స్వాగతం

ఖదీర్ బాబు గారి అభిమానులకు స్వాగతం

Friday 3 May 2019

ముందే ఢిల్లీ వచ్చిన నెలవంక


మే' లో రంజాన్ రోజు రావలసిన నెలవంక కొంచెం ముందుగా 
స్త్రీల కథల రూపం లో ఏప్రిల్ 19 నే ఢిల్లీ కుతుబ్ మినార్ మీదకు వచ్చేసింది. 
రాష్ట్రాలు దాటి దేశ రాజధాని వరకు తెలుగు కథ ప్రయాణం ఇది!

ఏప్రిల్ ఇంకో విశేషం కూడా ,ఈ నెలకి కథకుడు అర్ధజీవితాన్ని ఇంకో 3 ఏళ్లకు  
పూర్తి చేస్తాడు. 
అర్ధ జీవితం అంటే!
ఎంత దూరం వచ్చినట్లు 
కాలప్రవాహం పక్కన రాయిలా నిలుచున్నా 
మార్పు వస్తూనే ఉంటుంది. 
కాకుంటే అది అల్లా వైపో ,సైతాన్ వైపో!
సరిగ్గా పన్నెండు అమావాస్యలు దాటగానే 
రంజాన్ నెలవంకగా చూపి దేవుడు అవకాశం ఇస్తూనే ఉంటాడు 
ఇంకొంచెం తప్పులు సరి చేసుకోవడానికి 
అమ్మ దీవెనలే కాదు ఆయువు పోసేది 
గండం ఉన్న రోజు 
మన చేత నలిగిన హృదయాలు గాయాన్ని మరచి నీ కోసం చేసిన ప్రార్ధనలు కూడా !
ప్రతి ఏడాది నెలవంక అల్లా దీవెన 
ఎన్ని హృదయాలు గెలుచుకుంటావో అన్ని కృతఙ్ఞతలు చూపించు!
కృతజ్ఞతలే తీర్పు దినాన మన వెంట వచ్చేది 
మరో అమ్మ కడుపులో జన్మించే వరాన్ని ఇచ్చేది!

ఢిల్లీ లో జరిగిన ఆవిష్కరణ గురించి ఖదీర్ బాబు మాటల్లో ..... 

