్యారంటీ లేదు.
‘సో... వాట్ నెక్ట్స్’ అడిగిందో స్నేహితురాలు చున్నీని ఎద మీదకు లాక్కుంటూ.
వాళ్లంతా దాదాపు పదిహేనుమంది ఉన్నారు. ఇంటర్ స్టూడెంట్స్. ఫైనల్ ఎగ్జామ్స్ బండ టెన్షన్‌కు ముందు కాస్తంత ఆటవిడుపుగా ఉంటుందని మైసూరుకు వచ్చారు. ఇంటర్ అయిపోతే ఎవరి దారి వారిది. ఇప్పుడే మాట్లాడుకోవాలి ఏం మాట్లాడుకున్నా.
‘నాకు క్లారిటీ ఉంది’ అంది ప్రియమణి.
‘ఏం క్లారిటీ?’
‘ఏముంది. డిగ్రీ చేస్తా. బిఇడి. ఇంగ్లిష్ టీచర్ అయిపోతా. లేదంటే నా ఇంగ్లిష్‌కు ఎయిర్ హోస్టెస్ జాబ్ వస్తుంది. చేస్తా. కాదంటే హోటల్ రంగం ఎలాగూ ఉంది. అది నాలాంటి వాళ్లను రారా అని పిలుస్తుంటుంది’
స్నేహితురాళ్లంతా ఏమీ మాట్లాడలేదు. బృందావన్ గార్డెన్స్ నీళ్లతో రంగులతో రంగురంగుల నీళ్లతో కళకళలాడిపోతోంది. కొన్ని వందల సినిమాలు తీసుంటారక్కడ. కొన్ని వందల పాటలు.
‘ఏం చేసినా నీ మీద ఈ బృందావన్‌గార్డెన్స్‌లో ఒక పాటైతే తీయరు కదా. అలాంటి జీవితం దొరకాలే. అదృష్టం అంటే అదీ’ అందో స్నేహితురాలు.
ప్రియ ఆ స్నేహితురాలివైపు చూసింది. నిజమే. ఈ ఆలోచన తనకు తట్టనే లేదు. టీచర్‌గా చేసినా, ఎయిర్ హోస్టెస్‌గా చేసినా, హోటల్ రిసెప్షనిస్ట్‌గా చేసినా చిల్లర డబ్బులు. డబ్బుకు డబ్బు గుర్తింపుకు గుర్తింపు రావాలంటే గ్లామర్ ఫీల్డుకు వెళ్లాలి.
‘మంచి ఐడియా. మనం ఎందుకు ట్రై చేయకూడదు. సినిమా కాకపోతే మోడలింగ్’ అంది ప్రియ.
ఫ్రెండ్స్ అందరూ నవ్వారు.
ప్రియ వాళ్లవైపు అయోమయంగా చూసింది.
‘ఎందుకు నవ్వుతున్నారు?’
‘నువ్వు మోడలింగ్ ఏమిటే ప్రియా. నీ ముక్కు చూసుకున్నావా అద్దంలో. నిన్నెవరు తీసుకుంటారు మోడల్‌గా?’
ప్రియ ఏమీ మాట్లాడలేదు. ఆ మాట అన్న ఫ్రెండ్‌వైపు జాలిగా చూసి ‘నువ్వు త్వరలోనే చస్తావ్’ అంది.
ఈసారి ఆ ఫ్రెండ్ అయోమయంగా చూసింది. ‘నేను చావడమేమిటి?’ దిమ్మెరపోతూ అడిగింది.
‘జీవితాన్ని ఇలా చూసేవాళ్లెవరైనా త్వరలోనే చస్తారు’ అంది ప్రియ.
ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ ప్రియవైపు చాలా ఆసక్తిగా కుతూహలంగా చూశారు.
ప్రియ అంది- ‘వినండి. మీరు మైనస్‌ని చూడకండి. మీలో అయినా నాలో అయినా. ప్లస్‌ని చూడండి. నా ముక్కు బాగోదు. ఒప్పుకుంటాను. కాని నా కళ్లు బాగుంటాయి. కనుక కాటుకకు మోడల్‌గా చేస్తాను. చెవులు బాగుంటాయి. కనుక కమ్మలకు మోడలింగ్ చేస్తాను. పెదాలు బాగుంటాయి. కనుక లిప్‌స్టిక్‌కి మోడలింగ్ చేస్తాను. పళ్లు బాగుంటాయి. కనుక పేస్ట్‌కు మోడలింగ్‌గా చేస్తాను. నా నడుము బాగుంటుంది. ఏం చీరలకు మోడలింగ్ చేయలేనా?’
బృందావన్ గార్డెన్స్‌లో నీళ్లు ఇక్కడ ఒక రంగు లేకపోయినా అక్కడ ఒక రంగుగా ప్రవహిస్తూనే ఉన్నాయి.

******

బయట చెప్పులు కుప్పలు తెప్పలుగా ఉన్నాయంటే లోపల డెరైక్టర్ భారతీరాజా ఉన్నట్టు గుర్తు. ఆయన ఉన్న దరిదాపుల్లో ఎవరూ చెప్పులతో నడవరు. ఆయన ఉన్న చోట పెద్దగా మాట్లాడరు. ఆయన ఉన్న చోట ఎవరికైనా నవ్వు వస్తుందో రాదో తెలియదు.
ఆయన చాలాసేపుగా తన కేబిన్‌లో ప్రియ కోసం వెయిట్ చేస్తున్నారు. ఏదో కన్నడ పేపర్‌లో ఆయన ప్రియ ఫొటో చూశారు మోడల్‌గా. బాగుంది నేను తీయబోతున్న సినిమాలో హీరోయిన్‌గా తీసుకుంటాను రమ్మనండి అని కబురు చేశారు బెంగుళూరు ఏజెన్సీకి. వాళ్లు ప్రియను పంపుతామన్నారు. టైమయ్యింది. ప్రియ రావాలి. భారతీరాజా వెయిట్ చేస్తున్నారు. తన సర్వీస్‌లో ఆయన ఎంతోమంది కొత్త హీరోయిన్‌లను పరిచయం చేశారు. ఎంతోమందికి తొలిసారి స్క్రీన్‌టెస్ట్ నిర్వహించారు. తన దగ్గరకు వచ్చిన ప్రతి హీరోయిన్ వినయ విధేయతలతో ఒంగి నడిచేది. తానేమంటానో అని భయపడిపోయేది. ఆ భయం నుంచి బయటకు తేవడానికే తనకు చాలా సమయం పట్టేది. ఇప్పుడు మళ్లీ అలాంటి తతంగం అంతా తప్పదు అనుకుంటూ ఎదురు చూస్తున్నారు.
కాసేపటికి కాబిన్ డోర్ నాక్ అయ్యింది. ఒక ముఖం లోపలికి తొంగి చూస్తూ, భారతీరాజావైపు ప్రశ్నార్థకంగా చూస్తూ ‘మిస్టర్ భారతీరాజా?’ అని ప్రశ్నించింది.
భారతీరాజా అదిరిపోయారు. పై నుంచి కింద దాకా చూశారు. ప్రియమణి. పాదాలకు చెప్పులతో నిలుచుని ఉంది.
‘రా ప్రియా రా’ అని సర్దుకుంటూ లేచి నిలబడ్డారు. సాధారణంగా ఆయన నిలబడినప్పుడు కొత్తవాళ్లు టక్కున పాదాలకు నమస్కారం చేస్తారు. ప్రియమణికి ఆ అవకాశం ఇవ్వడానికే ఆయన లేచి నిలబడ్డారు.
ప్రియమణి కూచుంది. కనుక భారతీరాజా కూచోవాల్సి వచ్చింది.
‘ఊ. చెప్పు. హీరోయిన్‌గా చేయడానికి నీకున్న అర్హత ఏమిటి?’
‘మీరు కబురు చేశారు కదా. అదే అర్హత’
భారతీరాజా తల పంకించారు.
‘యాక్టింగ్ నేర్చుకున్నావా?’
‘లేదండీ. కాని మీకేం కావాలో గ్రహించి చేయగలను. మీరు చెప్పింది చెప్పినట్టు చేయగలను’
‘ఏం చేయగలవు? నా వంటి డెరైక్టర్ కనిపిస్తే పాదాలకు నమస్కారం చేయాలని కూడా తెలియదు నీకు. ఇక నేను చెప్పింది ఏం వింటావ్’ భారతీరాజా ఛాన్స్ తీసుకున్నారు. ఆయనకు తెలుసు. తన ఎదురుగా నిలుచుంది ఆఫ్ట్రాల్ ఒక కొత్త హీరోయిన్.
ప్రియ లేచి నిలుచుంది.
‘బై సార్’
‘ఏంటి వెళ్లిపోతున్నావ్?’
‘సార్. మీరు టాలెంట్ చూడాలి. అంతే తప్ప మీ కాళ్లు పట్టుకున్నానా లేదా అనేది కాదు. ఇంకో సంగతి. నేను మీకు అవసరం అనుకోండి. అప్పుడు మీ పాదాలను పట్టుకోకపోయినా నన్ను పెట్టుకుంటారు. నేను మీకు అనవసరం, పనికిరాను అనుకోండి. అప్పుడు మీ కాళ్లు పట్టుకున్నా ఒళ్లో కూచున్నా చాన్స్ ఇవ్వరు’
భారతీరాజా ప్రియమణివైపు దీర్ఘంగా చూశారు. అగ్గిరవ్వ. ఆ తర్వాత నవ్వుతూ అన్నారు- ‘నాకు నీ ఆటిట్యూడ్ నచ్చింది. నిన్ను సెలెక్ట్ చేస్తున్నా’
‘బట్ ఒన్ కండీషన్ సార్’
భారతీరాజా ముఖంలో నవ్వు మాయమైంది. తనకే కండీషన్లా?
‘ఏమిటో చెప్పు’
‘మీరు కొత్త హీరోయిన్లకు ‘ఆర్’ అక్షరం మీద కొత్త పేర్లు పెడుతుంటారు. ‘పి’ కూడా ఏం తక్కువ అక్షరం కాదు సార్. సాక్షాత్తు పరమేశ్వర శబ్దమే ‘పి’ మీద మొదలవుతుంది. నన్ను ‘ప్రియమణి’గానే ఇంట్రడ్యూస్ చేయండి’.
నిప్పురవ్వ!
భారతీరాజా తన బెదురుపాటును, అదురుపాటును ఒళ్లు విరుచుకోవడంలో కలిపేసి ‘సరే’ అన్నారు సంతోషంగా!

******

2003.
‘కంగలల్ కైదు సై’.... భారతీరాజా డెరైక్షన్‌లో ప్రియమణి మొదటి సినిమా- ఫ్లాప్.
అదే సంవత్సరం రిలీజైన ప్రియమణి తెలుగు సినిమా ‘ఎవరే అతగాడు’- ఫ్లాప్.
ఆ తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన బాలూ మహేంద్ర సినిమా- సోసో.
ఇంకో తమిళం, ఒక మలయాళం- సోసో.
ప్రియమణి వచ్చింది. ప్రియమణి పోయిందా?
‘ఏమిటే ఇలా జరిగింది’ అని చాలా కంగారు పడింది ప్రియమణి తల్లి. ఇంకో హీరోయిన్ అయితే ఈసరికి తట్టాబుట్టా సర్దుకొని పాల్‌ఘాట్ వెళ్లిపోవాలి. ఈ ఫ్లాప్‌లకు డిప్రెషన్‌లో కుంగిపోవాలి.
ప్రియమణి పట్టించుకోలేదు. జిమ్‌లో చేరింది. వ్యాయామాలకు కారే చెమటలోనే ఓటముల చేదు జ్ఞాపకాలను విసర్జించేసింది.
ఆరునెలల్లో రిఫ్రెష్ బటన్ నొక్కినట్టుగా ఫ్రెష్‌గా తయారయ్యి తల్లితో అంది- ‘అమ్మా. కంగారు పడకు. ఈ ఫీల్డు నాకు భారతీరాజా బాలూ మహేంద్ర వంటి వాళ్లతో అవకాశాలు ఇచ్చింది. ఇదే ఫీల్డు నేను ఊహించని విధంగా ఫ్లాపులు కూడా ఇచ్చింది. అవకాశాలను పాజిటివ్‌గా చూసి ఫ్లాప్‌లను నెగెటివ్‌గా చూస్తే ఔట్ అయిపోతాం. ఏం కాదు. మనకు మళ్లీ అవకాశం వస్తుంది’
ఆమె ఊహించినట్టుగానే అవకాశం వచ్చింది.

