స్వాగతం

ఖదీర్ బాబు గారి అభిమానులకు స్వాగతం

Monday 14 September 2015

ఖదీర్ గారు అందుకున్న విశ్వనాధ్ అవార్డ్

సెప్టంబర్  లో రెండు  విశేషాలు 
ఛాయ వారి ''కధకునితో సాయంత్రం '' 
ఖదీర్ గారు అందుకున్న విశ్వనాధ్ అవార్డ్ 
మరి ఏది కధకునికి ఎక్కువ సంతోషం 
చదవరుల తో పంచుకున్న జ్ఞాపకాలా 
కష్టానికి లభించిన అవార్డు లా 
ఏమో రచయిత చెప్పాల్సిందే !


సారంగ వెబ్ మాగజైన్ లో విశేషాలు 
      ముస్లిం జీవితంపై 
  నవల రాయాలని వుంది: ఖదీర్
khadeer1


కృష్ణ మోహన్ బాబు 

సెప్టెంబర్  6 , ఆదివారం సాయంత్రం జరిగిన’ ఛాయా’ సంస్థ 
నాలుగో సమావేశం విశేషాలు ఇవీ. 
“పరిచయం అక్కరలేని కథకుడు, ప్రతీ వారం మెట్రో కథలతో 
మనకి కనిపిస్తున్న కథకుడు, ప్రత్యక్షంగా తన కథని మనకి 
వినిపించడానికి వచ్చిన కథకుడు, మహమ్మద్ ఖదీర్ బాబుని 
తన కథ వినిపించాడానికి వేదిక మీదికి పిలుస్తున్నాం”
అన్న అనిల్ బత్తుల పిలిపుతో ఖదీర్ మైక్ అందుకున్నాడు.
“ గత 20 యేళ్లలో నేను యెప్పుడూ వేదికల మీద మాట్లాడలేదు. 
ఈ సంస్థ సభ్యులు మిత్రులు, సన్నిహితులు కావడంతో, 
పరోక్షంగా నేనూ ఈ సంస్థలో భాగమేగా అనుకోవడం చేత
 ‘పెన్సిల్ బాక్స్’ అనే నా కొత్త కథని వినిపిద్దామనుకొన్నా.  
వూహించని కారణాల వల్ల ఆ కథ మెరుగులు దిద్దడం పూర్తి కాలేదు.  
అందుకనే కథకుడుగా నా ప్రయాణాన్ని మీకు చెప్పదలుచుకున్నాను.
  ‘పెన్సిల్ బాక్స్’ కథ యెప్పుడు పూర్తి అయితే అప్పుడు 
“ఛాయా” కే ఇస్తాను.  
వాళ్ళు దాన్ని యెలాగైనా వాడుకోవచ్చు”
 అంటూ ఖదీర్ తన కథ చెప్పడం మొదలు  పెట్టాడు.
“నా చిన్నప్పుడు యెప్పుడూ నేను యేదో కోల్పోయినట్లుండే వాడిని.  
మా నాన్న ఎలెక్ట్రీషియన్. 7 వ తరగతి దాకా చదువుకున్నాడు.  
యెంతో ఒద్దికైన పనిమంతుడు.  నాన్నకి కోపం చాలా యెక్కువ.  
అందుకే అమ్మ యెప్పుడూ యేదో తెలియని కంగారులో  వుండేది.  
నాకు ఇంట్లో వుండాలనిపించేది కాదు.  
మా చుట్టుపక్కల వున్న వైశ్యుల  ఇళ్ళకి వెళ్ళి, 
“చందమామ” లో  కథలు చదువుతూ వుండేవాడిని. 
 నాకూ అలా కథలు రాయాలనిపించేది.  
10 వ తరగతిలో  వుండగా ఆంజనేయ నాయుడుగారు 
అనే మాస్టారు వీరపల్లె వీణా వాణి పేరుతో రచనలు చేస్తూవుండేవారు.  
రాయాలంటే కలం పేరు వుండాలని చెప్పి, 
నాకు ‘అగ్ని మిత్ర’ అనే మారు పేరు తగిలించారు. 
 ఆ పేరు మీద రాసిన ఒక కథ పత్రికలో  అచ్చు అయి 
150 రూపాయల పారితోషికం కూడా కలం పేరు మీదే వచ్చింది.
ఆ తర్వాత యెన్ని కథలు పంపినా తిరుగుటపాలో వచ్చేవి .  
కథలు పంపడానికి స్టాంపులకి కూడా డబ్బు లేకపోతే, 
వాళ్ళనీ వీళ్ళనీ మెప్పించి తీసుకొనేవాడిని.  
పత్రికలలో పనిచేస్తేనే కథలు పడతాయని గట్టిగా నమ్మి, 
డిగ్రీ అయిన వెంటనే ‘ఈనాడు’ లో  జేరా.  
అలాయినా ‘ఈనాడు’ ఆదివారం అనుబంధంలో 
ఒక్క కథైనా అచ్చుకాలే.  అది వదిలేసి 
‘ఆంధ్ర జ్యోతి’ తిరుపతి యెడిషన్ లో  జేరా. 
 నామిని సుబ్రహ్మణ్యం నాయుడు, జి. ఆర్. మహర్షి, 
మేర్లపాక మురళి, యిలా సీనియర్ రచయితలు 
అందరూ అక్కడ వుండేవారు.  

