స్వాగతం

ఖదీర్ బాబు గారి అభిమానులకు స్వాగతం

Monday, 1 April 2019

స్త్రీ ల కథలు

స్త్రీ ల కథలు 
యాభై !!!!!!!!
పునఃకథనం అయితే కావొచ్చు 
అసలు కథల లోతుకు  తీసుకొని వెళుతూనే ఉంటాయి 
ఇవి కథలు కాదు 
యాభై కోణాల్లో స్త్రీ జీవితపు వ్యథలు 
బహుశా పుట్టక ముందు  చదివితే స్త్రీగా పుట్టడానికి ఇష్టపడక పోవచ్చు!
పుట్టాక చదివినా చేసేది  ఏమీ లేదు 
అసలు స్త్రీ సమస్యలకు ఫుల్ స్టాప్ లేదు 
 విరామ చిహ్నం  తప్ప !
కాకుంటే తరాలు మారే కొద్దీ సమస్యలు మారుతుంటాయి 
దేహంగా మిగిలిన స్త్రీ ది  అసలు మనిషి జన్మ కాదు!
అవసరాలు తీర్చే పరికరం తప్ప!
పోయిన తరాలను మార్చుకోగలం అనే ఆశ లేదు 
ముందు తరాల మూలాలు అయినా స్త్రీ గౌరవానికి బాటలు వేసేట్లు నిర్మిద్దాము!
ఎంతైనా వాళ్ళు స్త్రీ సృష్టే కదా !

ఖదీర్  మాటల్లో స్త్రీ పుస్తకం గురించి చదవండి ...... 