******

2006.
‘మిమ్మల్ని నలుగురు రేప్ చేస్తారండీ. ఓకేనా’ అన్నాడు అమీర్ సుల్తాన్, ప్రియమణి ఎదురుగా కూచుని.
సాధారణంగా ఈ పాయింట్ అతడు కథంతా పూర్తయ్యాక చెప్పాలి. కాని, అప్పటికే అతడు విసిగిపోయి ఉన్నాడు. ‘పరత్తివీరన్’ అనే స్క్రిప్ట్ రాసుకొని అందులో హీరోయిన్ కోసం ఇప్పటికి నలుగురిని కలిశాడు. నలుగురూ కథంతా అద్భుతంగా ఉందని చెప్పి, చివర్లో హీరోయిన్ రేప్‌కు గురవుతుందని తెలియగానే రిజెక్ట్ చేశారు.
అమీర్‌సుల్తాన్ అషామాషీ డెరైక్టర్ కాదు. బాలా శిష్యుడు. పర్‌ఫెక్షనిస్ట్.
ప్రియమణి అమీర్ సుల్తాన్ వైపు చూసింది.
‘రేప్ చేసేది నన్నా? నేను ధరించబోయే క్యారెక్టర్‌నా?’ అంది.
అమీర్ సుల్తాన్ పొలమారినట్టుగా చూశాడు.
‘అదేమిటి? మీరు ధరించబోయే క్యారెక్టర్‌నే’
‘మరి... మీరు అప్రోచ్ అయిన హీరోయిన్లు ఆ క్యారెక్టర్‌ను ఎందుకు రిజెక్ట్ చేసినట్టు? క్యారెక్టరూ తామూ ఒకటే అని అనుకున్నంతకాలం మన ఇండియన్ హీరోయిన్స్ ఎదగరు’
‘అంటే మీరు ఈ సినిమా చేస్తున్నారా?’
‘నిస్సందేహంగా’
అమీర్ ఆమెను సందేహించకుండా కావలించుకున్నాడు.
‘మీరు నా క్యారెక్టర్‌కి ప్రాణం పోయాలండీ’ అన్నాడు.
‘అంత గొప్ప గొప్ప మాటలు మాట్లాడితే ఇబ్బందుల్లో పడతామండీ. క్యారెక్టర్‌కి ఎంత అవసరమో అంత చేద్దాం. ప్రాణం పెట్టేస్తే మనకు ప్రాణం మిగలదు’
అమీర్‌కుకు మళ్లీ పొలమారింది.

******

2007.
మధురై ప్రాంతంలో ఉండే ఒక పల్లెటూళ్లో జరిగినట్టుగా చూపిన ‘పరత్తివీరన్’ సినిమా రిలీజయ్యింది. కార్తీ హీరో. ప్రియమణి హీరోయిన్. వీళ్లిద్దరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. పెద్దయ్యాక కులం అడ్డు పడుతుంది. పారిపోదామని ప్రయత్నించి ఒక అర్ధరాత్రి ఊరవతల ఒక ఒంటరి ఇంటికి చేరతారు. ఆమెను అక్కడే ఉంచి ఊళ్లో ఉన్న తనవాళ్ల కోసం కార్తీ వెళతాడు. ఆ దారిన వెళుతున్న లారీడ్రైవర్లు అనూహ్యంగా కనిపించిన ఈ ఒంటరి ఆడదాన్ని రేప్ చేసి చంపేస్తారు. అసలే అది పల్లెటూరు. పైగా ఊరి పెద్ద మనిషి కూతురు. అంతకు మంచి తన చిననాటి స్నేహితురాలు. ప్రేమికురాలు. ఆమె రేప్‌కు గురయ్యి చనిపోయిందంటే ఎంత అప్రదిష్ట. ఆమెకు ఎంతపెద్ద మచ్చ. కార్తీ ఇదంతా ఆలోచిస్తాడు. ఊరివాళ్లు వస్తుండగా వాళ్ల కళ్ల ముందు అప్పుడే ఆమెను హత్య చేస్తున్నట్టుగా ఖండఖండాలుగా నరికేస్తాడు. పెళ్లికి అడ్డుపడ్డ ఆమె తండ్రి మీద ప్రతీకారం తీర్చుకోవడానికే ఇదంతా చేసినట్టుగా పెద్దపెద్దగా అరుస్తూ ఆ పని చేస్తాడు. ఫలితంగా ఆమెను పవిత్రురాలిని చేస్తాడు. ఊరివాళ్ల చేతుల్లో హతమైపోతాడు.
5 కోట్లతో ఈ సినిమా తీశారు.
85 కోట్లు వసూలు చేసింది.
సంవత్సరం రోజులు ఆడింది.
ప్రియమణికి జాతీయఉత్తమనటి అవార్డును తీసుకొచ్చింది.
‘మా తల్లే... మా అమ్మే... ఫీల్డులో నిలబడిపోయావమ్మా’ అని దిష్టి తీసింది ప్రియమణి తల్లి.
ప్రియమణి పట్టించుకోలేదు. జిమ్‌కు వెళ్లిపోయింది. ఈసారి విజయం తాలూకు హ్యాంగోవర్‌ను చెమటరూపంలో బయటకు నెట్టేసేందుకు.

******

ఒక పాత్ర గొప్ప పెర్ఫార్మెన్స్‌ను డిమాండ్ చేస్తుంది.
మరో పాత్ర బికినీ వేసుకొని ముప్పావు వంతు నగ్నంగా నడవమంటుంది.
ఒకటి గొప్పది కాదు. మరొకటి తక్కువది కాదు. రెంటినీ సమానంగా చూడాలి. కాదు, గొప్ప పాత్రల దగ్గరే ఆగిపోతాను అక్కడే ఉంటాను అంటే ఉండు. అది నీ ఫెయిల్యూర్.
బికినీ పాత్రకు షిఫ్ట్ అవుతాను అనుకుంటే అది నీ సక్సెస్.

******

ఇవాళ ప్రియమణికి తెలుగులో అవకాశాలు లేవు. తమిళంలో కూడా లేదు. మలయాళంలోనూ లేవు. అందుకే కన్నడలో రెండు సినిమాలు చేస్తోంది. కన్నడ చాలా చిన్న పరిశ్రమ. కాని పని చేయడమే కదా ముఖ్యం. ఇంకా భారతదేశ పటం చాలా ఉంది. హిందీ, మరాఠి, బెంగాలీ, భోజ్‌పురి... ఒక ప్రొఫెషన్‌లో దిగాక అటాచ్‌మెంట్ లేకుండా ముందుకు పోవడమే.
కాదు, తెలుగులోనే ఉండిపోతాను తమిళంలోనే ఆగిపోతాను అనుకుంటే అది నీ ఫెయిల్యూర్.
కాలంతోపాటు కదిలిపోతే అదే నీ రీచార్జ్.


తాజ్ బంజారాలో మధ్యాహ్నం టీ
అప్పుడు ఆమె గదిలో ఫుల్లుగా ఏసి వేసుకొని వెచ్చగా రగ్గు కప్పుకొని కూచుని ఉంది. తోడుగా తల్లి. మామూలు టీషర్ట్. అతి మామూలు పైజమా. మరుసటిరోజు ఉదయం ఫిల్మ్‌సిటీలో షూటింగ్ ఉంది కనుక ఇవాళ విశ్రాంతి. వస్తున్నది ప్రింట్ మీడియావాళ్లు కనుక కెమెరాకు సిద్ధంగా లేదు. మా ఫొటొగ్రాఫర్‌ను చూసి, ఏంటి ముందే చెప్పొచ్చుగా, తల దువ్వుకునేదాన్నిగా, బట్టలు మార్చుకునేదాన్నిగా అందామె నవ్వుతూ. ఇప్పుడు అవన్నీ చేసే ఓపిక లేదుగాని ఫొటోలు వద్దులేద్దూ అంది చక్కటి తెలుగులో. కాసేపటికి వేడి వేడి టీ వచ్చింది. ఆమె మాట్లాడటం మొదలుపెట్టింది. ఆమె కథలో డ్రామా కోసం మా బృందమంతా ఆత్రంగా ఉంది. కాని డ్రామా లేకుండా చూసుకోవడమే అసలైన ధోరణి అని ప్రియమణి కథ విన్నాక అర్థమైంది. ఆమెకు ఎంత చెప్పాలో తెలుసు. ఎలా చెప్పాలో తెలుసు. కనుక రచన సులభతరం అయ్యింది.

‘ప్రియ’ చరిత్ర
పూర్తి పేరు : {పియ వాసుదేవ మణి అయ్యర్
పుట్టింది : 1984 జూన్ 4న కేరళలోని పాలక్కాడ్‌లో
తల్లిదండ్రులు : లతామణి అయ్యర్,వాసుదేవ మణి అయ్యర్
తొలి చిత్రం : కన్‌గలాళ్ ఖైదుసెయ్ (2004)
తొలి చిత్రం (తెలుగు): ఎవరే అతగాడు (2003)
అవార్డులు : ఉత్తమ నటిగా ‘పరుత్తి వీరన్’(తమిళం) చిత్రానికి (2007) జాతీయ అవార్డు అలాగే ఫిలింఫేర్, తమిళనాడు స్టేట్, విజయ్ అవార్డులు‘తిరక్కథ’ (మలయాళం)కు ఫిలింఫేర్ అవార్డు

Tuesday 13 November 2012

కొన్ని రచనా రత్నాలు

కొన్ని ఖదీర్ బాబు గారి రచన ల ఫోటోలు 

''అమ్మ ప్రేమలో ముంచి తీసిన సన్నజాజుల పరిమళం''
తరువాతి పోస్ట్లో :)
వీటి గూర్చి తెలుసుకోవాలి లేదా కొనుక్కోవాలి అంటే 
లింక్ .....((లింక్ ఇక్కడ)








Friday 9 November 2012

ఎన్.టి.ఆర్....రీచార్జ్


పులి అంటే చారలు ....పులి అంటే రాజసం 

పులి అంటే అడవికి భయం .......

మరి ఈ పులి అంటే తప్పు చేసే ప్రతి ఒక్కడికి భయం 
మరి ఈ పులి గూర్చి ఖదీర్ గారి కలం ఏమి గాండ్రించిందో 
మనసు ఎలా పులకరిస్తుందో చూడండి 

‘మీ పేరు’
‘బొబ్బిలిపులి’
‘మీ అసలు పేరు’
‘బొబ్బిలిపులి’
‘మీ తల్లిదండ్రులు పెట్టినపేరు’
‘బొబ్బిలిపులి బొబ్బిలిపులి బొబ్బిలిపులి... ఎన్నిసార్లు చెప్పమంటారు?’
జ్ఞాపకం వచ్చాయా ఆ డైలాగులు. జ్ఞాపకం వచ్చిందా ఆ కోర్టు సీను. జ్ఞాపకం వచ్చిందా కోర్టు బోనులో గర్జిస్తూ కనిపించిన ఆ పెద్దపులి.
ఎస్... బొబ్బిలిపులికి ముప్పయ్ ఏళ్లు వచ్చాయి.
కానీ... నేటికీ దాని పంజా గుర్తులు చెరిగిపోలేదు.
దాని గాండ్రింపుల ప్రతిధ్వని మాసిపోలేదు.
ఆ ఠీవీ.. ఆ దర్పం.. ప్రేక్షకులకు అందించిన ఆ ఎనర్జీ...
ముప్పయ్ ఏళ్ల తర్వాత కూడా... స్టిల్... బొబ్బిలిపులి!
ఈ సినిమా నుంచి ఇప్పటికీ సినిమాలు పుడుతున్నాయి.
ఈ సినిమా నుంచి ఇండస్ట్రీ ఇప్పటికీ రీచార్జ్ అవుతోంది.
ఈ నటన చూసి కొత్తతరం ఇప్పుడూ ఓనమాలు దిద్దుకుంటోంది.
ఈ డైలాగులకు ఇప్పటికీ ఆశ్చర్యపడుతూనే ఉంది.
తెలుగు సినిమాల్లో రాయల్ బెంగాల్ టైగర్ ఇది.
దీని రాయల్ సక్సెస్ స్టోరీయే ఈ వారం మన రీఛార్జ్.


ఇంటర్వ్యూ, కథారూపం : ఖదీర్

పంజాతో కొడితే- అది పెద్దపులి.
డైలాగ్‌తో కొడితే- అది బొబ్బిలిపులి.

క్లయిమాక్స్ సీన్.

బొబ్బిలిపులి: నాకు ఒక్క అవకాశం ఇస్తారా యువరానర్.
జడ్జి: ఎస్.

బొబ్బిలిపులి: పైకోర్టుకు వెళ్లడానికి నాకు అవకాశం ఉందా?
జడ్జి: అవును. ఉంది.

