స్వాగతం

ఖదీర్ బాబు గారి అభిమానులకు స్వాగతం

Saturday 28 April 2018

ఇంకో ఏడాది దేవుడి పేరు మీద

ఇంకో ఏడాది దేవుడి పేరు మీద 
అవును 
వయసు ఏడాదుల్లో కాదు దీవెనలతోనే కొలవాలి 
విజయాలతోనే కొలవాలి 
గెలుచుకున్న హృదయాలతోనే కొలవాలి  
అప్పుడు ఎంత వయసు అనేది ప్రశ్న కాదు 
మనం ఎందరికి దగ్గరో తెలిసిపోతుంది 
ఖదీర్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. 

మెట్రో కథలు రిలీజ్ అయినా సందర్బంగా ఖదీర్ గారి మాటల్లో ..... 


వో షామ్ కుచ్ అజీబ్ థీ:
వెలిగిపోయింది ఆ సాయంత్రం... మిత్రులతో, ఆప్తులతో, 

మునివేళ్లలో మెరుపులు నింపుకున్నవాళ్లతో, 
కాగితాలపై సృజనను కుమ్మరించేవారితో, దర్శకులతో, నిర్దేశకులతో... 
నగరపు సృజన సంపన్నులంతా అక్కడే పోగయ్యారా అనిపించింది.
 కృతజ్ఞతలు. ధన్యవాదాలు. మఖమల్ వస్త్రంలో చుట్టి దాచుకునే 
జ్ఞాపకాలిచ్చినందుకు సలాములు.

పది పుస్తకాల పుట్టిన రోజు

ఇవాళ నా పుట్టిన రోజు.

1995 ఏప్రిల్‌లో ఈ పుట్టిన రోజు సమయంలోనే ఆంధ్రజ్యోతిలో చేరడానికి హైదరాబాద్‌కు వచ్చాను. ఆ సమయంలో బక్రీదు పండుగ ఉంది. పండగ నమాజు చేసుకొని ఆఫీసులో రిపోర్ట్ చేయరా అని మా నాన్న అన్నాడు. ఏమో కుదరదు అన్నాను. ఆయన వినలేదు. చేసి వెళ్లరా నా మాట విని అన్నాడు. హైదరాబాద్ ఏమీ తెలియదు. కాని పండగ రోజు పంజగుట్ట మసీదుకు వెళ్లి నమాజు చదివి ఆఫీస్‌లో జాయిన్ అయ్యాను. ఆ రోజున నమాజులో ఏం దువా చేశానో గుర్తు లేదు. కాని ఆ దువా ఖుబూల్ అయ్యింది. ఈ నగరం చల్లగా నన్ను అక్కున చేర్చుకుంది. అంతేనా? కాదు.. నా జీవితంలో అత్యంత విలువైన పది పుస్తకాలను బహూకరించింది. 1999-2018 సంవత్సరాల మధ్య నావి పది పుస్తకాలు వచ్చాయి. ఈ సుదీర్ఘ ప్రయాణానికి కారకులైనవారికి నేను కృతజ్ఞతలు చెప్పుకోవాల్సి ఉంది. (అందరికీ ‘గారు’ పెట్టి దూరంగా పెట్టలేను).

- ఈ హైదరాబాద్‌లో నేను సాహిత్యంలో ప్రవేశించడానికి కావలసిన భూమికను ఏర్పరచిన తిరుపతి సీనియర్లు, ఆప్తులు నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు, జి.ఆర్.మహర్షి, సౌదా, నాకు రష్యన్ పుస్తకాలు పరిచయం చేసిన సుధీర్, ఇందిర... వీరికి.

- హైదరాబాద్ వచ్చిన వెంటనే సిటీ డెస్క్ ఇన్‌చార్జ్‌గా రెక్క కిందకు తీసుకున్న అల్లం నారాయణకు, ఆదివారం ఆంధ్రజ్యోతిలోకి చిటికెలోన మార్చిన త్రిపురనేని శ్రీనివాస్‌కు, తోడు సీట్లలో కూర్చున్న వల్లూరి రాఘవరావు, పసుపులేటి గీత, అక్బర్, లేపాక్షీలకు

- నా తొలి కథ ‘పుష్పగుచ్చం’ చదివి పని గట్టుకొని ఫోన్లు చేసిన కిరణ్ కుమారి, కవిత, రవీంద్రభారతి మెట్ల మీద కరచాలనం ఇచ్చిన కుప్పిలి పద్మ.. వీరికి.

- నా ‘దావత్’, ‘జమీన్’ కథలు వేసిన ఆర్.ఎం. ఉమామహేశ్వరరావుకు, వాటికి బొమ్మలేసి తిరిగి నాకే టీ తాపించిన లక్ష్మణ్ ఏలేకు. నా ‘మన్ చాహే గీత్’ కాలమ్‌ను రాయనిచ్చిన ఆర్.ఎం. ఉమామహేశ్వరరావుకు.

