స్వాగతం

ఖదీర్ బాబు గారి అభిమానులకు స్వాగతం

Tuesday 20 November 2012

అమ్మ ప్రేమలో తడిసిన సన్నజాజి పరిమళాలు

ఖదీర్ బాబు గారి అభిమానులకు ఒక చిన్న మనవి.
ముఖ్యంగా పుస్తక ప్రియులకు .....
ఒక పుస్తకం యొక్క గొప్పదనం చదువరులు వివరించినపుడు 
దాని విలువ ,మాధుర్యం అందరికి తెలుస్తాయి.
మీరు ఖదీర్ గారి కధలు ఏవైనా చదివుంటే వాటిలో 
మీకు నచ్చిన విషయాలను ఇక్కడి వారితో సహృదయంతొ 
పంచుకోండి. ఒకరు వ్రాసిన కధ పై ఇంకొకరు వ్రాసినా పరవాలేదు.
ఎందుకంటె ఎవరి ''ఆలోచనా లోచనాలు'' వారివి ....
ఎన్నో సృజనాత్మక దారుల మధ్య మనం ఏ దారిలో 
పోతున్నాము అనేదే కదా మన ఉనికిని లోకానికి చాటేది.
మీరు ప్రొఫైల్ లో ఉన్న ''మెయిల్ ఐ.డి''కి పంపితే 
ప్రచురిస్తాము.అందరం పంచుకొని సంతోషిస్తాము.

ముందుగా ''దర్గామిట్ట కధలు''లోని ఒక చక్కని కధ 
''మా యమ్మ పూల వ్యాపారం''  ఏముంది దీనిలో?
అసలు దర్గామిట్ట కధలు అని నెల్లూరు జిల్లా సంకేతంగా 
పేరు పెట్టారట,తను కావలి వాస్తవ్యులు అయినప్పటికీ ....
ఎక్కడా తన బాషకి,యాసకి పక్కకి పోకుండా ఒక 
బిడ్డ తన తల్లి పేదరికపు అంచుల్లో ,బురఖా ముసుగు వెనుక 
యెంత గౌరవంగా కాపురాన్ని లాక్కోచ్చిందో చెప్పే తీరు 
మనలను ఆ అమ్మ కష్టానికి ,నిజాయితీకి మన కన్ను చెమర్చి  
నమస్సులు తెలియచేస్తుంది.ఎందుకంటె మనం అందరం 
మాత్రం తల్లులకు బిడ్డలమే కదా .....

ఒక్క సారి ఫోటో చూడగానే పూల పరిమళం గుప్పుమందికదా 
పల్లెల నుండి వచ్చిన వాళ్లకి వాళ్ళ ఊరి పరిమళం కూడా 
తగులుతుంది.ఏమి కనిపిస్తుంది మీకు దానిలో ....
మంచుబిందువుల్లో  తడిసిన స్వచ్చత అంతేనా?
కాని ఈ కధ చదివిన తరువాత మనకు ....పూలను 
హత్తుకున్న అమ్మశ్రమతొ నిండిన స్వేదబిందువులు, 
ఆ చెట్టుతో అల్లుకుని పూలను పైసలుగా మార్చి పిల్లలను 
సాకిన పేదరికపు జీవితాలు కనిపిస్తాయి.

కధ మొత్తం ఖదీర్బాబు గారు స్వగతం లాగా సాగుతుంది.
ఎలా పేదరికం లోని డబ్బులు కరువు పూర్తికాని ఇల్లుగా 
మారి పరదాలు లేని కిటికీలు మనుషుల బ్రతుకులను 
చూపిస్తాయో,కనీసం సన్నజాజి తీగ పరదా గా వాళ్ళు ఎలా
గౌరవాన్ని కాపాడుకుంటారో తెలుస్తుంది.

కధలోకి వస్తే ''మా అమ్మ కోసే సన్నజాజి పూలని లెక్క పెట్టాలని 
నాకు భలే కోరిక.కోసినాక పూవు పూవుని లెక్కపెట్టి 
నేనే ''పూల రిహానాబీ''కి అమ్మాలని ఆ వచ్చే డబ్బులను నా సొంతానికి 
దర్జాగా వాడుకోవాలని కోరిక''అంటూ పూలవ్యాపారం 
గురించి చెపుతూ మొదలుపెడతారు కధని.ఇంతకీ వంద పూలు 
అమ్మితే యెంత వస్తుందో తెలుసా ?ఇరవై పైసలు అని ,
పూలు అందక వదిలేస్తే వాళ్ళ అమ్మ ''నయాపైసలు రా 
నాయనా గాలికి పోతాఉండాయి''అని వాళ్ళ అమ్మ పడే బాధలో 
ఆ రోజుల్లో పైసా కి ఉన్న విలువ ,వాటితో కాపురాన్ని 
గుట్టుగా లాక్కోచ్చిన వైనం ఇమిడిఉన్నాయి.
వాళ్ళ అమ్మ పూలచెట్టు ఎందుకు వేసింది,దానిని ఎలా జాగ్రత్తగా 
సాకింది ,యెంత ముఖ్యమైన భాగం గా ఆ చెట్టు మారింది 
ఖదీర్ బాబు కధనం మనకు తెలీకుండానే ఆ అమ్మ కష్టం 
లో బాగం పంచుకునేటట్లు చేస్తుంది.
చివరికి అమ్మ దగ్గర కొనుక్కొనే పూల రిహనాబీ డబ్బులు 
ఇవ్వక అమ్మకి తనకి తగువు పడిన వైనం,
పూల రిహానాబి పేదరికపు సవ్వడి సాటి ఇల్లాలు అయిన 
తన తల్లిని కంట తడి పెట్టించిన వైనం మనలను యెంత 
పేదరికం లో అయినా మనుషులు ఆనాడు మరచిపోని 
మమతలు గుర్తు చేస్తాయి.
యమ్మ,నాయన,ఇస్టీలు ,దఫాకు,కాలు సాపుకొని 
ఇలాగా నెల్లూరు యాస తెలిసిన వారి మనసు గంతులు
వేసేలా ఉన్నాయి.చిన్న చిన్న పదాలతో ముందుకు 
సాగే కధనం ఎవరికైనా కధ వ్రాయటం యెంత సులువు 
అనిపించేలా చేస్తుంది.ఉయ్యాలాలా మనసు ఊపిన 
కధ చివరికి అమ్మలా కష్టాలు ఎవరు తీర్చగలరు?
అనే ముగింపుతో భారంగా ముగుస్తుంది.

No comments:

Post a Comment