స్వాగతం

ఖదీర్ బాబు గారి అభిమానులకు స్వాగతం

Thursday, 29 March 2018

వేసవి కధోత్సవం

పంటలు రెండు వేస్తాము 
ఖరీఫ్ రబీ 
తిండి గింజలు చాలవు అని 

మరి ప్రతి క్షణం ఒక కథకు సరిపోయే వ్యథగా ఉన్నప్పుడు 
ఒక్క కథల మీటింగ్ ఏమి సరిపోతుంది 
ఇంకొకటి కావాల్సిందే!! 
అందరు పనులు ఆపి కలవాల్సిందే 
ఖదీర్ బాబు వేసిన పందిరి కింద కుర్చోవాల్సిందే 
కొందరి భయాలు కొందరి అభయాలు 
కొందరి తొందర అడుగులు కొందరి తప్పటడుగులు 
ఒకరికి ఆలంబన కావాలి 
ఒకరికి చప్పట్లు కావాలి 

కొంచెం కథల చర్చ 
కొంత ప్రకృతిలోకి నడక 
చాలబ్బా!అందరు రీఛార్జ్ అయిపోయి 
మోసుకువచ్చిన వాటితో 
కథల వాన కురుస్తుంది 

అప్పుడిక ఏడాదికి మూడు ఉత్సవాలు కోరుకుందాము .... 
కథ 2018 కోసం ఎదురు చూడండి . 


From Mohammed Khadeerbabu: 
కందకం దాటిన కథ 
- మహమ్మద్ ఖదీర్‌బాబు 

అప్పటికే రాత్రయిపోయింది. తొమ్మిది దాటేసింది.
 చీకటిగా ఉండగా మసక వెలుతురులో ఏమీ కనిపించేలా లేదు. 
ఎదురుగా పెద్ద కోట. మూసేసిన రాజద్వారం. 
ముందుకు అడుగేద్దామంటే కందకం. 
దాంట్లో మొసళ్లు ఉన్నాయో... ముడితే జుర్రే జలగలు ఉన్నాయో. 
‘ఏదైనా పాస్‌వర్డ్ చెప్పండి. 
అప్పుడే రాజద్వారం తెరుచుకుంటుంది’ అన్నాడు ద్వారపాలకుడు. 
దరహాసం మెదిలింది అందరిలో. 
కాలంలో తెలుగు కథ ఇలాంటి కందకాలను ఎన్ని చూళ్లేదు? 
దానిని చులాగ్గా చలాకీగా దాటేయించిన మహా కథకులు ఎందరు రాలేదు. 
ఎవరి పేరు చెప్పాలి? గురజాడ, కొ.కు, చలం.... 
కాని కథను బతుకుగా చేసుకున్న, కథకు జీవితాన్ని
 సమర్పించిన శ్రీపాద పేరు చెప్పాలనిపించింది. 
మొత్తం 35 మంది. ఆ రాత్రి. నగరానికి అంత దూరం. 
దాదాపు అడవిలాంటి ప్రాంతంలో
 ఆ నీరవంలో ఆ మహాకథకుని పేరును హోరుగా ఉద్ఘాటించాం. 
‘శ్రీపాద’.. ‘శ్రీపాద’.. ‘శ్రీపాద’... 
సంకెళ్లు కణకణలాడాయి. ఆ నిలువెత్తు 
లోహద్వారం కిరకిరమని కదలింది. 
‘శ్రీపాద’.. ‘శ్రీపాద’.. అరుస్తూనే ఉన్నాం. 
ఆ పేరుకు అభివాదం చేస్తున్నట్టుగా 
కందకం మీదుగా ద్వారం వాలి దారి ఏర్పరిచింది. 
ముక్తవరం పార్థసారథి, వి.రాజారామ్మోహనరావు, 
అల్లం రాజయ్య, సురేష్... ఒక్కొక్కరు అడుగు వేశారు. 
అందరూ అనుసరించారు. 
కోట తలను వంచి కథ ముందుకు అడుగు వేసింది.. 
*** 