‘పుష్ప గుచ్ఛం’ పేరుతో ఒక కథ అచ్చైనది కాని, 
అంతకు మించి బండి ముందుకు వెళ్లలేదు.  
ఏదో సాహిత్య వ్యాసంలో నా పేరు కూడా వుందని 
సీనియర్లు ఏడిపించారు కూడా.  కానీ ఏదో రోజు నా రచనల 
మీద చర్చ వుంటుందని ఆ రోజు గట్టిగా అనుకున్నాను.
  నేను హైదరాబాద్ కు బదిలీ అయి వచ్చా.  
అప్పుడే నాన్న పోయాడు.  నాన్న కష్టపడి కూడా బెట్టిన
 25,000/- అమ్మ పక్షవాతం కోసం ఖర్చై పోయింది.  
అయిన అమ్మకి పూర్తిగా నయం కాలేదు. 
 పిల్లలు ఇంకా చేతికంది రాలేదు, 
రాబోయే  రోజులెలాగో అనే బెంగ తో, దిగులు తో పోయాడు.
khadeer bookనాన్న చావు నా మీద చాలా ప్రభావం 
చూపించింది.  నేను చెప్పవలసిందేమిటో, 
రాయవలసినదేమిటో  స్పష్టంగా తెల్సింది.  

నే పెరుగుతూ చూసిన పేద ముస్లిం కుటుంబాల గురించే చెప్పాలని 
తీర్మానించుకున్నాను. 
 అప్పుడు రాసిన కథలే ‘దావతు, జమీను.’  
ఆ సమయంలోనే  నామిని ‘ఆంధ్ర జ్యోతి’ హైదరాబాద్ కు వచ్చాడు. 
  ‘దర్గా మిట్ట ‘ కథలు రాస్తావా అని అడిగాడు.
  రాస్తాను అని చెప్పా.  ఏమి రాస్తావు అని ఆయన అడగలేదు, 
ఎలా రాస్తానూ అని నే చెప్పలేదు. 
 నా మీద నమ్మకంతో ప్రకటన యిచ్చేశాడు. 
 వారం వారం రాయాలి.  రాశాను. 
ఆ తర్వాత తిరిగి చూసుకున్నది లేదు. 
 హైదరాబాద్ లో ‘ అనంతు’ లాంటి మిత్రుల 
నుంచి చాలా నేర్చుకున్నాను.
కథా వస్తువు విషయం లో  కూడా నా లో చాలా మార్పులు
 వచ్చాయి.  నేను దగ్గర నుంచి చూస్తున్న 
ఎగువ మధ్య తరగతి, సంపన్న వర్గాలు, 
సిటీ బతుకులు నా ‘బియాండ్ కాఫి, మెట్రో కథలకి’ ఆలంబన 
అయ్యాయి.  ఇన్నేళ్లు పత్రికలలో పనిచేసిన అనుభవం 
నా రచనలకి బ్రీవిటీ నిచ్చింది.  
అందుకనే ‘మెట్రో కథలలో’ పాత్రలకి పేర్లు వుండవు.  
అతడు, ఆమె అని కూడా వుండవు.  
అయినా పాఠకులు కనెక్ట్ అవుతున్నారు. 
 ‘సెల్ఫీ, షి’ లాంటి కథలు ఎలాంటి చర్చను రేకెత్తిస్తున్నాయో
 మీకు తెల్సు. కథ రాయడానికి క్రాఫ్ట్ చాలా అవసరం.  
వుదాహరణకి’ ఆవిడ పిల్లలకి బ్రెడ్ మీద జామ్ రాసింది’ 
అనటం కన్నా’ న్యూటెల్లా రాసింది’ అంటే పాఠకుడు వెంటనే 
కనెక్ట్ అవుతాడు.  అదే క్రాఫ్ట్.   

అయితే ‘దర్గా మిట్ట’ కథలు మళ్ళీ ఇప్పుడు 
రాయమంటే రాయలేను. నాన్నకి హిందీ పాటలన్నా,
 సినిమాలన్నా చాలా ఇష్టం.  వాటి గురించి మాకు
 ఎప్పుడూ చెప్తూవుండేవాడు.  ఆ బాగ్రౌండ్ నుంచి వచ్చినవే
 ‘మన్ చాహే గీత్, బాలీవుడ్ క్లాస్సిక్స్ .’ 
 నాకు ఒక నవల రాయాలని వుంది ముస్లిం జీవితాలను గురించి. 
 రాస్తాను” అంటూ ముగించాడు.
ఆ తర్వాత ఖదీర్ తనకు బాగా నచ్చిన కథ,
 ‘ వహీద్,’ మరో చిన్న కథ చదివి, కొందరు 
అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పి,  తన కథ ముగించాడు.

No comments:

Post a Comment