బొబ్బిలిపులి: పైకోర్టుకు వెళితే ఏం జరుగుతుంది యువరానర్?
జడ్జి: శిక్ష తగ్గించవచ్చు లేదా అదే శిక్షను ఖాయం చేయవచ్చు

బొబ్బిలిపులి: అంటే ఈ కోర్టులో వేసిన శిక్ష పై కోర్టులో పోవచ్చు. ఆ కోర్టులో వేసిన శిక్ష ఆ పై కోర్టులో పోవచ్చు. లేదా కింద కోర్టువారు వేసిన శిక్షే పైకోర్టు వారు ఖాయం చేయవచ్చు. అంటే ఒక కోర్టుకీ ఇంకో కోర్టుకీ సంబంధం ఉండొచ్చు. ఉండకపోవచ్చు. కోర్టు కోర్టుకీ తీర్పు తీర్పుకీ ఇంత మార్పుంటే మీ న్యాయస్థానంలో న్యాయం ఉన్నట్టా యువరానర్. ఒక్కొక్క కోర్టులో ఒక్కొక్క న్యాయం ఉంటుంది కనుకనే నేరస్తుడు తాను చేసిన నేరం ఏమిటో మర్చిపోయాకకాని శిక్ష పడదు. ఓకే... ఓకే యువరానర్. ఆఖరుసారిగా ఒక్క ప్రశ్న అడుగుతున్నాను. నాకీ ఉరిశిక్ష ఎందుకు విధించారు?

జడ్జి: మనుషుల్ని చంపినందుకు.
బొబ్బిలిపులి: ఓ... మను షుల్ని చంపితే ఉరిశిక్ష విధిస్తారు కదూ. మరి ఆనాడు యుద్ధంలో నేను ఒక్కణ్ణి సుమారు నాలుగు వందల మందిని దారు ణంగా చంపాను. అంటే హత్య చేశాను. మరిదానికి నాకు ఉరిశిక్ష విధించలేదే? పైగా నేనేదో పెద్ద ఘనకార్యం చేశానని మహావీరచక్ర బిరుదునిచ్చి నన్ను సత్కరించారు. ఆ సత్కారం దేనికి యువరానర్? ఆ బిరుదు దేనికి యువరానర్? ఆరోజు యుద్ధంలో నేను చంపినవాళ్లెవరో నాకు తెలియదు. వాళ్లు మనకు సంబంధం లేనివాళ్లు. మన పొరుగువాళ్లు. మన తోటి సోదరులు. మనమెలా మన దేశాన్ని రక్షించుకోవడానికి వెళ్లామో వాళ్లు కూడా అలా వాళ్ల దేశాన్ని రక్షించుకోవడానికి వచ్చినవాళ్లు. వాళ్లని చంపితే సన్మానం. సత్కారం. మహావీర బిరుద ప్రదానం. మరి మనవాళ్లు మన దేశాన్ని దేశ ప్రజానీకాన్ని పేద ప్రజల్ని న్యాయస్థానాల్ని న్యాయాన్ని రక్షించే స్థావరాలని కొల్లగొడుతూ తమ స్వార్థానికి ఉపయోగించుకుంటున్న వీళ్లను చంపితే అది నేరం. దానికి బహుమానం ఉరిశిక్ష. ఆహా... యువరానర్. నాకిచ్చిన మహావీరచక్ర బిరుద ప్రదానం నా దేశాన్ని కాపాడుకోవడం కోసమే అయితే... నా దేశాన్ని పరిరక్షించుకోవడం కోసమే అయితే అది అప్పుడు కాదు యువరానర్... ఇప్పుడు... ఇప్పుడు నాకివ్వాలి. నిజంగా మన దేశాన్ని నేను ఇప్పుడు కాపాడాను. వాళ్లు మన దేశానికే శత్రువులు. వీళ్లు మన దేశాభ్యుదయానికే శత్రువులు. వాళ్లు ముందుకు వచ్చి తుపాకులతో పోరాడారు. వీళ్లు వెనక్కు వచ్చి వెన్నుపోటు పొడిచారు. వాళ్లలో నిజాయితీ ఉంది. వీళ్లలో కుట్ర. కుళ్లు. కుతంత్రం. వాళ్లను చంపితే సన్మానం. సత్కారం. వీళ్లను చంపితే ఉరిశిక్ష. భేష్... భేష్... ఇదే మీ చట్టమైతే మీకూ మీ చట్టానికి కోటి వందనాలు. ఇదే మీ న్యాయమైతే మీకూ మీ న్యాయానికి శతకోటి అభివందనాలు. ఇదే మీ ధర్మమైతే మీకూ మీ ధర్మానికి అనంతకోటి సాష్టాంగ నమస్కారాలు. దట్సాల్!

*******

సెన్సార్‌బోర్డ్ రివైజింగ్ కమిటీ చైర్మన్ ఆఫీసులో గడియారం ముల్లు చేసే శబ్దం తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది.
చైర్మన్ సీటులో ఎల్వీ ప్రసాద్ కూచుని ఉన్నారు.
ఎదురుగా బొబ్బిలిపులి దర్శకుడు దాసరి. నిర్మాత వడ్డే రమేష్.
అంతకు ముందే మద్రాసు రీజనల్ కమిటీ బొబ్బిలిపులిని చూసింది. మూడు వేల అడుగుల కట్స్ చెప్పింది. మూడు వేల అడుగులు! అంటే సినిమా మిగలదు. ఎన్టీఆర్ మిగలడు. ఎన్టీఆర్ చెప్పే డైలాగులూ మిగలవు. డైలాగులు ఎవరిక్కావాలి. సెంట్రల్‌లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉంది. ఈ డైలాగులన్నీ ఆమె పాలనను కించపరిచేలా ఉన్నాయి. ప్రభుత్వాన్ని తూర్పారబట్టేలా ఉన్నాయి. కనుక ఇవన్నీ తీసేయాలంది రీజనల్ కమిటీ. దీని మీద తేల్చుకుందామని రివైజింగ్ కమిటీకి వచ్చారు దాసరి, వడ్డే రమేష్.
ఎల్వీ ప్రసాద్ సినిమా చూశారు.
వాళ్లను పిలిచారు. ఇక తీర్పు చెప్పాలి. ‘ఏం లేదు. పాత కట్స్ మర్చిపోండి. ఓన్లీ సింగిల్ కట్ ఇస్తున్నాను. క్లయిమాక్స్ మొత్తం తీసేయండి’
ఆయన చేతిలోని పేపర్ వెయిట్- పరిచిన న్యూస్‌పేపర్ మీద- నిశ్శబ్దంగా గింగిరాలు కొట్టి, మెల్లగా అతి మెల్లగా ఆగింది. కాని దాసరి, రమేష్‌ల గుండెలు మాత్రం అంతకంతకూ వేగం పుంజుకొని ధన్‌ధన్ అని కొట్టుకుంటున్నాయి.
‘సార్’ అన్నారు ఇద్దరూ.
‘మీరున్నారన్న ధైర్యంతో వచ్చాం సార్’ అన్నారు మళ్లీ.
‘ఏం ధైర్యం. రేపు విమర్శలు వస్తే మీరు సమాధానం చెప్పాలా నేను చెప్పాలా? క్లయిమాక్స్ తీసేయండి. అంతే.’
వాళ్లిద్దరూ లేచి నిలబడ్డారు.
‘ఏం నిర్ణయించుకున్నారు?’ అడిగారు ఎల్వీ ప్రసాద్.
దాసరి ఒక్క క్షణం పాజ్ ఇచ్చారు.
అప్పటికే ఆయనకు తిక్క రేగి ఉంది.
ఎన్టీఆర్‌కు కోర్టు సీన్ చదివి వినిపించిన మాడ్యులేషన్‌లోనే ఎల్వీ ప్రసాద్‌తో చెప్పారు- ‘కోర్టు కోర్టుకీ తీర్పు తీర్పుకీ ఇంత మార్పు ఉంటుంది కనుకనే మేం ఢిల్లీ ట్రిబ్యునల్‌లో తేల్చుకుంటాం యువరానర్’.

*******

విజిపి గార్డెన్స్ అప్పటికి పూర్తిగా చల్లబడింది.
మద్రాసు నగరం మీద కాచిన ఎండ- వేడిగా ఇంకా వేడిగా జనాన్ని ఎంత మాడ్చినా సాయంత్రమయ్యేసరికి సముద్రంగాలికి తోక ముడుస్తుంది. పారిపోతోంది. ఇప్పుడు ఆ చల్లగాలి కోసం విజిపికి వచ్చారు దాసరి, రమేష్.
సాధారణంగా దాసరి మనసు బాగలేనప్పుడు, ఆయన గంభీరంగా మారిపోయినప్పుడు సన్నిహితుల సమక్షంలో ఏకాంతంగా గడుపుతారు. కాటేజ్ బుక్ అయ్యింది.
రమేష్‌ను గదిలోనే వదిలిపెట్టి స్లిప్పర్స్ ధరించి బీచ్ ఒడ్డున అలా నడక మొదలెట్టారు దాసరి.
ఆయన గుండెల్లో దుఃఖం పొంగుకొస్తుంది. బొబ్బిలిపులి తన బిడ్డ. తాను కన్నబిడ్డ. పురుడు పోసుకున్న ఈ బిడ్డ ప్రేక్షకుల ఒడికి చేరాలి. కాని చేరడం లేదు. ఇన్‌క్యుబేటర్‌లో ఉండిపోయింది. బతుకుతుందో లేదో తెలియదు. చచ్చిపోతుందో ఏమో తెలియదు. అప్పటికే షూటింగ్ పూర్తయ్యి మూడు నెలలు అయిపోయింది. జనం ఎప్పుడెప్పుడా అని సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. నిర్మాత పెట్టిన పెట్టుబడి అలాగే ఉంది. పడిన కష్టమూ అలాగే ఉంది. అన్నింటికీ మించి బొబ్బిలిపులి పాత్రకు జీవం పోసి, గర్జించి, తెలుగు వెండి తెరకు మరోపులి లేడూ రాడూ అని నిరూపించిన ఎన్టీఆర్ నటనా వైదుష్యమూ అలాగే ఉండిపోయింది.
ఇదంతా ఎప్పుడు బయటపడాలి? ఎప్పుడు ప్రొజెక్టర్లకు ఎక్కాలి?
దాసరి నడక ఆపి, కెరటాలు పాదాలను ముద్దాడుతుండగా స్థిమిత పడి, స్థిరంగా ఒక నిర్ణయం తీసుకున్నారు.
‘తప్పదు. సినిమా విడుదల కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. నా కోసం కాదు. ఎన్టీఆర్ కోసం. ఆయనకో గొప్ప సినిమా ఇస్తానని మాట ఇచ్చాను. ఆ మాటను నిలబెట్టుకోవడం కోసమైనా సరే ఆమరణ దీక్ష చేస్తాను’...
ఆ నిర్ణయం తీసుకున్నాక దాసరికి ఎన్టీఆర్ గుర్తుకొచ్చారు.
ఊటీలో ఆ తెల్లవారుజామున ఆయనలో దర్శించిన దివ్యత్వమూ గుర్తుకొచ్చింది. ...
‘సువిశాలాంధ్రకు విప్లవజ్యోతి సీతారామరాజు...
అల్లూరి సీతారామరాజు...
నవ చైతన్య నికేతన మార్గదర్శకుడు
సీతారామరాజు... మన సీతారామరాజు...’
రెండేళ్ల క్రితం ‘సర్దార్ పాపారాయుడు’ సినిమా కోసం బుర్రకథను షూట్ చేస్తున్నారు. ఊటీలో షూటింగ్. తెల్లవారుజామున సంధ్యావందనం కోసం వెళుతున్న సీతారామరాజు మీద తొలి షాట్.
‘బ్రదర్. రేపు ఐదుగంటలకు ఉంటే సరిపోతుందా?’ అడిగారు ఎన్టీఆర్.
ఆయన అప్పటికే మానసికంగా అల్లూరి సీతారామరాజుగా మారిపోయి ఉన్నారు. ముఖంలో ఒకరకమైన రుషిత్వం.
‘గెటప్ చూసుకున్నారా?’ అడిగారు దాసరి.
‘ఆ సంగతి నాకు వదిలిపెట్టండి బ్రదర్. రేపు చూస్తారుగా’ అన్నారు ఎన్టీఆర్.
ఆ ఉదయం- పొడవైన చెట్ల కాండాలను తాకి, చీలి, పొగమంచు సాగిపోతూ ఉండగా- జివ్వుమని చల్లగాలి తాకిన ప్రతి మేనుకూ గగుర్పాటును కలిగిస్తూ ఉండగా- నగారాలోని బుర్రకథకు మరొక్కసారి మన్యపు వాతావరణం ప్రతిష్ఠితం అవుతూ ఉండగా- అదిగో ఎన్టీఆర్... కాదు కాదు అల్లూరి సీతారామరాజు... ఒంటికి కాషాయ వస్త్రాలు, నుదుటిన తిలకం, చేతిలో విల్లు, భుజానికి పొది, నడుముకు బిగించి కట్టిన విప్లవవర్ణ చిహ్నం ఎర్రవస్త్రం... పులిలాంటి అడుగులు...
దాసరికి మాటరాలేదు.
ఆ వచ్చేది మానవమాత్రుడిగా గోచరించలేదు.
ఈయన రుషి. ఈయన దివ్యపురుషుడు. బహుశా ఈయన కూడా ఒక అవతార పురుషుడే.
జీవితంలో ఎప్పుడూ ఎన్టీఆర్‌కు పాదాభివందనం చేసి ఎరగని దాసరి ఒక్కసారిగా తన్మయుడై ఒంగి పాదాభివందనం చేశారు.
ఎన్టీఆర్ కదిలిపోయారు.
‘బ్రదర్... ఏమిటి ఇది’ ఆయన కళ్లల్లో ఒక కళాకారుడికి మాత్రమే సాధ్యమైన స్పందన తాలూకు తడి.
‘ఏమో సార్. మీ పాదాలకు నమస్కరించాలనిపించింది. చేశాను’ అన్నారు దాసరి.
ఎన్టీఆర్ మౌనంగా వెళ్లి దూరంగా ఉన్న కుర్చీలో కూచున్నారు.
తర్వాత దాసరిని పిలిచారు.
‘బ్రదర్. నాటి మహానుభావుల పాత్రలను తెరపై మేము చేస్తున్నాం. మా పాత్రను భవిష్యత్తులో ఎవరైనా వెండితెరపై చేస్తారా?’
చాలా చిత్రమైన ప్రశ్న.
దాసరి ఆలోచించి సమాధానం చెప్పారు.
‘ఎందుకు చేయరు సార్. జనం మెచ్చే పని, వారికి సేవ చేసి చరిత్రలో మిగిలే పని చేస్తే తప్పక వేస్తారు’
ఎన్టీఆర్ తల పంకించారు.
మరికొన్నాళ్లకు ఆయన రాజకీయ రంగ ప్రవేశ ప్రకటన వెలువడింది.