ఢిల్లీ మిత్రుడు
- మహమ్మద్ ఖదీర్‌బాబు
1997లో నా ‘దావత్’ కథ వచ్చింది. 1995లో తొలి కథ ‘పుష్పగుచ్ఛం’ వచ్చినా నన్ను వీపు మీద తట్టి ‘కేర్’మనిపించి ఇదిగో వీడొచ్చాడు చూడండి అని లోకానికి చూపిన కథ అది. అప్పట్లో న్యూఢిల్లీలో ‘కథ’ సంస్థ ప్రతి ఏటా ఒక్కో భాష నుంచి ఒక్కో ఉత్తమ కథను ఎంచి జాతీయస్థాయి ‘కథ’ పురస్కారాలు పతిష్టాత్మకంగా ప్రకటించేది. ఆ పురస్కారం కోసం తెలుగు కథకు ‘నామినేటింగ్ ఎడిటర్’గా ఉన్న దాసరి అమరేంద్ర కంట ‘దావత్’ పడినా ఎందుకో అది నామినేషన్ వరకూ వెళ్లలేదు. 1998లో నా ‘జమీన్’ కథ వచ్చింది. ఈసారి కూడా నామినేటింగ్ ఎడిటర్‌గా ఉన్న అమరేంద్ర దానిని అవార్డు కోసం నామినేట్ చేశారు. మూడు కథలు నామినేట్ చేస్తే గోపిని కరుణాకర్ ‘దుత్తలో చందమామ’కు, నా కథకు (రెండూ బాగున్నాయని చెప్పి) అవార్డు ప్రకటించారు. ఆ అవార్డు తీసుకోవడానికి మొదటిసారి ఢిల్లీ వెళ్లాను. కనుక నా మొదటి ఢిల్లీ పర్యటనకు అమరేంద్ర నేరుగా కారణం.
రచయితగా, భ్రమణ అనుభవాలను లిఖితం చేసే రచయితగా ఆయన చేసిన కృషి వేరేగానీ అమరేంద్ర ప్రధానంగాసాహితీ ప్రోత్సహకులు. చాలా స్నేహశీలి. కానీ విభేదించాల్సిన విషయాలు వస్తే వాటి గురించి నిలబడటానికి వెనుకాడరు అని నేను అనుకుంటూ ఉంటాను. ఢిల్లీలో సాహితీ వాతావరణం చేతనలో ఉండటానికి ప్రధాన కారకుల్లో ఆయన ఒకడు. చాలా వరకు ఇల్లే సమావేశ స్థలి. ఆయన శ్రీమతి లక్ష్మి నవ్వు చెదరకుండా ఆ సమావేశాలను హోస్ట్ చేయడం నేను చూశాను.
బృందాలు కూడగట్టడం, బృందంలో ఒకడుగా ఉండటం, బృందాన్ని వెతుక్కుంటూ వెళ్లడం కృతక ప్రదర్శన కోసం కాక అమరేంద్రకు సహజంగా అబ్బిన జీవనశైలి. కనుక కె.సురేశ్, నేను నిర్వహించే ‘రైటర్స్ మీట్’ వర్క్‌షాప్‌లకు పర్మినెంట్ సభ్యుడు. ఉన్నతోద్యోగిగా పూణెలో ఉండగా మమ్మల్ని ఉత్సాహపరచి అక్కడో వర్క్‌షాప్ నిర్వహించేలా చేశారు. బస? షరా మామూలే. ఆయన ఇల్లు. మా అందరినీ పశ్చిమ కనుమల్లోకి తీసుకెళ్లడము, ఆ మెలికల కులుకుల దారుల రోజ్ టింట్ పర్వతాలు, పై అంచున కృష్ణానది జన్మస్థలి, పంచ్‌గని దారుల దిమ్మెల పై ఎర్రై స్ట్రాబెర్రీ పళ్లు, లోనావాలా చిక్కీ... అమరేంద్ర వల్లే నిక్షిప్తమైన జ్ఞాపకం. పూణె ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ చెట్టు నీడన శాంతారామ్‌ను స్మరించుకోవడం కూడా.
ఇదే కాదు దీనికి ముందు, దీనికి తర్వాత, నిన్న మొన్నటి ‘ఉత్తరాంధ్ర సాహితీ పదయాత్ర’ వరకు అమరేంద్ర చాలా కార్యక్రమాలకు కేటలిస్ట్. సంకల్పం సడలనివ్వని కార్యకర్త.
ఢిల్లీలో ఎండలు ఇటు వస్తువా అన్నట్టు మమ్ము చూసి హూంకరించాయి. కాని అమరేంద్ర తన సమక్షంతో అవి చల్లనైనవే అనిపించారు. రాష్ట్రపతి భవన్ పచ్చిక మైదానం, లోడీ గార్డెన్ పువ్వులు మా సంతోషకరమైన నవ్వులు విన్నాయి.
అమరేంద్ర పూనికతో ఢిల్లీ యూనివర్సిటీ అధ్యాపకుడు వెంకట్రామయ్య, హిందీ అనువాదకులు జె.లక్ష్మిరెడ్డి గారు,ఇతర ‘సాహితీ వేదిక’ సభ్యులు ‘స్త్రీ కథలు 50’ కోసం ప్రత్యేకంగా కార్యక్రమం రూపొందించి ఆదరంతో పాల్గొనడం ఆ పుస్తకంలోని రచయితల పట్ల వారు చూపిన గౌరవంగా భావిస్తాను.
రాలే పూలకొమ్మను చూసి ఆగి, పారే పాయ సవ్వడి విని ఆగి, ఎండిన ఆకుల బాటతో సంభాషణ నెరిపి స్నేహం చేయడానికి ఇష్టపడే అమరేంద్ర మీరు గనక ఒక పుస్తకం చదివినవారై, ఒక కథను రాసిన వారైతే ఢిల్లీలో తారస పడక మానరు. ఆతిథ్యాన్ని ప్రస్తావించక ఊరుకోరు.
కలుస్తానంటారా?
టికెట్ల ధరలు ఎండల కంటే ఎక్కువగా మండిపోవడం లేదూ?
పి.ఎస్: 2001లో ‘న్యూ బాంబే టైలర్స్’కు రెండోసారి ‘కథా అవార్డు’ తీసుకోవడానికి ఢిల్లీ వెళ్లినప్పుడు అవార్డు తీసుకోవడానికి వచ్చి పరిచయమైన ఒక తమిళ రచయిత్రి గురించి, ఆమెను పాత్రధారిగా చేసి (ఆ వేడుకకు హాజరైన) ప్రసిద్ధ కొంకణి రచయిత దామోదర్ మౌజో రాసిన కథ గురించి మళ్లెప్పుడైనా చెప్తాను. అది కూడా మీరు వినదగ్గది.

No comments:

Post a Comment