ఆ 50 కథలు
- మహమ్మద్ ఖదీర్‌బాబు
గతి లేదు. వేరే దారి లేదు. పెళ్లయినవాడికే రెండో భార్యగా వెళ్లక మరో గత్యంతరం లేదు. ఆమె వెళుతుంది. ఆమె అలాంటి పరిస్థితుల్లోనే వచ్చినట్టు అతడికి తెలుస్తుంది. అప్పుడు ఆమె కాళ్లకు చుట్టుకునే చీకటి ఎలా ఉంటుంది? విమల రాసిన ‘నీలా వాళ్లమ్మ మరికొందరు’ కథను చదవాలి.
పెళ్లయ్యే అవకాశం ఇప్పుడిప్పుడే కనపడ్డం లేదు. సరైన ముండాకొడుకు ఒక్కడూ దొరకడం లేదు. దొరికినవాడు ఎదురు వంకలు పెట్టి పోతున్నాడు. వయసు పెరుగుతోంది. మోకాళ్ల పైనుండే కండలు లావెక్కుతున్నాయి. ఎప్పుడూ మూడెంక వేసుకు పడుకోబుద్ధవుతుంది. ఏమిటో తెలియదు. డాక్టర్ దగ్గరకు వెళ్లితే ప్రిస్క్రిప్షన్ మీద ‘పెళ్లి’ అని రాసి ఆ కాగితాన్ని బర్రున చింపి చేతిలో పెడుతుంది. అప్పుడు ఏం చేయాలి? పూర్ణిమ తమ్మిరెడ్డి రాసిన ‘ఆర్ ఎక్స్ డాక్టర్’ కథ ఇది.
కింద నుంచి నీళ్లు మోయాలి. పై నుంచి మాటలు పడాలి. మొగుడు ఇంటికి ఆధిపత్యపు తాళం, బీరువాకు చిల్లర అందని తాళం వేసి పోతాడు. జ్వరం వస్తుంది. కాని అలా వస్తే మగాడు డాక్టర్ దగ్గరకు వెళ్లే యోగ్యుడు అవుతాడు కానీ ఆడది అవుతుందా? పిల్లలు సతాయిస్తుంటారు. ముసలి అత్తమ్మ దీనంగా చూస్తుంటుంది. చాలదన్నట్టు ఒంటిని జ్వరం కాలుస్తూ ఉంటుంది. ఇదంతా పట్టని మొగుడు రాత్రి రెండు పెగ్గులు బిగించి వచ్చి పక్క మీదకు చేయి లాగుతూ ఉంటే ఎలా ఉంటుంది? ముదిగంటి సుజాతారెడ్డి రాసిన ‘విసుర్రాయి’ కథలో పడి నలగాలి.
అలా శ్రీకాకుళం వైపు వెళ్లండి. అక్కడ సలీసుగా దొరికే అమ్మాయిల కండ కోసం ఎన్ని గద్దలు ఎగురుతున్నాయో.. మన్నెం సింధుమాధురి ‘తూరుపు కండ’ కథలో చూపిస్తుంది.
వందేళ్లట తెలుగు కథ వయసు. ఎంతకూ సమర్తాడని అమ్మాయి మనసులో ఏముంటుంది... అలాంటి అమ్మాయి ఉన్న ఇంట్లో ఏం జరుగుతుంది ఎవరైనా రాశారా? కరుణ కుమార్ ‘పుష్పలత నవ్వింది’ కథలో ముగింపుకు మీ పెదాల మీద కూడా ఒక చిర్నవ్వు పూస్తుంది.
ఎన్ని కథలు. ఎన్నని.
వందేళ్లలో ఎందరో రచయిత్రులు, రచయితలు స్త్రీల తరఫున గట్టిగా మాట్లాడారు. పేచీ పడ్డారు. పెనుగులాడారు. మగాణ్ణి ప్రత్యర్థిగా నిలబెట్టి ‘మగాడూ మారూ’ అని నిలదీతను నుదుటికి బిగించి కట్టుకున్నారు.
కాని అల్లాంటి కథలన్నీ ఒక చోట చేరలేదు. ఎందుకనో అలాంటి కూర్పు సాధ్యం కాలేదు.
రేప్ విక్టిమ్ మనసు లోపలి గాఢత, ఎంతగా తోమినా వదలని చిలుము వాడ్రేవు చినవీరభద్రుడు తన ‘సుజాత’ కథలో మన కొరకే రాశాడు.
తోడు పేరుతో స్త్రీ చుట్టూ అల్లే ట్రాప్‌ను చూడగలిగే చూపు ఓల్గా ‘తోడు’ కథతో మన కథల్లోనే సాధ్యమైంది.
నల్లమల అడవుల్లో చీకటి బిలంలో దెయ్యం వదలగొట్టించుకోవడానికి ఒక గృహిణి వెళితే వదలగొట్టాల్సింది దెయ్యాన్నా మగాడి అహంకారాన్నా అని సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ఎంతో ఆర్ద్రంగా ‘బిలం’ కథ రాస్తే మన కళ్లే కదా వెచ్చగా ధారులు కట్టేది.
గోషా పాటించాల్సిన ముస్లిం పెళ్లికూతురికి టాయిలెట్ లేకపోవడం ఒక కథ (షాజహానా). ఆడుకోవాల్సిన పిల్లను ఈడ్చుకెళ్లి వేపమండలు చుట్టి బసివిని చేయడం ఒక కథ (సుందర్రాజు).
ఇవన్నీ ఒకచోట చేరిన సందర్భం ఇది.
యాభై మంది రచయిత్రులు, రచయితలు అల్లిన బలమైన కథల మోపు.
భండారు అచ్చమాంబ, చలం, శ్రీపాద, ఇల్లిందల సరస్వతీదేవి... వీరు నడిచిన దారిలో నేడు నడుస్తున్న పాదాల వరకూ సాగిన కథలు ఇవి. యాభై గట్టి కథలు. మేలిమి కథలు. తెలుగు స్త్రీ కథ అంటే చప్పున అందుకోవాల్సిన కథలు.
ఈ కథలు నేను మళ్లీ చెప్పగలిగే అవకాశం రావడం అదృష్టం.
ఈ కథలు నడిచిన దారులో నా కలం పునర్ ప్రయాణం చేయడం అపురూపం.
అందరికీ నమస్కారాలు. కృతజ్ఞతలు.
‘స్త్రీ కథలు 50’ సంకలనంలోని రచయిత్రులు- రచయితలు:
1. అబ్బూరి ఛాయాదేవి 2. భండారు అచ్చమాంబ 3. చలం 4. చాగంటి తులసి 5. సి.సుజాత 6. సి.వనజ 7. చంద్రలత 8. చంద్రశేఖర్ ఆజాద్.పి 9. గీతాంజలి 10. గోగు శ్యామల 11. ఇల్లిందల సరస్వతీదేవి 12. ఇంద్రగంటి జానకీబాల 13. జూడీ బ్రాడీ 14. ఝాన్సీ పాపుదేశి 15. కల్యాణ సుందరీ జగన్నాథ్ 16. కె.రామలక్ష్మి 17. కేతు విశ్వనాథ రెడ్డి 18. కవన శర్మ 19. కుప్పిలి పద్మ 20. కొండేపూడి నిర్మల 21. కె.వి. కరుణ కుమార్ 22. ముదిగంటి సుజాతారెడ్డి 23. మృణాళిని 24. మన్నెం సింధుమాధురి 25. నాగప్పగారి సుందర్రాజు 26. పి.సత్యవతి 27. పాటిబండ్ల రజని 28. పాలగిరి విశ్వప్రసాద్ 29. పూర్ణిమ తమ్మిరెడ్డి 30. రంగనాయకమ్మ 31. రెంటాల కల్పన 32. రాధిక 33. రుబీనా పర్వీన్ 34. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి 35. సావిత్రి 36. ఎస్.జయ 37. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి 38. షాజహానా 39. సామాన్య 40. సాయి బ్రహ్మానందం గొర్తి 41. తల్లావఝల పతంజలి శాస్త్రి 42. తాయమ్మ కరుణ 43. ఓల్గా 44. వి.ప్రతిమ 45. వాడ్రేవు చిన వీరభద్రుడు 46. విమల 47. వినోదిని 48. వేంపల్లి షరీఫ్ 49. ఎల్లి అరుణ 50. ఎండపల్లి భారతి.

