స్వాగతం

ఖదీర్ బాబు గారి అభిమానులకు స్వాగతం

Monday 27 May 2019

ఒక మంచి వాక్యం

ఒక మంచి వాక్యం 

అమావాస్య చీకట్లు చుట్టూ నిండినపుడో 
ఆశలు ఆత్మీయతలు నిండుకున్నప్పుడో 
ఒక్క వాక్యం కావాలి 
ఒక్క మంచి వాక్యం!
నీకేమి కాదు అని భరోసా ఇస్తూనో 
అల్లా ఉన్నాడు అని దారి చూపిస్తూనో 
అమ్మ లాగ రెండు దెబ్బలు వేసినా పర్లేదు 
అమ్మమ్మ లాగా దగ్గర తీసినా ఫర్లేదు 
ఒక్క మంచి వాక్యం అల్లాను ఈ హృదయం లోకి నడిపిస్తూ 
రంజాను తరువాతి నెలవంక తీసుకువస్తే బాగుండును !
ఒకే ఒక్క వాక్యం 
''అల్లా అచ్చా కరేగా "
రంజాన్ శుభాకాంక్షలు. 

కొంత మంది కుర్రవాళ్లు వచనానికి సారథులు
- మహమ్మద్ ఖదీర్‌బాబు

కొంత మంది కుర్రవాళ్లు వచనానికి సారథులు
- మహమ్మద్ ఖదీర్‌బాబు

ఆంధ్రజ్యోతిలో ‘నిజం’ శ్రీరామమూర్తిగారు ఎడిటోరియల్స్ రాస్తారని తెలియని కాలేజీ రోజుల్లోనే ఆయన రాసే వచనంలోని సరళత గమనించి చదువుతుండేవాణ్ణి.
ఆంధ్రప్రభ ఎడిటోరియల్స్ వచనానికి, వాగాడంబరానికి మించి.
ఈనాడు ఎడిటోరియల్స్‌లో కృతక చొరబాటుతో నిండిన జాతీయాలు, సామెతల తగిలింపు ఇబ్బంది. ‘బదబదాలు’ అనే మాట ఏ.బి.కె ప్రసాద్‌గారు మాత్రమే వాడేవారు. ‘తస్మాత్ జాగ్రత్త’ అని ఎవరు వ్యాసాన్ని ముగించినా మళ్లీ వాళ్ల అక్షరాల వైపు తొంగి చూసేది కూడా లేదు.
నా అదృష్టం తిరుపతి పాత అంధ్రజ్యోతిలో ఆ కాలంలో పని చేయడం. అనంతపురం కరువు గ్రామాల్లో నామిని టూర్ చేసి ఆ టూర్ రిపోర్ట్ సండే కవర్ స్టోరీగా రాస్తే కడుపులో కన్నీరు ఉబికేది. ఆర్.ఎం. ఉమామహేశ్వరరావు వచనం డిసెంబరు మాసపు గుమ్మడి పూతలా కళకళలాడుతూ ఉండేది. సౌదా పూణె ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉండొచ్చి ఆ పాఠాలు కథనం చేస్తే వచనపు తొలిపాదం, మలిపాదం తెలిసి వచ్చేది. జి.ఆర్.మహర్షి బొడ్లో నుంచి తీసే బాకులా వాక్యాన్ని మెరిపించేవాడు.
హైదరాబాద్ వచ్చాక అతని కంటే ఘనుడు ఆర్టిస్ట్ మోహనే అని తెలిసి వచ్చింది. వేగం, మోహం, చనువు, చొరవ ఉన్న ఆతని ‘కార్టూన్ కబుర్లూ’ ఆ తర్వాతి ఎన్నో వ్యాసాల అక్షరాల గుబుర్లూ జాగ్రత్తగా కనిపెట్టి, పట్టి, నేనొక వచనం బొటనవేలు, చూపుడువేలు మధ్యన పట్టుకున్నాను.
శుభ్రమైన వాక్యం వేమన వసంతలక్ష్మి వద్ద ఉంది. పదునైన వాక్యం కాత్యాయని చెంత కలదు. పతంజలి వాక్యం డబుల్ బ్యారల్ గన్. తల్లావఝలశివాజీ కే పాస్ భీ మా హై.
అల్లం నారాయణ రాస్తే ఉర్దూ చిత్తు కాగితంలో చుట్టి తెచ్చిన మురబ్బాను బుగ్గన పెట్టుకున్నట్టు ఉంటుంది. మృణాళినికి కృతి తెలుసు. కాన వచన ధృతి తెలుసు. అనువంశిక వశానా `సరస్వతి గిరిప్రదక్షిణ’ చేతా శ్రీరమణ సాక్షాత్కరింపజేసుకున్న వాక్య పురుషునికి చిరంజీవత్వం ఉంది తప్ప సంతానయోగం లేదు. క్లోనూ లేదు. ప్రకృతి స్పర్శ లేనిదే కుప్పిలి పద్మ వాక్యం ఉండదు.