********

మద్రాస్ బజుల్లా రోడ్డులో కార్ పార్కింగ్ ఎప్పుడూ సమస్యే.
ఆ రోడ్డులో ఉండే ఎన్టీఆర్ కోసం వచ్చే విజిటర్స్ డజనుకుపైగా బయట కార్లు పార్క్ చేసి ఉంటారు. అదే రోడ్డులో ఉండే దాసరి కోసం ఇంకో డజను.
ఇప్పుడు ఎన్టీఆర్ ఇంటి బయట ఇంకా రద్దీ పెరిగింది. ఎక్కడెక్కడి నుంచో జనాలు తండోపతండాలుగా వచ్చి ఆయనను దర్శించుకుని వెళుతున్నారు. ఆయన పార్టీ అనౌన్స్ చేయలేదు. కాని రాజకీయ రంగప్రవేశం దాదాపుగా ఖరారే అన్న వాగ్దాన ప్రకటన వచ్చింది. ఒక హీరో, రాముడు, కృష్ణుడు, పేదల కోసం పోరాడే పరాక్రమవంతుడు, నైతిక వర్తనుడు, ఆకర్షక శక్తి... తమ కోసం తమ బాగు కోసం రాజకీయాల్లోకి వస్తున్నాడంటే ప్రజలకు ఎంత వేడుక. అభిమానులకు ఎంత సంబరం.
‘వారిని సంతోషపెట్టే ఆఖరు ప్రయత్నం చేద్దాం బ్రదర్’ అన్నారు ఎన్టీఆర్ ఒకరోజు దాసరిని పిలిచి.
‘బహుశా ఇది మా చివరి చిత్రం కావచ్చు. మీరు దానిని బ్రహ్మాండంగా తీయాలి’ అని ఆఫర్ ఇచ్చారు.
దాసరి అప్పటికి యధావిధిగా బిజిగా ఉన్నారు. ఆ ముందు సంవత్సరమే ఏఎన్నార్‌తో ‘ప్రేమాభిషేకం’ వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చి ఉన్నారు. ఇంకా చేతిలో బోలెడన్ని సినిమాలు ఉన్నాయి.
అయినా ఇది గొప్ప చాన్స్.
దాసరి ఎన్టీఆర్‌ని పరికించి చూశారు.
తెలియని తేజస్సుతో వెలిగిపోతున్నాడాయన.
‘సార్. నిన్న మొన్నటి దాకా మీరు ఇండివిడ్యుయల్. ఇవాళ మీరే ఒక అఖండ ప్రజాసమూహం. మిమ్మల్ని ఒక పాత్రలోకి అదుపు చేయడం కష్టమేమో సార్’
ఎన్టీఆర్ నవ్వారు.
‘జనహితం కోసం అవసరమైతే అన్నిరకాల అదుపులనూ అడ్డంకులనూ దాటి విప్లవాత్మకంగా పోరాడే హీరోగా చూపించండి బ్రదర్’
దాసరికి ఏదో ఫ్లాష్ వెలిగినట్టయ్యింది. అది క్రమక్రమంగా మెదడు కణజాలమంతా వ్యాపించి వెలుగుతో నిండి అందులో నుంచి ఒక ఆకారం ప్రత్యక్షమై.... ఆయన పెదాలు నెమ్మదిగా ఒక మాటను ఉచ్ఛరించాయి...
‘బొబ్బిలిపులి’

********

భారీ సినిమా. భారీ ప్రొడ్యూసర్ కావాలి.
వడ్డే రమేష్ నేను రెడీ అని వచ్చారు.
భారీ సినిమా. భారీ తారాగణం కావాలి.
శ్రీదేవి, సత్యనారాయణ, రావుగోపాలరావు, జగ్గయ్య, జయచిత్ర, ప్రభాకర రెడ్డి, అల్లు రామలింగయ్య మేము రెడీ అని వచ్చారు.
డెరైక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ- కె.ఎస్. మణి.
స్టంట్స్- మాధవన్
స్టెప్స్- సలీమ్.
పాటలు- దాసరికి తోడుగా వేటూరి
సంగీతం- విజయమాధవి ఆస్థాన విద్వాంసుడు జె.వి.రాఘవులు.
అంతా బాగుంది. అద్భుతంగా ఉంది. కాని కథ?
కథ కూడా భారీగా ఉండాలి. అది ఇంకా దాసరి బుర్రలో రూపు దాల్చలేదు. సమయం దగ్గర పడుతోంది. షూటింగ్ పెట్టుకోవాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? కోడెరైక్టర్ నందం హరిశ్చంద్రరావుని వెంటబెట్టుకుని వాకింగ్‌కు బయలుదేరారు.

********

మనదేశంలో ఎప్పుడూ కొందరు ఉత్సాహవంతులు ఒక కామెంట్ చేస్తూ ఉంటారు- మిలట్రీ రూల్ వస్తే తప్ప ఈ దేశం బాగుపడదూ అని.
అది గుర్తొచ్చింది దాసరికి.
మిలట్రీ దాకా వెళ్లక్కర్లేదు. ఒక సైనికుడి పాత్రను తీసుకుందాం అనుకున్నారాయన. వెంటనే త్రెడ్ దొరికింది.
‘ఒక సైనికుడు దేశ శత్రువులను తుదముట్టించి మహావీర చక్ర బిరుదు పొందుతాడు. అదే సైనికుడు సమాజ శత్రువులను తుదముట్టించినందుకు ఉరిశిక్షను కానుకగా పొందుతాడు. ఇదేం న్యాయం?’
ఆ ఆలోచన వచ్చాక ఆగలేదాయన. చకచకా సన్నివేశాలు రాసుకుంటూ వెళ్లారు. ఒక సైనికుడు. సెలవులకు ఇంటికి వస్తాడు. ప్రేమలో పడతాడు. పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. ఇంతలో సమాజంలోని దుర్మార్గాలను చూస్తాడు. నేను ఉండవలసింది సరిహద్దుల్లో కాదు, ఇక్కడే అని నిశ్చయించుకుని తిరగబడతాడు.
చెబుతుంటే దాసరి రోమాలు నిక్కపొడుచుకున్నాయి.
ఎన్టీఆర్ కళ్లు విశాలమయ్యాయి.
‘చాలా బాగుంది బ్రదర్. ప్రొసీడ్’ అన్నారాయన.
కాని మనది సగటు ప్రేక్షకుడి సమాజం. సగటులో సగటుగా ఉండే స్త్రీ ప్రేక్షకుల సమాజం. ఇలాంటి కథలో ఆడవాళ్లకు నచ్చే పాయింట్ ఉండాలి. మొదటి పాయింట్: ప్రియుడి బాగు కోసం తన ప్రేమను త్యాగం చేసే ప్రియురాలు. రెండో పాయింట్: భర్త బతికే ఉన్నా చనిపోయాడనుకొని బొట్టు తీసేసే భార్య. చాలు అనుకున్నారు దాసరి.
ఇంకా కొంచెం పెప్ కావాలా?
భార్య చనిపోతుంది. భర్త కోసం పోలీసులు కాపు కాచి ఉంటారు. హీరో కాటికాపరి వేషంలో వచ్చి కొరివి పెడతాడు. చాలు అనుకున్నారు దాసరి.
ఇంకా కొంచెం కన్నీరు కావాలా?
హీరో యుద్ధంలో ఉంటాడు. తల్లి చనిపోయినట్టుగా అతడికి వర్తమానం వస్తుంది. కదలడానికి లేదు. పైగా స్థయిర్యం కోల్పోయిన సైనికులను ఉత్తేజితులను చేస్తూ పాట పాడాలి.
చాలు అనుకున్నారు దాసరి.
ఇంకా కొంచెం కారం కావాలా?
క్లయిమాక్స్ సీన్.
మాటలు ఫిరంగులై మోగుతాయి. వాదనలు పిడుగులై ఉరుముతాయి. హీరో సమాజపు సకల అపసవ్యతలను ప్రశ్నిస్తూ గర్జిస్తాడు.
చాలు. ఇంతకంటే ఎక్కువ మందుగుండు దట్టిస్తే ప్రేక్షకులు తట్టుకోలేరు.

********

ఎన్టీఆర్ డేట్స్ 38 రోజులు.
ఎక్స్‌పోజ్ చేసిన ఫిల్మ్ 50 వేల అడుగులు.
బడ్జెట్ 50 లక్షలు.
నిర్మాణ సమయం 50 రోజులు.
అంతా రెడీ.
సెన్సార్ అయ్యి ఇంక రిలీజ్ కావాలి.
రిలీజ్ కావాలి.
రిలీజ్ కా..............................వాలి.

********

ప్రతి క్రైసిస్‌లోనూ ఒక హీరో ఉంటాడు.
ఈ క్రైసిస్‌లో కూడా ఉన్నాడు. నటుడు ప్రభాకర రెడ్డి.
సినిమా రిలీజ్‌కు ప్రతిబంధకాలు ఏర్పాడ్డాయి అని తెలిసిన వెంటనే రమేష్ నాయకత్వంలో ప్రభాకర రెడ్డి రంగంలో దిగారు. ఎందుకంటే ఆయన వడ్డే రమేష్‌కు ఆప్తుడు. అదీగాక ఈ సినిమా చాలా మంచి సినిమా అని ఆయన నమ్మకం. దీనికి అపకారం జరక్కూడదు.
వడ్డే రమేష్‌తో పాటు ఢిల్లీలో దిగిన ప్రభాకర రెడ్డి మొదట చేసిన తెలివైన పని ఏమిటంటే ‘సమ్మతి తయారీ’.
‘బొబ్బిలిపులి బాగుంది అనే మాట ఢిల్లీలో మారుమోగాలి’ అనుకున్నాడాయన.
మొదట తెలుగు తమిళ ఐఏఎస్‌లను ఒక పద్దెనిమిది మందిని పోగేశాడు. వాళ్లకు సినిమా చూపించాడు.
‘బాగుంది. ఎన్టీఆర్ మహానుభావుడు. ఈ సినిమాకు కట్స్ ఎందుకు’ అన్నారందరూ.
ఆ తర్వాత పి.వి.నరసింహారావు, పెండెకంటి వెంకట సుబ్బయ్య, జనరల్ కృష్ణారావు, అప్పటి డెప్యూటీ సిఎం జగన్నాథరావు వీళ్లందరినీ జత చేసి మళ్లీ షో వేశాడు. వాళ్లు చూసి ‘నీకెందుకు మేం చూసుకుంటాం’ అని రమేష్‌కు హామీ ఇచ్చారు.
దాదాపుగా సగం ఇబ్బంది దూరమైనట్టే.
ఆ తర్వాత రమేష్, ప్రభాకర రెడ్డి కలిసి మద్రాసులో ఉన్న దాసరికి ఫోన్ చేశారు.
‘మీరు వెంటనే రండి. ఇంకొక్కరికి చూపిస్తే మన సినిమా రిలీజైపోతుంది’
‘ఎవరాయన?’
‘మన తెలుగువాడే. నీలం సంజీవరెడ్డి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’
దాసరి టక్కున ఫోన్ పెట్టేసి ఢిల్లీ బయలుదేరారు. నీలం సంజీవరెడ్డి ప్రత్యేకంగా రాష్ట్రపతి భవన్‌లో సినిమా చూశారు. రాష్ట్రపతి చూసి బాగుంది అన్నాక సెన్సార్ అధికారుల కత్తెర్లు టేబుల్ సొరుగుల్లోకి నిష్ర్కమించాయి.
జూలై 9, 1982న బొబ్బిలిపులి రిలీజయ్యింది.

********

ఏనుగు కుంభస్థలాన్ని కొడితే-
అది పెద్దపులి.
కలెక్షన్ల కుంభస్థలాన్ని కొల్లగొడితే-
అది బొబ్బిలిపులి.