Wednesday, 14 November 2018

మళ్ళీ కథల సాయంత్రాలు ఒక తీపి కబురుతో

  జీవితం ఎప్పుడూ రెండు మైలురాళ్లు మధ్యే ఉంటుంది 
సూక్ష్మం గా చూస్తే చావు పుట్టుక 
స్థూలంగా చూస్తే 
చేసిన పని ,చేయాల్సిన బాధ్యత 
చేసిన పని అవార్డులుగా గుర్తింపు పొందితే 
చెయ్యాల్సిన పని దీపాన్ని పట్టుకోమంటుంది 
రెండు పట్టాల మీద బ్యాలెన్స్ గా వెళ్లగలిగినవాళ్లకే 
జీవితపు చప్పట్లు !!

పతంజలి గారి అవార్డు అందుకోబోతున్నందుకు 
ఖదీర్ బాబు గారికి అభినందనలు 
 
కథకుల కరచాలన వేళ మళ్ళీ వచ్చేసింది.
#writers' meet #kudali #yakshi 




Thursday, 23 August 2018

కథ మినార్ ఆవిష్కరణ

కథ మినార్ ఆవిష్కరణ 

కొన్ని జ్ఞాపకాలు అంతే 
ఆగకుండా ముంచెత్తుతూనే ఉంటాయి 
బహుశా వేసిన కొత్త దారి చూసుకొమ్మని కాబోలు !!



ఖదీర్ బాబు గారి మాటల్లోనే ..... 


రచయితలకు నమస్కరించుకుని....
వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ గార్ల ‘కథ’ పుస్తకాల ఆవిష్కరణ రోజంతా జరుగుతుంది. ఉదయం చాలామంది ఆవిష్కరణ సమయంలో ఉంటారు. భోజన విరామం తర్వాత సహజంగానే చాలామంది తగ్గుతారు. ఆ సమయంలో ఆ సంకలనంలోని రచయితలకు ‘కాంప్లిమెంటరీ కాపీ’ ఇస్తుంటారు. అందరూ ఉండగా ఇస్తే వాళ్లకు గౌరవం కదా అంటాను నేను. నా ‘ఖాదర్ లేడు’ కథను మధురాంతకం నరేంద్ర, రాసాని గార్లు ‘కథా వార్షిక’లో అచ్చు వేసి హైదరాబాద్‌లో ఆవిష్కరణ పెట్టారు. వేదిక మీద పిలిచి కాపీ ఇస్తారనుకొని వెళ్లాను. సభ ముగించుకుని వెళ్లిపోయారు. రెండు రోజుల పాటు తిరుపతికి ఫోన్లు చేసి మరీ వారితో పేచీ పడ్డాను. 25 ఏళ్ల కథాసాహితి బృహత్ సంకలనం వేసినప్పుడు తెలుగు యూనివర్సిటీకి వెళితే హాలు బయట ఐడి కార్డు చూపి కాంప్లిమెంటరీ కాపీ తీసుకోమనే అర్థంలో మాట్లాడారు. ఇది రచయితలకు అవమానం అని వేదిక మీద తగాదా పడ్డాను.
సంకలనాలు వచ్చాయి అంటే అందుకు కారణం సంపాదకులు కాదు... ప్రచురణకర్తలు కాదు... రచయితలు. వారు రాస్తేనే సంకలనాలు వస్తాయి. కనుక ఆవిష్కరణ అయిన వెంటనే తొలి కాపీ అందుకోవాల్సింది వారు. మొదటి నమస్కారం స్వీకరించాల్సిందీ వారు. ‘నూరేళ్ల తెలుగు కథ’, ‘కొత్త కథ’, ‘ఉత్తమ తెలుగు వాన కథలు’ సభలలో ఈ గౌరవం పాటించాను. నా సూచన అందుకుని ‘ప్రాతినిధ్య’ ఆవిష్కరణలోనూ ఇదే గౌరవం పాటించారు.
‘కథా మినార్’ ఆవిష్కరణలో ఆవిష్కరణ అయిన వెంటనే రచయితలకు సగౌరవంగా కాపీలు అందించాం. వేదిక మీద ఉన్న పెద్దలనే కాదు సభలో ఉన్న సాహితీకారులనూ ఇందులో భాగం చేశాం.
ఈ పని చేసినందుకు షరీఫ్, నేను ఎంతో సంతోషించాం.
ఫొటోలు చూస్తే మీరూ సంతోషిస్తారు.
పి.ఎస్: ‘కథామినార్’ అక్షరాలు రాసిచ్చిన లక్ష్మణ్ ఏలేకు మలిప్రతి.