- దర్గామిట్ట కతలకు గేట్లెత్తిన నామినికి, అవి వెలువడ్డాక మెచ్చుకుని ‘304, కిరణ్ అపార్ట్‌మెంట్, లక్డీకా పూల్’ మెట్లెక్కనిచ్చిన వేమన వసంత లక్ష్మికి, బాలగోపాల్‌కు, వాటిని ప్రచురించడానికి ఓల్గాకు రికమండ్ చేసిన వసంత లక్ష్మికి, ఆ డబ్బులు ఇవ్వడానికి నన్ను మారుతిలో కూర్చుబెట్టి కారు తోలిన అక్కినేని కుటుంబరావుకు. మూడో కంటికి తెలియకుండా మరింత డబ్బు జేబులో కుక్కిన రచయిత సలీమ్‌కు.

- దర్గామిట్ట కతలు చదివి ఒక స్వీట్ పాకెట్ పట్టుకుని నన్ను చూడటానికి ఆంధ్రజ్యోతికి వచ్చేసిన ముళ్లపూడి వెంకట రమణకీ, ఆ దరిమిలా తల నిమిరిన బాపూకు.

- ఆ దర్గామిట్ట కతలు చదివి నాకు తండ్రంతటి వాడైన మోహన్‌కు, అప్పటి నుంచి నా బొమ్మలు వేసిన మోహన్‌కు, నా బొమ్మలే వేసిన మోహన్‌కు, చప్పట్లు చరుస్తూ మెచ్చుకుంటూ ఉండిన ప్రకాష్‌కూ.

- వీడెవడో పనికొచ్చేవాడులా ఉన్నాడే అని కనిపెట్టిన కాత్యాయనికి, శ్యామ్‌కు. ‘చూపు’లో వీరు వేసిన ‘న్యూ బాంబే టైలర్స్’ కథ చదివి బ్రేక్‌ఫాస్ట్‌కు పిలిచి పొగలు గక్కే పూరీలు వడ్డించిన కె.శ్రీనివాస్‌కు.

- ‘వందేళ్ల కథ‘ను ఎడిట్ చేస్తూ చివరి పెట్టెలోకి చేయి పట్టుకుని లాగి సర్‌ప్రైజ్ చేసిన వాడ్రేవు చినవీరభద్రుడుకు.

- నా కథలను గమనించి ఒక దాని వెంట ఒకటి వేసి నన్ను కథకు మరింత నిబద్ధుణ్ణి చేసిన కథా సిరీస్ సంపాదకులు వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్... వీరికి.

- నాతో పాటు, నా కంటే ముందు, నా కుడి ఎడమగా రాస్తూ పట్టుదల పెంచిన గోపిని కరుణాకర్, డా.వి.చంద్రశేఖరరావు, కాట్రగడ్డ దయానంద్, గొరుసు, పెద్దింటి... వీరికి. కె.సురేశ్, అక్కిరాజు భట్టిప్రోలు... వీరికిన్నూ.

- ఈ కాలంలో స్నేహితులైన సత్యశ్రీనివాస్, అనంత్, సాంబు, రామ్మోహన్, కోడూరి విజయకుమార్... వీరికి. మరో ప్రాణమిత్రుడు బి.చంద్రశేఖర్‌కు.

- ‘పోలేరమ్మ బండ’ కతలు రాయనిచ్చిన వేమన వసంతలక్ష్మికి.

- ‘పోలేరమ్మ బండ’ కతలను ఆర్.కె.నారాయణ్ కతలతో పోల్చి పరిశోధన చేయించిన మృణాళినికి.

- నిడివిలో పట్టే కథలను దాటి ‘రాగలిగిన సైజులో’ కథ రాయాలని నిశ్చయించుకున్నాక ఒక్కో కథను విడిగా పుస్తకంగా వేసే సంప్రదాయానికి సహకరిస్తూ నా మొదటి కథ ‘ఖాదర్ లేడు’ వేసిన పర్‌స్పెక్టివ్స్ ఆర్.కెకి. ఆ కథ చదివి చాలా మంచి విమర్శ రాసిన ఎన్.వేణుగోపాల్‌కు.

- ఆంధ్రజ్యోతి మూతపడి రోడ్డు మీద ఉన్నప్పుడు ‘ఫుప్పుజాన్ కతలు’ ప్రాజెక్ట్ ఇచ్చి తొమ్మిది నెలల పాటు కథలు రాసుకోవడానికి ఫెలోషిప్ ఇచ్చిన అస్మితకు, వసంత కన్నబీరన్‌కు, ఓల్గాకు. ఆ పుస్తకం ఆవిష్కరణకు వచ్చిన పతంజలికి. దేవులపల్లి అమర్‌కు. వకుళాభరణం రామకృష్ణకు.