********

చాలాచోట్ల రేయింబవళ్లు షోస్ వేశారు.
చిన్న చిన్న ఊళ్లల్లో కూడా రెండు థియేటర్లలో రిలీజ్ అయ్యింది. చాలాచోట్ల వందరోజులు నూట డెబ్బయ్ అయిదు రోజులు ఆడింది. చాలామంది ఎగ్జిబిటర్లు బొబ్బిలిపులి పుణ్యమా అంటూ ఏదో ఒక చిన్న కారో పెద్ద మేడో సంపాదించుకున్నారు.

********

బొబ్బిలిపులి ఎన్టీఆర్‌ని హీరో నుంచి నాయకుడిగా రీచార్జ్ చేసింది. ఎన్టీఆర్‌కు ప్రత్యామ్నాయం లేదు అని వాస్తవాన్ని ఖరారు చేసింది.
పరిత్రాణాయ సాధూనాం...
వినాశాయచ దుష్కృతాం....
దక్షిణాది సినీ పరిశ్రమ చెత్త సినిమాలతో నీరసించినప్పుడల్లా భారతీయుడు, ఠాగూర్, శివాజీ వంటి సినిమాలు రావడానికి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచి ముప్పయ్ ఏళ్ల తర్వాత కూడా రీచార్జ్ చేస్తూనే ఉంది.
జై తెలుగు సినిమా. జై జై బొబ్బిలిపులి.
- స్టిల్స్ కర్టెసీ: కొమ్మినేని వెంకటేశ్వరరావురో

రోరింగ్ రికార్డ్స్
విడుదల: 1982 జులై 9
నిర్మాణ వ్యయం: సుమారు 50 లక్షల రూపాయలు
నిర్మాణ ప్రాంతాలు: మద్రాసు, ఊటీ
నిర్మాణ సమయం: 50 రోజులు

రికార్డులు:
తెలుగునాట తొలిసారి 100కు పైగా థియేటర్లలో విడుదలైంది.

తొలిరోజే రూ.13 లక్షలు వసూలు చేసింది.

తొలివారంలో రూ.71 లక్షలకు పైగా వసూలు చేసింది.

రెండు వారాలకు కోటి రూపాయలు వసూలు చేసింది.

ఓవరాల్‌గా రూ.మూడు కోట్లకు పైగా వసూలు చేసింది.

39 కేంద్రాల్లో వందరోజులు ప్రదర్శితమైంది.

హైదరాబాద్‌లోని సుదర్శన్ 35 ఎం.ఎం.థియేటర్‌లో

175 రోజులాడి రికార్డ్ సృష్టించింది.

హైదరాబాద్‌లో షిఫ్ట్‌లతో ఏడాది ఆడింది.

పాతాళభైరవి, లవకుశ, అడవిరాముడు,

వేటగాడు తర్వాత ఏడాది ఆడిన ఎన్టీఆర్ 5వ సినిమా.

పాతాళభైరవి, లవకుశ, అడవిరాముడు, వేటగాడు,

దసరాబుల్లోడు, ప్రేమాభిషేకం, పండంటికాపురం,

అల్లూరి సీతారామరాజు, శంకరాభరణం (50 వారాలు

మాత్రమే), తర్వాత ఏడాది ప్రదర్శితమైన పదో తెలుగు సినిమా.

ఆ క్రమశిక్షణ రాదు
సినిమా ఫీల్డ్‌లోకి ఎంటరైనప్పటినుంచీ ఎన్టీఆర్‌తో సినిమా తీయాలనేది నా కల. ‘బొబ్బిలిపులి’ ఆ కల నెరవేర్చింది. దాసరితో నాది ప్రత్యేకమైన అనుబంధం. ఆయనతో పది సినిమాలు తీశాను. ఎన్టీఆర్ లాంటి హీరోని మళ్లీ చూడలేం. దాసరి లాంటి దర్శకులు ఇక రారు. ఉదయం ఏడు గంటలకు షూటింగంటే 6 గంటల 45 నిమిషాలకే మేకప్‌తో సిద్ధంగా ఉండేవారు ఎన్టీఆర్. దాసరి కూడా క్రమశిక్షణ విషయంలో ఎన్టీఆర్‌తో పోటీపడేవారు. అలాంటి క్రమశిక్షణ వల్లే ‘బొబ్బిలిపులి’ లాంటి భారీ చిత్రాన్ని కూడా అవలీలగా చేయగలిగాం. ఈ సినిమా మీద నమ్మకంతో ఒక్క ఏరియా మినహా మొత్తం సొంతంగా రిలీజ్ చేసుకున్నాం.
- వడ్డే రమేష్, నిర్మాత

క్రిస్టోకి ఎన్టీఆర్ దెబ్బ
‘బాబులుగాడి దెబ్బ’ సినిమా కోసం వచ్చిన బాబ్ క్రిస్టో అనే ఆస్ట్రేలియన్ ఫైటర్‌ని ‘బొబ్బిలిపులి’క్కూడా ఉపయోగించుకున్నారు. ‘బాబులుగాడి దెబ్బ’ షూటింగ్‌లో బ్యాలెన్స్ తప్పి నిజంగానే కృష్ణంరాజుకి పంచ్ ఇచ్చాడు. ఆ విషయం ఎన్టీఆర్‌కి తెలిసి మనసులో పెట్టుకున్నారు. బీచ్ ఒడ్డున ఫైటింగ్ తీస్తున్నప్పుడు చివరి షాట్‌లో ఎన్టీఆర్, బాబ్ క్రిస్టోని ఎత్తి తిప్పి పడేయాలి. ఎన్టీఆర్ అతన్ని పెకైత్తి రెండు తిప్పులు ఎక్కువ తిప్పి ఇసుకలో విసిరికొట్టారు. ఆ తర్వాత కాలితో కిక్ ఇచ్చారు. మళ్లీ జీవితంలో ఎప్పడూ క్రిస్టో ఎన్టీఆర్ ఎదుటపడే ధైర్యం చేయలేదు. పరార్.

దటీజ్ ఎన్టీఆర్
బొబ్బిలి రాజవంశానికి చెందిన తాండ్ర పాపారాయుడికి ‘బొబ్బిలిపులి’ అని బిరుదు ఉంది. దాన్నే టైటిల్‌గా పెట్టాను. ఈ సినిమాకు క్లైమాక్సే ప్రాణం. దాదాపు 20 నిమిషాలు కోర్టు సీన్. మద్రాసు ఏవీయమ్ స్టూడియోలో కోర్టు సెట్ వేశాం. ఎన్టీఆర్ ఉదయం 9 గంటలకు వస్తారు. నేను గంట ముందే లొకేషన్‌కు వెళ్లాను. సెట్‌లో ఓ మూల కూర్చున్నాను. ఏవేవో ఆలోచనలు. కోర్టు సీన్ మార్చి ఇంకా బాగా రాయాలనిపించింది. వెంటనే మొదలుపెట్టాను. అలా ఏకధాటిగా 35 పేజీలు రాసేశాను. టైమ్ చూస్తే 11 గంటలైంది. అప్పటికే ఎన్టీఆర్ వచ్చేశారు. నేను రాసుకోవడం చూసి డిస్ట్రబ్ చేయొద్దని ఆయనే చెప్పారట. అందరికీ నేను రాసిన కొత్త డైలాగ్స్ వినిపించాను. ఎన్టీఆర్ ఆ స్క్రిప్టు తీసుకుని ‘‘మధ్యాహ్నం రెండు గంటల నుంచి షూటింగ్ చేద్దాం’’ అని వెళ్లిపోయారు. ఇంటికి లంచ్‌కి వెళ్లారేమోననుకున్నా. కానీ.. ఆయన మెరీనా బీచ్‌కి వెళ్లి అక్కడ ఆ డైలాగ్స్‌ని ప్రాక్టీస్ చేశారట. ఆ తర్వాత అన్నీ సింగిల్ టేక్‌లోనే చేసేశారు. దటీజ్ ఎన్టీఆర్.
- దాసరి నారాయణరావు

Wednesday 7 November 2012

ప్రవర.....

సృజనాత్మకతకు మూలాలు 
ఎక్కడ ఉంటాయో తెలుసా?
వాళ్ళ బాల్యం లోనే.......


చిన్నతనం లో 
నాయనమ్మ అందించిన కధల స్పూర్తిని మనసులో 
దాచుకొని కధల వృక్షం గా ఎదిగి సమాజాన్ని ప్రశ్నిస్తున్న 
శక్తి ఖదీర్ బాబు.పూర్తి పేరు మహ్మద్.ఖదీర్ బాబు.

వీరు 1972 లో నెల్లూరు జిల్లా కావలి లో జన్మించినారు.
ఇంటర్ లో నూనూగు మీసాల లేత ప్రాయం లో సరదా కధలతో 
మొదలైన రచనా వ్యాసంగం ,తన తండ్రి చిన్న వ్యాది తొ, ఆర్ధిక
ఇబ్బందులతో సరైన వైద్యం అందక చనిపోవడం తొ సమాజపు 
అసమానతల వైపు మళ్ళింది.
తన చుట్టూ ఉన్న తన వారి  స్తితిగతుల గమనించినపుడు 
కలిగే కోపం వేదనగా రగిలి అక్షరాలుగా మారి 
తన వారిని చైతన్య పరుచుటే గాక 
సమాజాన్ని తమ వారి వైపు చూడమని ప్రశ్నించింది.

డిగ్రీ తరువాత ఉద్యోగం లో చేరిన అయన 24 సంవత్సరాల 
వయసులో తండ్రి మరణం తొ రగిలిన కోపం కధలుగా  
రూపొంది  సమాజం  వైపు ఇప్పటికి తన ప్రశ్నలను సందిస్తూ 
భావాలకు పదును పెడుతూనే ఉంది.

1997 లో వ్రాసిన మొదటి కధ ''దావత్''కు నేషనల్ అవార్డ్ 
సాదించినారు.''నామిని సుబ్రహ్మణ్యం నాయుడు''గారి 
ప్రోత్సాహం తొ తన వారి సమస్యలు హృదయాలకు హత్తుకునే 
రీతిలో లోకం ముందుకు  కధలుగా తీసుకుని వచ్చారు.
1999 లో ''జమీన్''అనే కధకు ''కధాఅవార్డ్''ని ఇంకా 
''బాషా సమ్మాన్ అవార్డ్'' ని పొంది ఉన్నారు.

మొదట ''ఫీచర్ జర్నలిస్ట్''గా ''ఆంద్రజ్యోతి '' పని చేసిన వీరు 
ప్రస్తుతం ''సాక్షిఫ్యామిలీ'' ఇంచార్జ్ గా బాధ్యతలు 
నిర్వహిస్తున్నారు.

ఈయన వ్రాసిన కధాసంకలనాలు ''దర్గామిట్ట కధలు''
''పోలేరమ్మ బండ కధలు'' ''పప్పు జాన్ కధలు''
''మాన్ సే గీత్''(హిందీ సినిమా సంగీతం ) 
ఇవి కాక ఇటీవల ''న్యు బాంబే టైలర్స్'' బహుళ 
ప్రజాదరణ పొందినాయి.
ఇవి కాక ఈమధ్య విడుదల అయిన ''ఓనమాలు''
సంభాషణా రచయిత గా మంచి పేరు తెచ్చుకొని ఉన్నారు.

(హెచ్.ఎం.టి.వి. లో వందేళ్ళ కధ లో ''ఖదీర్ బాబు''ఇంటరవ్యు లింక్ ఇక్కడ  )

Sunday 4 November 2012

జయ సుధ ....రీచార్జ్

సహజ నటి జయ సుధ....తన గురించి వ్రాసిన రీచార్జ్ 




సహజ సుధ
కురిసే చినుకు చేసే ధ్వనికి ఆల్టర్నేట్ లేదు.
విరిసే పువ్వు చూపే సొగసుకు ఆల్టర్నేట్ లేదు.
మెరిసే పసినవ్వుకు ఆల్టర్నేట్ లేదు.
కారే కన్నీటి చుక్కకు ఆల్టర్నేట్ లేదు.
అవన్నీ సహజమైనవి. ప్రత్యేకమైన అలంకారాలు అవసరైం లేనివి.
అనుకరించడానికి వీలుకానివి.
జయసుధ కూడా ఇలా ఆల్టర్నేట్ లేని విధంగా ఇండస్ట్రీలో నిలబడ్డారు.
ఆల్టర్నేట్ సాధ్యంకాని విధంగా ముద్ర వేశారు.
ఇందుకు ఆమె ప్రత్యేకంగా కష్టపడలేదు. ప్రత్యేకంగా ఎఫర్ట్ పెట్టలేదు.
ప్రత్యేకంగా పాఠాలు నేర్వలేదు.
ఆమె ఆర్టిస్ట్ కావడం అనేది ఒక సహజమైన ప్రాసెస్.
సహజమైనదేదైనా స్థిరంగా ఉంటుంది.
జయసుధ స్థిరం.
నిన్నటికి. రేపటికీ. బహుశా ఎప్పటికీ.