Wednesday, 1 August 2018

కథ మినార్

కథ మినార్ 
ఒక్కో పుస్తకం ఒక్కో అడుగుగా 
సాగుతూ ఉంటే 
కొన్ని కథలు కష్ట సుఖాలు చెప్పుకుంటే 
ఒకే కష్టం ఒకే పడవ మీద సాగితే 
అది ఒక చరిత్రే 
దానిని జ్ఞాపకంగా మలిచే మినారే 

ఖదీర్ బాబు,వేంపల్లి షరీఫ్ లు కలిసి ముందుకు 
తెస్తున్న కథల పుస్తకము ఇది. 

ఖదీర్ బాబు గారి మాటల్లోనే చదవండి ..... 



చూపుడువేలి చివర అశ్రువు
ఈ కాలం ఈ కథల కాలం. ఈ కాలం ఈ కథలు ఒక దగ్గర కూడవలసిన కాలం. ఈ కాలం ఈ కథలను పరికించాల్సిన కాలం. ఈ కాలం ఈ కథలతో తోడు నడవాల్సిన కాలం. కాలం ఎప్పడూ తనకు తానుగా పురిగొల్పి కొన్ని పనులు చేయించుకుంటుంది. వేంపల్లె షరీఫ్, నేను కలిసి చేసిన పని కాలం నిర్దేశనం వల్ల రూపుదిద్దుకున్నదే. ముస్లింల జీవితం, ఘర్షణ, వేదన, ప్రతిపాదన... వీటికి మించిన వర్తమాన చర్చనీయాంశం మరొకటి ఉన్నదా? అందుకే ఈ సంకలనం తయారైనది. మరో రకంగా చెప్పాలంటే ఒక ప్రాంతం తాలూకు నిర్దిష్టమైన మానసిక, భౌతిక స్పందన దేశ పరిణామాల పట్ల ఎలా ఉన్నదో తెలియడానికి ఈ ప్రయత్నం జరిగింది. అందుకే ‘ఆంధ్రప్రదేశ్’కు ప్రాతినిధ్యం వహిస్తున్న 23 మంది ‘ముస్లిం రచయితల’ 23 కథలతోటి ‘కథామినార్’ తయారైంది. ‘సలీం’ వంటి సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత, ‘వేంపల్లె షరీఫ్’ వంటి యువ సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత ఈ పట్టికలో ఉండటం ముస్లిం కథ ఎంత ప్రతిభావంతంగా వికసించిందో తెలియడానికి ఒక సూచిక. షేక్ హుసేన్, వేంపల్లి అబ్దుల్ ఖాదర్, శశిశ్రీ (బేపారి రహంతుల్లా) వంటి ముందుతరం రచయితలతో పాటు ‘బా’ రహమతుల్లా, ఇనాయతుల్లా, డానీ వంటి మలితరం రచయితలు అక్కంపేట ఇబ్రహీం, మహమూద్, రెహానా, అమర్ అహ్మద్ వంటి ఈ తరం రచయితలు ఈ సంకలనంలో ఉండటం ముస్లిం కథ పరిపుష్టికి నమూనా. 2005 తర్వాతి కాలాన్ని పరిగణనలోకి తీసుకోవడం వల్ల ‘దాదాహయత్’ వంటి ఇద్దరు ముగ్గురు మేలిమి కథకులు ఈ సంకలనంలోకి రాలేదు. ముస్లిం కథలు మెజారిటీలను సెన్సిటైజ్ చేయడానికి వారితో ఎక్కువ సంభాషించడానికి రాయాలనే అభిప్రాయం ఒకటి ముస్లిం సమాజంలో ఉంది. ముస్లింల అంతర్గత సమస్యల సంగతి తర్వాత చూడవచ్చు అనే అభిప్రాయం కూడా ఉంది. కాని ఈ సంకలనంలోని కథలు లోపలి సమాజాన్ని బయటి సమాజాన్ని కూడా చూపుడువేలు చూపి నిలదీస్తాయి. పరిస్థితులను చర్చిస్తాయి. తమవైపు ద్వేషపు చూపుడువేలు ఆడించేవారిని ఆశ్రువులతో తడుపుతాయి. ఆరు నెలల సుదీర్ఘ శ్రమ... భిన్నమైన ఉద్వేగాల రాపిడి... సంతోషంతో కూడిన ఉద్వేగం... మావైపు నుంచి ఒక అంకం ముగిసింది. ఇక కరచాలనం మీ వంతు.
టైటిల్ లెటర్స్: లక్ష్మణ్ ఏలే; కవర్ డిజైన్: లేపాక్షి; పబ్లిసిటీ స్లైడ్: మహి బెజవాడ.