- ఆ కాలంలో నీడనిచ్చిన ప్రజాతంత్రకు. దేవులపల్లి అమర్‌కు. విశేషమైన పేరు తెచ్చిన రెండు సాహిత్య సంచికల సహ సంపాదకుడు కె.శ్రీనివాస్‌కూ.

- ఆ కాలంలోనే కుటుంబ సభ్యుడి వలే ఆదరించిన ఇంద్రగంటి కుటుంబం ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, జానకీబాల, కిరణ్మయి, మోహనకృష్ణ... వీరికి.

- ‘ఢాకన్’ను విడిపుస్తకంగా ప్రచురించిన తెలకపల్లి రవికి, ‘గెట్ పబ్లిష్డ్’ విడిపుస్తకంగా ప్రచురించిన హెచ్‌బిటి గీతా రామస్వామికి, ‘కింద నేల ఉంది’ విడి పుస్తకంగా ప్రచురించిన కాత్యాయనికి.

- న్యూ బాంబే టైలర్స్‌ను పుస్తకంగా వెలువరించడానికి ముందుకొచ్చిన గూగుల్ నరసింహారెడ్డికి, శాంతా బయోటిక్స్ వరప్రసాద్ రెడ్డికి.

- ‘మన్ చాహే గీత్’ను వేసిన ఆలగడప పాండు రంగారావుకు. ఆవిష్కరించిన కీరవాణికి.

- లక్షలాది పాఠకులకు చేరే రెండు గొప్ప అవకాశాలు- ‘బాలీవుడ్ క్లాసిక్స్’, ‘నూరేళ్ల తెలుగు కథ’... వీటికి వీలు కల్పించిన ‘సాక్షి’ సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రియదర్శిని రామ్... వీరికి.

- ‘బాలీవుడ్ క్లాసిక్స్’కు ముందుమాట రాసిన జంపాల చౌదరికి. నా రచనల ఫస్ట్ కాపీ చదివే వ్యక్తిగా ఉన్న ఆయన స్నేహానికి.

- ‘నూరేళ్ల తెలుగు కథ’ పుస్తకంగా వెలువరించిన డా.గురువారెడ్డి. ఆయనకి.

- కొంత ఫ్రెష్ రీడింగ్‌కు వీలు కల్పించిన ముక్తవరం పార్థసారథికి.

- ‘బియాండ్ కాఫీ’ తొలి ముద్రణ మూడు నెలల్లో చెల్లిపోగా మలిముద్రణ తెచ్చిన కృష్ణమోహన్‌బాబుకీ.

- ‘కథలు ఇలా కూడా రాస్తారు’ పుస్తకానికి ఆలోచన ఇచ్చిన తెలకపల్లి రవి, లక్ష్మయ్య.. వీరికి. ‘కథ’ ఎఫ్.బి గ్రూపు నడిపిన ఈ కాలపు కథకులు వేంపల్లి షరీఫ్, మహి బెజవాడలకు. పుస్తకంగా వచ్చేందుకు సహకరించిన రవి వీరెల్లికి.

- ‘మెట్రో కథల’కు అవకాశం ఇచ్చిన సాక్షికి.

- అంతవరకూ నడవగల శక్తి ఉందని చెప్పిన పాఠకులకు. ఇప్పుడు నాతో కలిసి నడుస్తున్న శక్తిమంతమైన సన్మిత్రులకు.

- అలాగే నా మీద పదే పదే దాడి చేసిన నరేశ్ నున్నా, గోపిని కరుణాకర్, జి.ఎస్.రామ్మోహన్, కిశోర్ మందలపర్తి, ఫేస్‌బుక్‌లో కామెంట్స్ పెట్టిన మైథిలీ అబ్బరాజు, కొత్తావకాయ ఘాటుగా, రమణమూర్తి, మెహర్, వేంపల్లి గంగాధర్... నా పై సంతకాలు పెట్టిన వరవరరావు, కృష్ణాబాయి, ఖాదర్ మొహియుద్దీన్, జయప్రభ, కవి యాకూబ్, తుమ్మేటి రఘోత్తమరెడ్డి, కె.ఎన్. మల్లీశ్వరి ... తదితర 41 మందికి. వారికీ.

ఇంకా చాలా ఉంది. చాలామంది పేర్లు తలవాల్సి ఉంది. ఈ ఉద్విగ్న క్షణంలో కొన్ని పేర్లు తప్పక జారిపోతాయి. ఘటనలు తెలుసుకున్నప్పుడే ఈ పేర్లకు మరింత విలువ. అదంతా రాయకుండా ఉంటానా? ఈ కృతజ్ఞతలు పుస్తకానికి అట్ట మాత్రమే సుమా. నమస్కారాలు.




No comments:

Post a Comment