ఇంటర్వ్యూ, కథారూపం : ఖదీర్

తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును.
- బైబిల్


*******
‘అడవిరాముడు’ షూటింగ్.
దట్టమైన మధుమలై అడవుల్లో ఔట్‌డోర్.
ఎన్టీఆర్, జయప్రద, జయసుధల కాంబినేషన్‌లో షాట్స్.
అప్పటికి వారమయ్యింది షూటింగ్ మొదలయ్యి. జయసుధ ముందే వచ్చేశారు. జయప్రద ఆ రోజే జాయిన్ అయ్యారు. సాధారణంగా మద్రాసు దాటి బయటకు రాని ఎన్టీఆర్ ఔట్‌డోర్‌కు అంగీకరించి ఆ దట్టమైన ఆడవిలో తనే ఒక పులిలా ఉత్సాహంగా ఉరకలు వేస్తున్నారు. భారీ సినిమా. భారీ యూనిట్. భారీ హంగామా. భారీ ఖర్చు. అంతా బాగానే ఉందిగాని జయప్రదకే బిక్కుబిక్కుమంటూ ఉంది. ఆమెకు ఆ ముందురోజు రాత్రంతా నిద్ర లేదు. విండో జామ్ అయ్యి సరిగ్గా పడక దోమలు. మధుమలైలో పులి ఎదురుపడినా ఎవరూ భయపడరుగాని దోమ ఎదురుపడితే మాత్రం హడలిపోతారు. కుడితే సెరిబ్రల్ మలేరియా గ్యారంటీ. లేదంటే వైరల్ ఫీవర్. అందుకే రాత్రంతా జయప్రద మేల్కొనే ఉన్నారు. నిద్రలేక మైండ్ ఫ్రెష్‌గా ఉండదనే భయం ఒకటి. తెల్లవారితే ఎన్టీఆర్ పక్కన నటించాలన్న టెన్షన్ ఒకటి. ఫస్ట్‌టైమ్ ఆయన పక్కన. అదీ హీరోయిన్‌గా. తాను తప్పు చేస్తే? టేకులు తింటే? ఎన్టీఆర్‌కు ఇంప్రెషన్ పోతే?
తెల్లారింది. స్పాట్‌కు ఎన్టీఆర్, జయసుధ, జయప్రద వచ్చారు. రాఘవేంద్రరావు సీన్ వివరించారు. డైలాగ్ పేపర్స్‌ని క్షణం సేపు పరికించిన ఎన్టీఆర్ ‘రెడీ... టేక్’ అన్నారు.
పిన్‌డ్రాప్ సెలైన్స్.
‘యాక్షన్’ రాఘవేంద్రరావు అరిచారు.
ఎన్టీఆర్ డైలాగ్ చెప్పారు. తర్వాత జయసుధ చెప్పాలి. ఆ తర్వాత జయప్రద చెప్పాలి.
జయసుధ తప్పు చెప్పారు.
‘కట్.... వన్ మోర్’ అన్నారు రాఘవేంద్రరావు.
ఎన్టీఆర్ డైలాగ్ చెప్పారు. జయసుధ తప్పు చెప్పారు.
‘కట్... వన్‌మోర్’ అన్నారు రాఘవేంద్రరావు.
ఎన్టీఆర్ డైలాగ్ చెప్పారు. జయసుధ తప్పు చెప్పారు.
ఒక నిమిషం షూటింగ్ ఆగిపోయింది. ఎన్టీఆర్ అందరి వైపూ చూసి, జయసుధ, జయప్రదల దగ్గరకు వచ్చి, ఈజ్ చేయడానికన్నట్టుగా నవ్వి ‘యేం... మాకేమైనా కోరలు ఉన్నాయా? హాయిగా డైలాగ్ చెప్పండి’ అన్నారు.
‘యాక్షన్’ రాఘవేంద్రరావు అరిచారు.
ఎన్టీఆర్ డైలాగ్ చెప్పారు. జయసుధ డైలాగ్ చెప్పారు. జయప్రద డైలాగ్ చెప్పారు. షాట్ చాలా బాగా వచ్చింది. యూనిట్‌లో అందరూ క్లాప్స్ కొట్టారు.
తర్వాతి షాట్‌కు ఏర్పాట్లు జరుగుతుంటే ఎన్టీఆర్ దూరంగా వెళ్లి కుర్చీలో కూచున్నారు. తర్వాత జయసుధను పిలిచారు.
‘ఎందుకు కావాలని డైలాగులు తప్పు చెప్పావ్?’
జయసుధ స్టన్ అయ్యారు. ఈయనకెలా తెలిసిపోయింది.
‘ఏం లేదు సార్. జయప్రదకు రాత్రంతా నిద్రలేదు. ఫస్ట్‌టైమ్ మీతో చేస్తున్నానని టెన్షన్. కన్ఫ్యూజన్‌లో తప్పు చెప్తానేమోనని భయపడుతోంది. అందుకని నేనే తప్పు చెప్పాను. రెండుసార్లు తప్పు చెప్తే ఈలోపు తను సర్దుకుంటుందనీ’....
ఎన్టీఆర్ జయసుధ వైపే చూశారు. ఏమాత్రం వీలు దొరికినా ఒకరిపై మరొకరు పై చేయి సాధించడానికి అనుక్షణం పాకులాడే పోటాపోటీ ఇండస్ట్రీ ఇది. అలాంటి ఇండస్ట్రీలో ఇలాంటి యాటిట్యూడ్.
ఎన్టీఆర్ గుడ్ అన్నట్టుగా తల పంకించారు.
అప్పటికి జయసుధకు ఎన్టీఆర్ పక్కన హీరోయిన్‌గా అవకాశం రాలేదు. అడవిరాముడులో అవకాశం వచ్చినా అది సెకండ్ హీరోయిన్. ఇంకా చెప్పాలంటే ప్రధానపాత్ర.
కాని- ఇది జరిగిన కొన్ని రోజులకు- దైవికంగా- ఎన్టీఆర్ పక్కన ఆమె వరుసగా నాలుగు సినిమాల్లో హీరోయిన్‌గా బుక్ అయ్యారు.
రామకృష్ణులు, లాయర్ విశ్వనాథ్, కేడి నం.1, డ్రైవర్‌రాముడు.
తనను తాను తగ్గించుకున్నవారు హెచ్చించబడటం అంటే అదే.

*******

ఈ పెదవులు ఎందుకు అంటే డైలాగ్‌ను ఉచ్ఛరించడానికి.
ఈ మాటలు ఎందుకు అంటే దైవాన్ని స్తుతించడానికి.

*******

‘ఏమ్మా... నీకు తమిళం వచ్చా’ అని అడిగారు కె.బాలచందర్.
‘వచ్చు సార్’ అన్నారు జయసుధ.
‘తెలుగమ్మాయివి అన్నావ్’
‘మేము ఇక్కడ స్థిరపడి చాలా ఏళ్లు అయిపోయింది సార్. మా నాన్నగారు మద్రాసు కార్పొరేషన్‌లో పని చేస్తారు. అమ్మ ఇంట్లో ఉంటారు. నేను పెద్దదాన్ని’
ఆయన జయసుధను పరిశీలించి చూశారు. పద్నాలుగేళ్లుంటాయి. చదువు ఆపేసిన అమ్మాయి. సినిమాల కోసం ప్రయత్నిస్తున్న అమ్మాయి. అయితే ఆయన దగ్గరకు నిత్యం ఇలాంటివాళ్లు చాలామంది వస్తుంటారు. కాని నిలవరు. మెకానిక్ షెడ్‌లో చేరినంత మాత్రాన మెకానిక్‌లు అయిపోరు. మెకానిక్ కావాలని నిశ్చయించుకున్నవాళ్లే అవుతారు.
‘మీ పిన్ని విజయనిర్మలగారు పెద్ద యాక్టర్ కదమ్మా. పండంటి కాపురం చేశాక ఆమె దగ్గరే కంటిన్యూ చేయకుండా నా దగ్గరకెందుకొచ్చావ్’
జయసుధ సమాధానం చెప్పలేదు.
‘చెప్పు’
‘టీచర్లు బంధువులైతే వాళ్ల దగ్గర పాఠాలు రావు సార్. నాకు మీలాంటి గురువు కావాలి. గోడకుర్చీ వేయించైనా సరే పాఠాలు చెప్పే గురువు’
బాలచందర్ కళ్లద్దాలు సవరించుకున్నారు.
‘సరి. హీరోయిన్ వేషమేగా నువ్వు కోరుకుంటున్నది’
జయసుధ ‘అవును’ అనుంటే వెంటనే పంపించేసి ఉండేవారు. తన మెకానిక్ షెడ్‌కు అలాంటి ఆశపోతులు పనికి రారు.
‘కాదు సార్. నేను చేయదగ్గ క్యారెక్టర్ ఏదైనా చేయాలని కోరుకుంటున్నాను. అది ఎంత చిన్నపాత్ర అయినా సరే’
బాలచందర్ ఏమీ మాట్లాడలేదు.
‘సరి’ అన్నారు.
ఇది జరిగిన కొన్ని నెలలకు బాలచందర్ ‘అపూర్వ రాగంగళ్’ అనే సినిమా తీశారు. తెలుగులో ‘తూర్పూ పడమర’గా రీమేక్ అయిన ఆ సినిమా తమిళనాడులో కనీవినీ ఎరగనంత పెద్ద హిట్ అయ్యింది. అందులోని నాలుగు ముఖ్యపాత్రల్లో మూడింటిని పోషించిన కమల్‌హాసన్, శ్రీవిద్య, రజనీకాంత్‌ల పేరు మార్మోగిపోయింది. అయితే- వీళ్లతో పాటు నాలుగో ముఖ్యపాత్ర చేసిన నటి పేరు కూడా.
జయసుధ! అవును. జయసుధే.
చిన్నపాత్రలు కోరితే పెద్ద పాత్రలకు హెచ్చించబడిన జయసుధ.

*******

నిరాడంబరతకు సాటిరాగల రిచ్‌నెస్ వేరొకటి లేదు.