Tuesday, 29 May 2018

మెట్రో కథలు గురించి ఇంకొంచెం

మెట్రో కథలు గురించి ఇంకొంచెం 

దీపం వెలిగినాక అక్కడే ఉంటే 
ఏమి విలువ 
ఇంకొంచెం 
ప్రపంచానికి తెలిసేటట్లు ..... 

హిందూ పేపర్లోని ఆర్టికల్ చదవండి 

Tuesday, 22 May 2018

కథా దీప ధారులు

కథా దీప ధారులు 
కొందరు ఉంటారు 
లోపలి దుఃఖం నిలవనీయక అక్షరాలుగా మారి 
విలవిలా ఏడుస్తూ ఉంటారు 
దారిగా తామే మారుతూ ఉంటారు 
మరి ఆ దీపాల్ని ఏమని పొగడాలి
ఖదీర్ గారి మాటల్లోనే చదవండి ....  


పురస్కార పత్రం ఎలా రాస్తారు?
ఎలా రాస్తారు? తెలియదు. కాని ‘రైటర్స్ మీట్’ తరఫున
 ‘కొత్తకథ 2018’ ఆవిష్కరణలో 
ముందు తరం రచయితలను ‘కథా దీపధారులు’ 
పురస్కారంతో సత్కరించాలని నిర్ణయించుకున్నాక 
కొలకలూరి ఇనాక్, బి.ఎస్.రాములు, ఇంద్రగంటి జానకీబాల గార్ల
 గురించి ఇలా నాలుగు వాక్యాలు రాయగలగడం
 నాకు సంతోషం కలిగించింది. అంతేనా? 
వీరి ముగ్గురి గౌరవార్థం అడిటోరియం అంతా లేచి నిలబడి
 స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడం... 
ఆ క్షణంలో ఎందరో కథకులు ఉండటం ఎంత భాగ్యమని.


కథా దీపధారి
2018
కొలకలూరి ఇనాక్
పావుకోళ్లు, స్పృశ్య పాదాలతో నిండి ఉన్న తెలుగు కథావరణంలో అస్పృశ్యమైన కిర్రుచెప్పులతో నడిచి వచ్చి, నడుము మీద చేతులు వేసి నిలుచుని, భుజాలు పొంగించగల ఒక అక్షరాన్ని తీసుకువచ్చిన కొలకలూరి ఇనాక్ 1954లో తన మొదటి కథ అచ్చయిన నాటి నుంచి 60 సుదీర్ఘ సంవత్సరాలుగా కథను అన్నవస్త్రాలుగా ధరించి తిరుగుతున్న కథామూర్తి. నల్ల అక్షరాన్ని, నలిపివేయబడ్డ అక్షరాన్ని, వెట్టి అక్షరాన్ని, వెలి అక్షరాన్ని, ఊరి చివరే ఉంచేసి ఊళ్లోకి రావద్దన్న అక్షరాన్ని కథను చేసి, కసిని చేసి, ఆధిపత్యపు మేకు నెత్తిన మోదగల గూటాన్ని చేసి, అహంకారమనే తోలును వలవగల కత్తిని చేసి పాఠకుల చేతికి అందించిన కథకుడు ఆయన. 300 కథలు, 11 కథా సంపుటాలు వీరి ఇరుభుజాల మీద సీతాకోక చిలుకల వలే వాలి ఉన్నాయి. కటికలు, ఎరుకలు, యానాదులు, ముస్లింలు, స్త్రీలు, పతితులు, భ్రష్టులు వీరి కథల్లో పాఠకులతో కలిసి ఏడ్చారు. నవ్వగలిగినప్పుడు నవ్వారు. కాని అంతకన్నా బాగా చేసిన పని పాఠకులను దగ్గరగా తీసుకొని హత్తుకోవడమే. ‘ఊరబావి’, ‘తల లేనోడు’, ‘రమ నా కూతురు’... ఇనాక్ కథా సంవిధానానికి, సంవాదానికి మచ్చు తునకలు. నాటకం, కవిత్వం, ఆధ్యాపకత్వం, ఉపన్యాసం... ఆయన సృజన సోపానాలపై నిలిచిన జీవభంజికలు. ‘పద్మశ్రీ’ పురస్కారం తెలుగు కథకు ఇనాక్ సాధించిన మేలిమి గౌరవం.
నిండైన రూపం, భేషజం లేని సంభాషణ, నిలువెత్తు స్ఫూర్తి... కొలకలూరి ఇనాక్ గారూ... మీవంటి వారు దారులు తొలిచి మార్గాలు వేయడం వల్లే మేము ఇవాళ నడుస్తున్నాం నడవగలుగుతున్నాం అని నమ్ముతూ కృతజ్ఞతగా ‘కథా దీపధారి’ పురస్కారంతో గౌరవించుకుంటున్నాం.
నమస్కారాలతో
రైటర్స్ మీట్