పరిచయం కావాలి కథకునికి- సాటి కథకునితో.
 పరిచయం కావాలి కథకు- తోటి కథకునితో. 
పరిచయం కోసమే సుమా ఈ రెండు రోజుల వేడుక. 
నువ్వు ఎంత బాగా రాశావు... నేను ఇంత బాగా ఎలా రాయాలి.. 
రెండు చేతులు కలిపి పెద్దగా చప్పట్లు కొట్టాలంటే
 తెలుగువానికి సిగ్గు. అహం. అభిజాత్యం. 
వదిలి ఆలింగనం చేసుకోవడానికే ఈ రెండు రోజులు. 
నేను సమానం. నువ్వు సమానం. 
నీ శక్తి నాకు ఇచ్చి నా యుక్తి నీకు పంచి ఇద్దరం కావాలి కథకు బలం. 
ఓహ్. 
పరిచయాలు మొదలయ్యాయి. 
ఇద్దరు మనుషులు పక్క పక్కన నిలబడితే, 
వారి ఎత్తూ మందమూ సరిపడ కలప సొరుగు 
తయారు చేస్తే దాని నిండుగా పట్టేన్ని పుస్తకాలు రాశాడే... 
అదిగో ఆయనే ముక్తవరం పార్థసారథి. 
ఉద్యమంలో చేసే నినాదం ఎవరి రాతతో 
సమూహ కంఠంగా మారుతుందో, 
అడవిలో పేలే తూట ఎవరి రచనతో లక్ష్యాన్ని ఛేదిస్తుందో,
 ఎవరి కథా ప్రమేయంతో ఆవేశం చైతన్యంగా రూపాంతరం
 చెందుతుందో అతడే అల్లం రాజయ్య.
 డెబ్బైలలో ఎనభైలలో ఎనుగులు తిన్నవాడి వలే
 కథలు రాసి బలం ప్రదర్శించిన కథకుడిని చూస్తారా...
 వి.రాజారామ్మోహనరావు ఈయనేనండీ. 
జ్యోతి, స్వాతీ మంత్లీలు ఎడిట్ చేసి తల పండిన 
కథాపండితునితో కరచాలం చేస్తారా... 
ఈయనే వేమూరి సత్యనారాయణ. 
స్కూటర్ వెనుక చిన్న మూట కట్టుకొని 
హిమాలయాలకు బయల్దేరడానికి కూడా వెరవని
 ఉన్మత్త పథికుడిడిగో దాసరి అమరేంద్ర.
 ఆహా.. కారంచేడు, చుండూరు ఉద్యమాలలో దూకి ప్రత్యర్థులకు చెమటలు పట్టించిన డానీ అలియాస్ ఖాన్ యజ్దానీ ఈ టక్ చేసుకున్న మనిషే. విమెన్ రైటర్స్‌లో ఉరుములను, పిడుగులను తల కురులు కూడా చెదరకుండా ఎదుర్కొని స్థిరంగా నిలిచిన కుప్పిలి పద్మ ఈ సమక్షంలోనే ఉందే! తెలంగాణ కథ అని గూగుల్‌లో కొడితే ఈయన ఫొటో వచ్చిందా... అవునండీ ఈయనే పెద్దింటి అశోక్ కుమార్. 