*******

కె.రాఘవేంద్రరావు జీవితాన్ని శంకర్-జైకిషన్ దెబ్బ కొట్టారు. వందమంది వయొలనిస్ట్‌లను, వీణ, సితార్, తబలా, డోలక్, సారంగి... ఇలా లెక్కకు మించిన ఇన్‌స్ట్రుమెంట్‌లను పెట్టి వాళ్లు లైవ్‌లో చేసే రికార్డింగ్‌లను చూస్తే రాఘవేంద్రరావుకు వెర్రి. తాను సినిమా తీస్తే పెద్ద పెద్ద సెట్లు ఉండాలి ఇలాంటి భారీ మ్యూజిక్కు ఉండాలి అనుకున్నారాయన. అలా అనుకొనే తొలి సినిమా ‘బాబు’ తీశారు శోభన్‌బాబును పెట్టి. అందులో పెద్ద పెద్ద సెట్టింగ్‌లు వేశారు. ‘ఒక జంట కలిసిన తరుణాన’... అని భారీ ఆర్క్రెస్ట్రాతో పాటలు రికార్డ్ చేశారు. అయితే వీటన్నింటిని చూసుకుంటున్న ఆయన ఒక చిన్న కీలకమైన విషయాన్ని వదిలేశారు. కథ. అది సరిగ్గా పండలేదు. సినిమా పెద్దగా ఆడలేదు. రాఘవేంద్రరావు నాలుక కరుచుకున్నారు. ఈసారి కథ మీద దృష్టి పెట్టారు. అప్పుడే హిందీలో హృషీకేశ్‌ముఖర్జీ తీసిన ‘మిలీ’ వచ్చింది. జయభాదురి హీరోయిన్. సబ్జెక్ట్: క్యాన్సర్. దానిని స్ఫూర్తిగా తీసుకొని ‘జ్యోతి’ కథ అనుకున్నారు. ఒక పదహారేళ్లమ్మాయి, నవ్వుతూ తుళ్లుతూ ఉండే అమ్మాయి, తన ఇంటి మేడ మీద అద్దెకుండే అబ్బాయిని మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకుందామని కలలు కంటున్న అమ్మాయి హటాత్తుగా తల్లకిందులైపోతుంది. అరవై ఏళ్ల ముసలాణ్ణి పెళ్లాడుతుంది. ఇలాంటి సబ్జెక్ట్‌కు కొత్తవాళ్లుండాలని రాఘవేంద్రరావు అనుకున్నారు. అప్పటికే తెలుగు తమిళంలో గుర్తింపు పొందిన జయసుధ అయితే బాగుంటుందనుకున్నారు. అయితే సంశయం. అంతకుముందే ‘లక్ష్మణరేఖ’ సినిమాతో జయసుధ తెలుగులో హీరోయిన్‌గా గుర్తింపు పొందారు. ఆమె ఇప్పుడు కమర్షియల్ బ్రేక్ కోసం ట్రై చేస్తుండవచ్చు. డాన్సులు చేసే పాటలు పాడే గ్లామర్ పాత్రలు కోరుకుంటూ ఉండొచ్చు. మరి జ్యోతిని అంగీకరిస్తుందా? అదీ గుమ్మడిని కట్టుకునే పాత్రని.
‘నన్నే ఈ పాత్రకు ఎందుకు అనుకున్నారు?’ అని అడిగారు జయసుధ.
‘బొట్టు పెడితే నీ ముఖం కళగా ఉంటుందమ్మా. అందుకని. నెంబర్ టు... నీ నవ్వు బాగుంటుంది. ఈ సినిమా ఫస్ట్‌హాఫ్‌లో నీ క్యారెక్టర్ హాయిగా నవ్వుతూ ఉంటుంది. అందుకని’ అన్నారు రాఘవేంద్రరావు.
జయసుధ ఆలోచించలేదు.
‘మరైతే ఏమిటి సందేహం. నేను చేస్తాను’ అన్నారు.
‘అది కాదమ్మా. సినిమాలో ఎక్కడా గ్లామర్ ఉండదు. సెకండ్‌హాఫ్‌లో ఇంకా డల్‌గా చూపిస్తాం. అది నీకు క్లియర్ చేద్దామని’...
జయసుధ వారించారు- ‘సార్. నేనిక్కడకు ఆర్టిస్ట్ అవుదామని వచ్చానుగాని స్టార్‌ని కావడానికి కాదు. ఆర్టిస్ట్‌లందరూ స్టార్‌లు కావచ్చు కాని స్టార్‌లందరూ ఆర్టిస్ట్‌లు కాలేరు. ఒకవేళ స్టార్ కంటే ఆర్టిస్ట్ అనేదే చిన్న పదం అయితే నేను ఆర్టిస్ట్‌గా అడ్జస్ట్ కావడానికే సిద్ధంగా ఉన్నాను’
ఆమె ఆ జవాబు ఎంత కచ్చితంగా చెప్పారంటే రాఘవేంద్రరావు సందేహాలన్నీ తీరిపోయి ధైర్యం వచ్చింది.
1976. జ్యోతి రిలీజయ్యింది. ఆంధ్రదేశంలో సిరిమల్లె పువ్వల్లె నవ్వు అంటూ దుమ్మురేగిపోయింది. పాటలు సూపర్ హిట్. రాఘవేంద్రరావు డెరైక్షన్ సూపర్ హిట్. ఆర్టిస్టుగా జయసుధ సూపర్ హిట్. అయితే- ఆశ్చర్యకరంగా ఆమెకు స్టార్ ఇమేజ్ కూడా వచ్చేసింది.
అవును. జయసుధ ఇప్పుడు తెలుగులో స్టార్.
అర్టిస్ట్‌గా అడ్జస్ట్ అవడానికి వీల్లేనంతగా హెచ్చించబడిన స్టార్.
కొంచెమే ఆమె కోరుకుంది. కాని దైవం కొంచెంతో సంతృప్తి చెందలేకపోయింది.

******

దైవం ఎదుట వెలిగించే దీపానికి వెలుగే తప్ప మతం ఉండదు.

******

మద్రాసు ట్రిప్లికేన్‌లోని ఆ మధ్యతరగతి ఇంటిలో ఉంటున్నప్పుడు జయసుధకు ఒకటే కోరిక. తనకో పూజగది ఉండాలని. కాని నలుగురు పిల్లలు నలుగురు పెద్దవాళ్లు ఉండే ఆ ఇంట్లో ఆమెకు ప్రత్యేకంగా ఒక పూజ గది ఎక్కణ్ణుంచి వస్తుంది? అందుకే తను నిద్ర పోయే మంచం వెనుక అల్మారాయే ఆమె పూజ గది. అందులో వరుసగా పటాలు ఉండేవి. ఆంజనేయస్వామి, వినాయకుడు, శ్రీ వేంకటేశ్వరుడు. జయసుధకు దైవం పట్ల ఉన్న భక్తి చూసి ఎవరెవరో ఏవేవో పటాలు ఇచ్చేవారు. ఒకసారి ఒక క్రిస్టియన్ ఫ్రెండ్ ఏసుక్రీస్తు పటం ఇచ్చింది. దానికి చోటు కల్పించుదామని అల్మారా వెతికితే కొంచెం కూడా స్థలం లేదు. అన్నీ పటాలే. అప్పుడు జయసుధ- ఆ పటాన్ని పక్కన పెట్టేయకుండా- తన మంచం పక్కన ఉండే కిటికిలో అమర్చుకుంది. నిద్రలేవగానే జీసస్. నిద్రపోయే ముందు జీసస్.
‘జీసస్. నాకు అవసరం లేనివి నాకు ఇవ్వకు. అవసరం ఉన్నవి కచ్చితంగా ఇవ్వు’ అని కోరుకునేవారు జయసుధ. తల్లిదండ్రులు ఇది చూసి- జీసస్ పరాయి దేవుడని చెప్పి- జయసుధను వారించలేదు. ఎందుకంటే జయసుధ తండ్రి ఆర్యసమాజం కోసం చురుగ్గా పని చేసేవారు. ఆయన కులం ఏమిటో ఆయన చెప్పుకునేవారు కాదు. జయసుధ తల్లి తాను బ్రాహ్మిన్ అయినా భక్తి ముఖ్యం అనుకునేవారే తప్ప దేవుడు ముఖ్యం అని అనుకునేవారు కాదు. అంతా మంచే అనుకునేవాళ్లకు అంతా మంచే జరుగుతుంది.
కాని జయసుధకు జరగబోయే మంచి ఏమిటి?

******

‘అన్నయ్య సన్నిధి... అదే నాకు పెన్నిధి...
కనిపించని దైవమే... నా కనుల ముందరున్నది’....
1968. ‘బంగారు గాజులు’ కోసం పాట తీస్తున్నారు అక్కినేని, విజయనిర్మల మీద మద్రాసులో. జయసుధకు షూటింగ్‌లు చూడ్డం అంటే పిచ్చి. ముఖ్యంగా హీరోయిన్లు తొడుక్కునే కొత్త బట్టలను చూడటం అంటే వెర్రి. సినిమా హీరోయిన్ అయితే రోజుకో కొత్త డ్రస్సు వేసుకోవచ్చు అనేది ఆమెకు మొదటగా సినిమాల మీద ఆసక్తి కలగడానికి పని చేసిన కారణం. అదీగాక విజయనిర్మల తరచూ ఊళ్లో ఉండేవారు కాదు. ఒకరోజు మద్రాసు, ఇంకో రోజు బెంగుళూరు. మరో రోజు ఊటి. షూటింగ్ కోసం తిరుగుతుండేవారు. జయసుధకు ఇది కూడా కోరికే. సినిమా హీరోయిన్ అయితే హాయిగా ఊళ్లు తిరగొచ్చు. రకరకాల ప్రాంతాలు చూడొచ్చు. అప్పుడే ఆమె నిశ్చయించుకున్నారు సినిమాల్లో యాక్ట్ చేయాలని.
కాని, అంత సులువా ఆ పని?

******

మనం కనిపెట్టవలసిన దారి ఎప్పుడూ గజం దూరంలోనే ఉంటుంది.

******

తాను దిగాల్సిన గోదా చాలా భయంకరంగా ఉంది.
పెర్ఫార్మెన్స్- వాణిశ్రీ- అదరగొట్టేస్తున్నారు.
గ్లామర్- మంజుల, లత, లక్ష్మి- ఇరగదీసేస్తున్నారు.
అందం- జయప్రద రెపరెపలాడిపోతున్నారు.
తానేం చేయాలి. తను గొప్ప అందగత్తె కాదు. వాణిశ్రీలా డైలాగ్‌ని మరిగించి దించలేరు. లక్ష్మిలా మిడ్డీస్ వేసుకుంటే ఆ గ్రేస్ కనిపించదు. మంజులలా సన్నగా పలుచగా నవనవలాడిపోలేరు.
తనేం చేయాలి.
అప్పటికి తను పండంటి కాపురంలో యాక్ట్ చేశారు. నోములాంటి సినిమాల్లో కనిపించారు. బాలచందర్‌తో పని చేశారు. తమిళంలో అపూర్వ రాగంగళ్, తెలుగులో జ్యోతి చేశారు. ఇక మీదట తను స్పీడప్ అయ్యే సూచనలు ఉన్నాయి. ఇబ్బడి ముబ్బడిగా అవకాశాలు రాబోతున్నాయి. ఇప్పుడే తన స్టయిల్ డిసైడ్ కావాలి? అందుకు ఏం చేయాలి. తనకు మోడ్రన్ డ్రస్సులు సూట్ కావు. మైనస్. తెలుగు చదవడం రాయడం రాదు గనుక, తాను కేవలం విని గుర్తు పెట్టుకొని డైలాగ్ చెప్తుంది కనుక పెద్ద పెద్ద సమాసాలు సంధులు ఉన్న డైలాగులు చెప్పలేదు. మైనస్. లతలా సెక్సీగా కనిపించడం చేతకాదు కనుక అదీ మైనస్సే. మరేం చేయాలి.
జయసుధ ఆలోచించారు. చుట్టూ చూశారు. సమాధానం కనిపించింది. జయభాదురి. ఆమె అందంగా ఉండదు. గ్లామర్‌గా కనిపించదు. సెక్సీగా అనిపించదు. కాని ఆమె డిఫరెంట్. లక్షల మంది అభిమానులున్న హీరోయిన్.
తను అలా ఉండాలి.
సింపుల్ మేకప్. సాధారణంగా కనిపించే చీరలు. అరవకుండా కరవకుండా కృతకంగా కనిపించకుండా సహజంగా ఉండేలా డైలాగులు.... తనను తాను ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఎంత హుందాగా చూసుకుంటే అంత మంచిది. ఎందుకంటే - హుందాగా కనిపించడం కూడా ఉన్నతంగా కనిపించడమే.
కాకపోతే ఈ ధోరణినంతటినీ కన్సాలిడేట్ చేసే ఒక్క సినిమా పడాలి. పడితే సెటిల్ అయిపోయినట్టే.
పడింది.
శివరంజని.
సావిత్రి జీవితకథను దృష్టిలో పెట్టుకొని దాసరి తయారు చేసుకున్న ఈ స్క్రిప్ట్‌కు ఆస్థాయిలో న్యాయం చేసే నటి ఆయనకు జయసుధ తప్ప వేరొకరు కనిపించలేదు.
ఆయన జయసుధకు ఫోన్ చేశారు.
‘సాధారణంగా నా సినిమాలకు డైలాగ్ బలంగా ఉంటుంది. ఈ సినిమాలో ఎక్స్‌ప్రెషనే బలం. నువ్వు ఆ బలాన్ని ఇవ్వాలి’ అన్నారు.
జయసుధ స్వీకరించారు. దాసరి ఊహించిన పాత్రకు ప్రాణం ఇచ్చారు. సినిమా రిలీజ్ అయ్యింది. సూపర్ డూపర్ హిట్.
అంతటితో జయసుధ తిరుగులేని స్థానానికి చేరుకున్నారు.
జనం ఆమెకు బిరుదునిచ్చి గౌరవించుకున్నారు.
సహజనటి!