కథా దీపధారి 
2018
బి.ఎస్.రాములు
బీడీలు చుట్టాల్సిన చేతులు కథల్లోని వాక్యాలు రాస్తే ఏమవుతుందో అదే అయ్యింది. బాధితులు నాయకులు అయ్యారు. బాధపెట్టేవారు ప్రతినాయకులు అయ్యారు. ఇందుకు మేము ఇలా ఉన్నాం, ఇందుకు మేము దోపిడీకి గురవుతున్నాం, ఇందుకు మేము పరాయీకరణ చెందుతున్నాం, ఇందుకు మేము వృత్తులను కోల్పోతున్నాం, ఇందుకు మేము ప్రపంచ గమనంలో పావులమయ్యి చెల్లా చెదురవుతున్నాం అని చెప్పడానికి చెప్తూనే ఉండటానికి కథలు రాస్తున్న బి.ఎస్.రాములు 1980లో తన తొలి కథ రాసిన నాటి నుంచి నేటి వరకు 40 ఏళ్లుగా కథా పరిశ్రమ చేస్తూనే ఉన్నారు. 150కి పైగా కథలు, 12 కథాసంపుటాలు వీరి పేరున ఉన్న అల్మారాలో దీటుగా నిలుచుని ఉన్నాయి. విప్లవ పోరాటాలు, తెలంగాణ వలసలు, వెట్టి జీవితం, పై వర్గాల దౌర్జన్యం... వెరసి ఒక సామాజిక చరిత్రగా, మానవ సంబంధాల పరిణామానికి సాక్ష్యంగా వీరి కథలు పరిణమించాయి. ‘పాలు’, ‘అడవిలో వెన్నెల’, ‘బందీ’, ‘వారసత్వం’, ‘దక్షయజ్ఞం’... వంటి కథలు సామాజిక ఉద్దేశ్యం లేనిదే మంచి కథ కాలేదని నిరూపిస్తాయి. తాడోపేడో తేల్చుకోవడం కూడా కథకు ఉండాల్సిన ఒక లక్షణంగా నిరూపించిన రచయిత. కథల కోసం పరిశ్రమించారు. కొత్త రచయితల కోసం ‘కథల బడి’ గ్రంథాన్ని రచించారు. కథకుల పట్ల అనురక్తితో కథల వర్క్‌షాప్‌లు నిర్వహించారు. కథ పట్ల అవ్యాజమైన ప్రేమ ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. వీరు బి.సి. కమిషన్‌కు చైర్మన్ కావడం కథకు లభించిన ఒక అలంకారం.
తెల్లటి నవ్వు, బోళా మనస్తత్వం, నిరంతర పథికత్వం... బి.ఎస్.రాములు గారూ మీవంటి వారు దారులు తొలిచి మార్గాలు వేయడం వల్లే మేము ఇవాళ నడుస్తున్నాం నడవగలుగుతున్నాం అని నమ్ముతూ కృతజ్ఞతగా ‘కథా దీపధారి’ పురస్కారంతో గౌరవించుకుంటున్నాం.
నమస్కారాలతో
రైటర్స్ మీట్
కథా దీపధారి
2018
ఇంద్రగంటి జానకీబాల
స్త్రీ కొంగుముడిలో చిక్కుబడి ఉన్న సమస్యలను విప్పి చెప్పడానికి నిబద్ధులైన ఇంద్రగంటి జానకీబాల తన మొదటి కథ 1970లో వెలువడిన నాటి నుంచి యాభై ఏళ్లుగా సుదీర్ఘ కథా ప్రస్తానం చేస్తూ పాఠకుల మేధో క్షుద్బాధకు గింజలను అందిస్తూనే ఉన్నారు. 200 కథలు, ఆరు కథాసంపుటాలు వీరి సృజనకు కథా ప్రయాణానికి ఆనవాలుగా ఉన్నాయి. ప్రోత్సాహం, ప్రతిస్పందన వంటివి తెలుగు సమాజంలో అతి సన్నని మిణుకు మిణుకుమనే దీపాలుకాగా తన వెలుతురు తానే వెతుక్కుంటూ కథను ధరించి నడిచిన రచయిత్రి. ‘జీవన రాజకీయం’, ‘వేణీ సంహారం’, ‘శత్రువు’... వంటి శక్తిమంతమైన కథలు జానకీబాల రచనా చేవకు నిదర్శనం. బాధ- కథను మొదలెట్టడానికి మొదటి సిరా చుక్క అని విశ్వసించే జానకీబాల వచనానికి పరిపూర్ణరూపం నవల ద్వారా వస్తుందని ‘కనిపించే గతం’ వంటి ప్రభావవంతమైన నవలతో నిరూపించారు. జీవనంలో పాటను తోడు చేసుకున్న ఈ రచయిత్రి అందుకు కృతజ్ఞతగా ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్స్ లైఫ్ స్కెచెస్‌తో ‘కొమ్మా కొమ్మా కోకిలమ్మా’ పుస్తకాన్ని అందించారు.
సెన్సాఫ్ హ్యూమర్, చలాకీతనం, హుందాతనం నిండిన సాహితీ జీవితం... ఇంద్రగంటి జానకీబాల గారూ మీవంటి వారు దారులు తొలిచి మార్గాలు వేయడం వల్లే మేము ఇవాళ నడుస్తున్నాం నడవగలుగుతున్నాం అని నమ్ముతూ కృతజ్ఞతగా ‘కథా దీపధారి’ పురస్కారంతో గౌరవించుకుంటున్నాం.
నమస్కారాలతో
రైటర్స్ మీట్