కె.శ్రీనివాస్, వాడ్రేవు చినవీరభద్రుడు, ఎన్.వేణుగోపాల్... తప్పించేసిన ఆకతాయి పిల్లవాడి చిందర వందర వచన సౌందర్యం కోసం నేను సాగిస్తున్న అన్వేషణ ఇప్పట్లో తీరదు. సతీష్ చందర్‌ది ఆరోహణ అవరోహణల వెన్నెల. తలపోత వచనంలో పసలపూడి వంశీ పసను ఎంచాలి.
వచనం ఒక వొడుపైన మంత్రసాని. తల్లీబిడ్డలకు మల్లే పాఠకుణ్ణి, రచయితను ప్రాణాలతో నిలపాలి.
కనుక శ్రీధర్ నామాడి, మల్లంపల్లి సాంబశివరావు, అనంతు చింతలపల్లి, కందుకూరి రమేశ్‌బాబు... లాంటి ‘క్లాస్ ఆఫ్ 95’ బ్యాచ్ అయిన మేమంతా ఒకే కాలంలో వచనం అనే ఏనుగు కాళ్ల దగ్గర వేళ్ల దగ్గరా తచ్చాడి, కావాలని లద్దె తొక్కి, దంతం వంటి దృఢమైన వాక్యం కోసం ఆశ పడినవారం.
ఈ ప్రయాసకు మేమే చివరి ప్రతినిధులం అనుకుంటూ ఉండగా పత్రికలలో ఏమో కాని కథల్లో ఆరని సిరా కలిగిన యువకులనేకులు వచ్చారు. సామాన్య, మెహర్, అనిల్ ఎస్.రాయల్, పూడూరి రాజిరెడ్డి, భగవంతం, రిషి శ్రీనివాస్, పూర్ణిమా తమ్మిరెడ్డి, వెంకట్ సిధారెడ్డి... జబ్బల్లో కండ కలిగిన ఇలాంటి కళాసీలను చూసి తెలుగు కథాఓడ చులాగ్గా మరిన్ని నీలిమల్ని ముక్కుతో చీల్చగలిగింది.
కాని-
అంతకు సమానమైన సరంగులు ఇప్పుడు ఫేస్‌బుక్‌లో కెరటాలు బాదుతూ కనిపిస్తుండటం తెలుగులో నిజమైన వచన సందర్భం.
అది హింగ్లిష్ కాదు. తెంగ్లిష్ కాదు. వక్కల ముక్కల తెలుగు కాదు. ఎండు పచ్చి మిరప కాదు. ఎంచుకున్న పదాలతో, ఎంపిక చేసుకున్న మాటలతో, ఎదుటి వారికి చెప్పదలుచుకున్నది చెప్పాల్సిన కంఠంతో, సిద్ధాంతమైనా, అభిప్రాయమైనా, విమర్శ అయినా, ప్రతి విమర్శ అయినా, తిట్టైనా, వెక్కిరింతైనా పూర్తి తెలుగులోనే సరియైన తెలుగులోనే రాస్తున్న ఈ తరం ప్రతినిధులు తెలుగును తళతళలాడించడానికి కొత్త దేశీయ వాషింగ్ పౌడర్‌ను పట్టుకు వచ్చారా అనిపిస్తోంది.
వీరంతా ఎప్పుడు ఎలా ఈ వచనం నేర్చుకున్నారు?
రోజూ నిద్ర లేచి ఒక పచ్చి వాక్యాల మోపును తెచ్చి ఫేస్‌బుక్‌లో పడేస్తున్న వీరిని చూసి తబ్బి ఉబ్బిబ్బవుతున్నాను.
అరుణాంక్ లత, నరేష్కుమార్ సూఫీ, స్వాతి వడ్లమూడి, చైతన్య పింగళి, రజిత కొమ్ము, శతపత్ర మంజరి, గుర్రం సీతారాములు, సౌమ్య పి.ఎస్, ఇండస్ మార్టిన్, జిలుకర శ్రీనివాస్, సిద్దార్థ గౌతమ్, మహేశ్ కత్తి... ఇంకా నేను గమనించని అనేకులు నేటి ప్రాక్టీషనర్స్ ఆఫ్ ప్రోజ్. వచనాశ్వాన్ని నురగలు కక్కిస్తున్న రౌతులు.
మరో పదేళ్లకు వీరంతా మెత్తబడవచ్చు. అనుభవం, క్షమాగుణం, సానుభూతి, ఉపేక్ష వీరి వచనంలోని ఆమ్ల క్షారతల ఘాడతలను మింగేయవచ్చు. ఈలోపు కొత్తవారు పోటెత్తవచ్చు.
అందాక-
వేయి అర్థవంతమైన చర్చలు జరగనీ.
లక్ష మెరుపుల వచనం పరిఢవిల్లనీ.

No comments:

Post a Comment