******

కేక్ మూడు ముక్కలుగా కట్ అయ్యింది.
ఒక ముక్క జయప్రదకి. ఒక ముక్క జయసుధకి. ఒక ముక్క శ్రీదేవికి.
సినిమాలు ముగ్గురూ పంచుకుంటున్నారు. విడివిడిగా సక్సెస్‌లు ఇస్తున్నారు. కలిసి యాక్ట్ చూస్తూ హిట్స్ ఇస్తున్నారు.
ఇది కథ కాదు. ఇల్లాలు. శ్రీవారి ముచ్చట్లు. త్రిశూలం. మేఘసందేశం. శక్తి. గృహ ప్రవేశం.
సంవత్సరాలు గడిచాయి. చాలామంది వచ్చారు. వెళ్లారు. కాని వీళ్లు ముగ్గురే ఏలుతున్నారు. కాని సినిమా అనేది సర్కస్ డేరా లాంటిది. ఒక చోట కలెక్షన్లు తగ్గగానే ఇంకోచోటుకు వెళ్లిపోవాలి. లేదా ఇంకా మంచి కలెక్షన్లు వచ్చే చోటుకి వెళ్లిపోవాలి.
ఈ సంగతిని మొదటగా కనిపెట్టింది శ్రీదేవి, జయప్రద.
తెలుగులో కొత్తతరం హీరోలు వస్తున్నారు అని గ్రహించిన వెంటనే వాళ్లు బొంబాయి షిఫ్ట్ అయిపోయారు. లేదా తెలుగులో చేస్తే పెద్ద హీరోలకు మాత్రమే చేస్తాం అని నియమం పెట్టుకున్నారు.
ఇదేం న్యాయం.
ముఖానికి మేకప్ వేసుకునేది యాక్ట్ చేయడానికి.
అది ఎన్టీఆర్ ఎదుటనా ఏఎన్నార్ ఎదుటనా మురళీమోహన్ ఎదుటనా అని చూసుకుంటామా?
ఒకరితో చేస్తే ఎక్కువ? ఇంకొకరితో చేస్తే తక్కువా? దానిని బట్టి జనం గౌరవించడం మానేస్తారా? మీనాకుమారి టాప్ హీరోయిన్‌గా ఉన్నప్పుడు కూడా ధర్మేంద్ర వంటి కొత్త హీరోతో చేసింది. మధుబాల సూపర్‌స్టార్‌గా ఉన్నప్పుడు కూడా కిశోర్‌కుమార్ వంటి కామెడీ హీరోతో చేసింది. నర్గిస్ మంచి వయసులో ఉన్నప్పుడే ముసలి పాత్రకు అంగీకరించి ‘మదర్ ఇండియా’ వంటి కళాఖండాన్ని సృష్టించింది.
వర్తమానంలో కూడా స్మితాపాటిల్, షబానా ఆజ్మి లాంటివాళ్లు ఇటు కమర్షియల్, అటు ఆల్టర్నేట్ సినిమాల్లో యాక్ట్ చేస్తూ డబ్బు, గౌరవం సంపాదించుకుంటున్నారు.
మరి మనమెందుకు ఆ పని చేయకూడదు.
జయసుధ బైబిల్‌లోని ఆ ప్రసిద్ధ వాక్యాన్ని మళ్లీ స్మరించుకున్నారు.
‘తనను తాను తగ్గించుకున్నవారు హెచ్చించబడుదురు’.
జయసుధ కన్ఫ్యూజన్ లేకుండా యాక్టింగ్‌ను కంటిన్యూ చేశారు. చంద్రమోహన్, మోహన్‌బాబు, శరత్‌బాబు వీళ్లందరితోనూ యాక్ట్ చేశారు.
అయితే ఏమైంది?
అంతకు ముందు ప్రేక్షకులకూ ఆమెకూ ఎంతో కొంత దూరం ఉండేది.
ఇప్పుడు ఆమె ప్రతి ఇంటి ఆడపడుచు.

******

నీ దగ్గర రివాల్వర్ ఉండాలేగాని బుల్లెట్లు అసలు సమస్యే కాదు.

******

పూరి జగన్నాథ్ కలిశాడు జయసుధను ఒకరోజు.
‘మీరో క్యారెక్టర్ చేయాలండీ నా సినిమాలో’ అని అడిగాడు.
జయసుధ అప్పటికి ఏ విధంగానూ లైమ్‌లైట్‌లో లేరు. కాని తనను సరిగ్గా వెలిగించే పాత్ర కోసం ఎదురు చూస్తున్నారు.
‘ఏం క్యారెక్టర్‌‘ అడిగారు.
‘రవితేజకు తల్లిగా యాక్ట్ చేయాలి. కాని రొటీన్ తల్లి కాదు. ఫ్రెండ్లీగా ఉండే ఈ కాలం తల్లిగా. ఒక ఎడ్యుకేటెడ్ తల్లిగా’
జయసుధకు కొంచెం నీరసం వచ్చింది.
‘మళ్లీ తలకు తెల్ల రంగు వేసుకోవడమేగా’ అన్నారు.
‘కాదండి. తల్లులు తలకు నల్ల రంగు వేసుకోవడం మొదలయ్యి చాలా కాలం అయ్యింది. తల్లంటే తెల్ల జుట్టే ఉండాలా’ అన్నాడు పూరి.
‘బతికించావ్. చూడు ఎలా చేస్తానో’
ఆ సినిమా అమ్మా నాన్నా ఓ తమిళమ్మాయి.
జయసుధ మళ్లీ ఒకసారి తెర మీద మెరిశారు. ఆర్టిస్ట్ ఆర్టిస్ట్‌గా ఉండటం అంటే ఏమిటో చూపించారు. తెలుగు రంగంలో అత్యంత డిమాండ్ ఉన్న అమ్మగా కొత్త ఫేజ్‌లోకి అడుగు పెట్టారు. సినిమాకు ఇంత అని కాకుండా రోజుకు ఇంత అని లెక్క వేస్తే ఆమె ప్రస్తుతం తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఏ టాప్ హీరోయిన్ రెమ్యూనరేషన్ కంటే ఏ మాత్రం తక్కువ కాదు.

******

జయసుధకు ఇటీవల ఫిల్మ్‌ఫేర్ వాళ్లు లైఫ్‌టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డ్ ఇచ్చారు.
జీవన సాఫల్య పురస్కారం.
హిందీ రంగంలో ఈ సాఫల్య పురస్కారం కోసం ఇంకా మహామహులు ఎదురు చూస్తూనే ఉన్నారు. తెలుగులో కూడా ఇంకా పెద్ద పెద్ద హీరోయిన్లు ఈ పురస్కారానికి ఆమడదూరంలోనే ఉన్నారు.
కాని జయసుధకు మాత్రం ఈ ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది.
ఎందువల్ల?
ఆమె ఎప్పుడూ క్యారెక్టర్‌ను చార్జ్ చేయడానికి చూశారు తప్ప కెరీర్‌ను చార్జ్ చేయడానికి చూడలేదు.
వృత్తికి న్యాయం చేయాలని చూశారు తప్ప డబ్బుకు న్యాయం చేయాలని చూడలేదు.
సాధారణంగా ఉండాలని చూశారు తప్ప అసాధారణంగా కాదు.
కాని- ఆశ్చర్యం ఏమిటంటే ఆమె క్యారెక్టర్‌ను చార్జ్ చేసిన ప్రతిసారి క్యారెక్టర్ ఆమెను రీచార్జ్ చేసింది.
వృత్తికి న్యాయం చేసిన ప్రతిసారి డబ్బు ఆమెను రీచార్జ్ చేసింది.
సాధారణంగా ఉండాలనుకున్న ప్రతిసారి దైవం ఆమెను అసాధారణంగానే ఉంచింది.

అభినవ తారవో...
విజయనిర్మల బంధువైన జయసుధ, కృష్ణకు చెల్లెలు వరస అవుతుంది. అందుకే చాలాకాలం పాటు ఆమెను కృష్ణ పక్కన ఎవరూ హీరోయిన్‌గా తీసుకోలేకపోయారు. విజయనిర్మలే రిస్క్ చేసి 1982లో ‘డాక్టర్ సినీ యాక్టర్’లో కృష్ణ పక్కన జయసుధను యాక్ట్ చేయించారు.

జయసుధ తన కెరీర్ మొత్తంలో ఎక్కువ సినిమాల్లో జోడీగా నటించింది కృష్ణంరాజుతోనే. ‘అమరదీపం’(1977) తో వీరి కాంబినేషన్ స్టార్ట్ అయ్యింది.

చంద్రమోహన్‌తో కూడా జయసుధ ఎక్కువ సినిమాలే చేశారు. తమ కెరీర్ తొలినాళ్లలో శ్రీదేవి, జయప్రద ఇద్దరూ చంద్రమోహన్‌కి జోడీగా చేశారు. స్టార్‌డమ్ సంపాదించుకున్నాక మాత్రం వాళ్లు చంద్రమోహన్‌కి దూరం అయ్యారు. జయసుధ ఒక్కరే... ఇప్పటికీ ఆయనకు జోడీగా నటిస్త్తూనే ఉన్నారు. పక్కింటమ్మాయి, సత్యభామ, గోపాలరావు గారి అమ్మాయి, కలికాలం, శ్రీమతి ఒక బహుమతి, అల్లరి పెళ్లాం-చిల్లర మొగుడు, రేపటి కొడుకు తదితర చిత్రాలు వీరి కాంబినేషన్‌లో వచ్చారు.

}-§ేవితో కలిసి జయసుధ చాలా సినిమాలు చేశారు. ముద్దుల కొడుకు, బంగారు తల్లి, ఊరంతా సంక్రాంతి, గజదొంగ, ఇల్లాలు, ప్రేమాభిషేకం... ఎట్సెట్రా.

జయప్రద, జయసుధ కాంబినేషన్‌లో అయితే సుమారు పాతిక సినిమాలు వచ్చాయి. రాజువెడలె, అడవిరాముడు, రామకృష్ణులు, శ్రీవారి ముచ్చట్లు, మహాసంగ్రామం, బంగారు కాపురం, నాయుడు బావ, జీవితనౌక, తాండ్ర పాపారాయుడు వాటిలో కొన్ని.

విజయశాంతి, రాధిక, సుహాసిని, రాధ... వీళ్ల హవా మొదలయ్యే సమయానికి జయసుధ ఓ బిడ్డ తల్లి అయ్యారు. 1985లో తన సెకండ్ ఇన్నింగ్స్‌ని మొదలుపెట్టారు. 1993లో ఆమె థర్ట్ ఇన్నింగ్స్ మొదలైంది. 1993 జూన్ నెలలో మూడు సినిమాలు విడుదలయ్యాయి. మూడూ మూడు రకాలు. జూన్ 4న విడుదలైన ‘బావ-బావమరిది’లో సంప్రదాయ గృహిణి పాత్ర పోషిస్తే, జూన్ 11న వచ్చిన ‘మనీ’లో మోడ్రెన్‌గా కనిపించారు. ఇక జూన్ 18న విడుదలైన ‘ఇన్‌స్పెక్టర్ ఝాన్సీ’లో పక్కా మాస్‌రోల్ చేశారు.

ఆమె కెరీర్ మొత్తం మీద వేరే వారి గాత్రంతో నటించిన సినిమా ఎన్టీఆర్ ‘వెంకటేశ్వర కళ్యాణం’. అది పౌరాణిక చిత్రం అవ్వడంతో సమాస భూయిష్టమైన పదాలను పలకడం కాస్త కష్టం అవ్వడంతో ఆ పాత్రకు ఎన్టీఆర్ వేరే వారితో డబ్బింగ్ చెప్పించారు.

చిరంజీవితో నాలుగు సినిమాలు చేశారు. ఇది కథ కాదు, మగధీరుడు, రిక్షావోడు, హ్యాండ్సప్. జయసుధ సొంతంగా నిర్మించిన ‘హ్యాండ్సప్’లో చిరంజీవి గెస్ట్‌గా చేశారు.

జయసుధ తల్లి జోగాబాయి బాలనటిగా ఓ సినిమా చేశారు. దర్శక, నిర్మాత కేయస్ ప్రకాశరావు బాలానందం సభ్యులతో ఓ బాలల చిత్రం చేశారు. అప్పుడు జోగాబాయి బాలానందంలో సభ్యురాలు. అలా ఆమె కూడా ఆ సినిమాలో కనిపిస్తారు.

జయసుధకు ఒక చెల్లెలు, ఇద్దరు తమ్ముళ్లు. చెల్లెలు సుభాషిణి యాక్టింగ్‌లోకి వచ్చారు కానీ, తమ్ముళ్లెందుకో సినిమా ఫీల్డ్‌కి దూరంగా ఉన్నారు. దాసరి దర్శకత్వంలో వచ్చిన ‘బ్రహ్మముడి’లో ఒక తమ్ముడు శ్రీనాథ్ హీరోగా చేశాడు. ఆ తర్వాత ఆయన మళ్లీ నటించలేదు.

జయసుధ తన 14వ ఏట శంఖుమార్కు లుంగీకి మోడల్‌గా చేశారు. అలాగే లక్స్ సోప్‌కి మోడలింగ్ చేశారు. మద్రాసులోనే పుట్టి పెరగడం వల్ల జయసుధకు తెలుగు చదవడం, రాయడం రాదు. అప్పటికే సుజాత పేరుతో వేరే నటి ఉండటంతో తమిళ దర్శకుడు గుహనాదన్ ఆమె పేరును జయసుధగా మార్చారు.

ఆమె కథ
అసలు పేరు : సుజాత
పుట్టింది : 1958 డిసెంబర్ 17న మద్రాసులో
తల్లిదండ్రులు : జోగాబాయి, రమేష్ చందర్
తోబుట్టువులు : ఇద్దరు తమ్ముళ్లు, ఒక చెల్లెలు (సుభాషిణి)
చదివింది : ఏడో తరగతి
భర్త : నితిన్ కపూర్
పిల్లలు : ఇద్దరు అబ్బాయిలు (నీహార్, శ్రేయాన్)
తొలి సినిమా : పండంటి కాపురం - 1972 లక్ష్మణరేఖ - 1978 (కథానాయికగా)

నంది అవార్డులు : ఇది కథ కాదు ప్రేమాభిషేకం మేఘసందేశం ధర్మాత్ముడు స్వాతి చినుకులు అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి

నిర్మాతగా...
ఆది దంపతులు

కాంచనసీత

కలికాలం

అదృష్టం

వింతకోడళ్లు

మేరా పతి సిర్ఫ్ మేరాహై (హిందీ)

హేండ్సప్

జనని (టీవీ సీరియల్)

మిస్టర్ అండ్ మిసెస్ సుబ్బారావు (టీవీ సీరియల్)