Friday, 11 May 2018

కొత్త కథ 2018

కొత్త కథ 2018

అడుగు వెనుక ఒక్కో అడుగు పడుతూ ఉంటే 
ఇక అవి అడుగులు మాత్రమే కావు 
ఇక అది ఒక చరిత్ర 
దానికి పునాది మంచి కావొచ్చు చెడు కావొచ్చు 
కానీ గట్టి సంకల్పమే దానిని సృష్టిస్తుంది 
అన్ని ఇటుకులను ఒకదానిపై ఒకటి 
కదలకుండా నిలుపుకోవడం అందరికీ సాధ్యం కాదు 
దానికి మొండి ధైర్యం కావాలి 
ఖదీర్ బాబు గారి ఒక్క రైటర్స్ వర్కుషాప్ 
ఈ రోజు ఎన్నింటికి బాట వేసింది 
కథకు కూడా శాలువాలు కప్పే రోజులు వచ్చేసాయి 
ఇక ఉగాది కథాసమ్మేళనాలు జరగడమే తరువాతి అడుగు 
ఇన్ని అడుగులు వేసిన వారికి 
అది ఒక నల్లేరు మీద నడక!

ఖదీర్ గారి హిడన్  కాజల్ సృష్టించిన కొత్త కథ 2018 
ఆవిష్కరణ సంధర్బంగా అభినందనలు. 

కీసర నుంచీ సూర్యలంక మీదుగా హిడెన్ కాజిల్ దాక ...
----------------------------------
న్యూ మిలీనియం (2000): సెల్ ఫోన్లు ఎవరిదగ్గరా లేని కాలం.
చాలీచాలని వేతనాలు, దినదిన గండాలు, 
ఉద్యోగాల అభద్రతలు, అదొక సంధి యుగం.
రోజువారీ ఉద్యోగాలకూ వ్యాపకాలకూ దూరంగా 
ఎవరికీ అందుబాటులో లేకుండా కేవలం 
సాహిత్యమే సంభాషణగా రెండురోజుల పాటు 
మనసులు విప్పి గడపాలని పదిహేనుమందికి పైగా
 రచయితలు, విమర్శకులూ, పాఠకులూ 
కీసరగుట్టలో ఒక చిన్న గెస్ట్‌హౌస్‌లో కలిశారు.
రచయితలు తామెందుకు రాస్తున్నారో,
 రాయటంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలేమిటో చెప్పారు.
 కథా చిత్రణలో కొత్త వస్తువులూ, కొత్త శిల్పాలూ, 
ప్రయోగాలూ ఎలా సాధిస్తున్నారో పంచుకొన్నారు.
విమర్శక మిత్రులు అప్పుడు వస్తున్న 
కథా ధోరణుల గురించీ వాటి బలాలూ బలహీనతలూ, 
కథలెందుకు చదివిస్తున్నాయో లేకపోతున్నాయో, 
రచయితలు కొన్ని కథా వస్తువులనెందుకు 
చూడలేకపోతున్నారో, జీవితంలో ఉండే 
చిన్న ఆనందాలని ఎందుకు పట్టుకోలేక పోతున్నారో, 
సాహిత్యమంటేనే ఓ పెద్ద జీవితకాలపు బరువు 
అనిపించేంత సీరియస్‌గా (?) ఎందుకు రాస్తున్నారో,
 ప్రపంచ సాహిత్యాన్ని ఎందుకు చదవాలో, 
తెలుగులో విమర్శ ఎందుకు ఎదగటం లేదో 
అందుకు ఎమేం పరికరాలు అందుబాటులో లేవో కూడా చర్చించారు.
తెలుగు నేల మీద వివిధ ప్రాంతాల నుంచీ 
అనేక నేపధ్యాల నుంచీవచ్చిన రచయితలు 
తమ వైన ప్రత్యేక సమస్యల్నీ వాటికి సాహిత్యంలో
 చోటు కల్పించటంపై అనేక సందేహాలు వ్యక్తంచేశారు.
ఇంకా ఇలాంటివే అనేక సాహిత్య సామాజిక విశ్లేషణల సశేష ప్రశ్నలు.
వాటన్నిటినీ మించి ఆ కలయిక ఇచ్చిన మరెన్నో ఉత్తేజాలు, 
సరికొత్త స్నేహాలూ, ఆప్యాయతలూ, విజయ దరహాసాలూ.
అప్పుడు ఆ కథా సమావేశం అలా జరగటం 
వెనుక ఇప్పుడు మళ్ళీ చెప్పుకోవల్సిన నేపధ్యముంది. 
1990ల దశకం ముగింపు ఆ సందర్భం.
తెలుగునేల ప్రపంచ పర్యావరణంతో 
కొత్త సంబంధాలకూ సంఘర్షణలకూ సిద్ధమవుతోంది. 
జీవితంలో సమాజంలో ఊహించని మార్పులు తీవ్రతరమవుతున్నాయి.

అప్పటికి తెలుగు కథపై కొత్త గొంతులు వినిపిస్తున్నాయి.
 పాత గొంతులు మూగబోతున్నాయి. మరెన్నో గొంతులు
 సుదీర్ఘ మౌనంలోకి జారిపోతున్నాయి.
 కొత్తగా రాయబోతున్నవారికీ మళ్ళీ కొత్తగా రాయదల్చుకున్న
 పాత రచయితలకీ ఎదురవుతున్నది ఒకే సమస్య. ఒకే సందేహం.
ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏం రాయాలి? ఎలా రాయాలి?
అలా జరిగిన ఆ చిన్న సమావేశానికి ప్రతిఫలం మెల్లగానే 
అయినా తెలుగునేలపై అనేకచోట్ల కనిపించింది.
చిన్న చిన్న బృందాలే కాక పెద్ద పెద్ద సంఘాలు కూడా 
రచయితల్ని కలిపే ఇలాంటి సమావేశాలు అనేకం నిర్వహించాయి.
‘రైటర్స్ మీట్’ - ఇప్పటికి పన్నెండు రచయితల వర్క్ షాప్లు -
 కీసర, చినుకు, మామండూరు, నాగార్జున సాగర్, పూనే, తలకోన, చిలుమూరు,
 రామయ్య పట్నం, కొల్లేరు, సూర్యలంక, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ,
 హిడెన్ కాజిల్ - వంటి చోట్ల విజయవంతంగా నిర్వహించింది.

ఈ సమావేశాల మీద అమరేంద్ర గారి వ్యాసం ఇక్కడ:
పదిహేడేళ్ళల్లో జరిగిన ఈ పన్నెండు సమావేశాలు 
అనేక మంది సీనియర్ రచయితల సరసన 
ఒకే ఒక్క కథ రాసిన యువ రచయితలకూ కూడా చోటు కల్పించాయి.
 వారికి ప్రేరణగా నిలిచాయి.
2016 చివరిలో ‘రైటర్స్ మీట్’ వర్క్ షాప్‌కు వచ్చిన 
వారితో కథ రాయించి ప్రచురించిన కొత్త ప్రయోగం కొత్త కథ - 2017.
2017 చివరిలో ‘రైటర్స్ మీట్’ వర్క్ షాప్‌కు వచ్చిన
 వారితోరాబోతున్నది కొత్త కథ - 2018.
===========================================
రాబోయే ఆదివారం (మే 13) తెలుగు యూనివర్సిటీలో 
ఉదయం 10:30 కి కొత్త కథ - 2018 ఆవిష్కరణ
===========================================
ఈ కొత్త కథ - 2018 మీద సంపాదక బృందం ,
 ఇంకా కథలు చదివిన మిత్రుల అభిప్రాయం ఏమంటే ...
"లోపలి పేజీల్లోకి అడుగు పెట్టండి, ఇక మీ కళ్లూ మీ మనసూ ఇక మీవి కావు..."