రొయ్యల సాగు కంటే కథల సాగే మేలు అని భీమవరం నుంచి వచ్చిన కుమార్ కూనపరాజు, సాఫ్ట్‌వేర్ కంపెనీ వ్యవహారాలు తర్వాత చూసుకుందాం అని బెంగుళూరు నుంచి పరుగులిడిన ఝాన్సీ పాపుదేశి, మార్చి నెల రద్దీకి కూడా మారోగోలీ అనేసిన ఆడిటర్ కృష్ణమోహన్‌బాబు, సాక్షి సాహిత్యం పేజీని ముందే ముగించి బస్సెక్కిన పూడూరి రాజిరెడ్డి, షార్ట్‌హ్యాండ్ పెన్సిల్‌ని పక్కన పడేసి లీవ్ శాంక్షన్ చేసుకొచ్చిన అజయ్ ప్రసాద్, మెరైన్ సైంటిస్ట్ ఉణుదుర్తి సుధాకర్, సీనియర్ జర్నలిస్ట్ మధుసూదనరావు, అమెరికా నుంచి క్లయింట్స్ వచ్చినా బ్యాగ్ భుజాన తగిలించుకున్న సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ అక్కిరాజు భట్టిప్రోలు, డిజిటల్ ఎక్స్‌పర్ట్ అనిల్ అట్లూరి, రైటర్-బ్లాగ్ రైటర్ వనజ తాతినేని, బయోగ్రఫీ రైటర్‌గా బిజీ అయిన అరుణ పప్పు, పారలల్ సినిమా ఎక్స్‌పర్ట్ వెంకట్ సిధారెడ్డి, సాహిత్య అకాడెమీ యువపురస్కారం తెచ్చుకుని కథకు సిద్ధమవుతున్న మెర్సి మార్గరెట్, మల్టిపుల్ టాలెంటెడ్- రైటర్స్ మీట్ క్రియేటివ్స్ ప్రొవైడర్ మహి బెజవాడ, ట్రావెల్ కన్సల్టెంట్- రైటర్స్ మీట్‌కు వంద మనుషుల గ్రౌండ్ స్టాఫ్ కరుణ కుమార్... వీరంతా ఇక్కడ ఉన్నారు. 

ఇక రివ్వున వీస్తున్న ఈ కాలపు గాలులు మానస ఎండ్లూరి, చందు తులసి, ఇండ్ల చంద్రశేఖర్, నాగేంద్ర కాశీ, రిషి శ్రీనివాస్, మోహిత, మల్లికార్జున్, రిషిత, మిథున, లిటరేచర్ స్టూడెంట్ కడలి, చదువరి విశేష పుస్తకాభిమాని దేవిరెడ్డి రాజేశ్వరి, ఎనిమిదవ తరగతి చదువుతున్న స్టూడెంట్ రైటర్ జ్యోతిరాదిత్య... ఇంతమంది కలిశాక ఈ వేసవి ఉత్సవమే అవుతుంది. కథా ఉత్సవం. 
*** 

తెల్లవారి లేచాక ఎవరికో చెహోవ్ గుర్తొచ్చాడు. గొగోల్, హెమింగ్వే, మపాసా... వీళ్లంతా ఎందుకు గ్రేట్ మాస్టర్స్ అయ్యారు... మనలో ఒకరు గ్రేట్ మాస్టర్ ఎందుకు కాకూడదు... అసలు గ్రేట్ మాస్టర్స్‌కు ఉండాల్సిన లక్షణాలు ఏమిటి తెలుసుకోవాలి అనిపించింది. సెషన్ షురూ. గొప్ప కథ ఎక్కడ పుడుతుంది కల్లోల కాలంలోనా... కల్లోల హృదయంలోనా? సెషన్ పెట్టుకోవడమే పని. ఊరి కథ మాండలికంలో రాస్తాను... మరి మెట్రో కథ కూడా మాండలికంలో రాయొచ్చా? సందేహం. సెషన్ సిద్ధం. కథ సగంలో ఆగిపోతోంది... ముందుకు కదలడం లేదు. మరో సెషన్. వైద్యులు వచ్చి మందు చెప్పారు. నా కథకు స్పందన లేదు.. నా కథకు లైకులు రావడం లేదు... అసలు ఎవరు చదువుతున్నారో ఎవరు చదవడం లేదో తెలియడం లేదు... ఇలాంటప్పుడు రాయడం ఎందుకు? నీరసపడిన వారికి పెదనాన్నో మేనత్తో వచ్చి నిమ్మ రసం ఇచ్చి ఓపిక తెచ్చినట్టుగా ఇంకో సెషన్. స్త్రీ-పురుషులు వీళ్లేనా కథ అంటే? ఎల్‌జిబిటిలు మనుషులు కారా... వాళ్లకు కథలు ఉండవా... వాళ్ల కథలు వాళ్లు రాసుకునే కాలం వచ్చేంత వరకు మనం వారి కథలు రాయమా? కొంచెం అదిరిపాటుగా అయినా సరే సెషన్ ఒకటి. 

‘మీటూ’ అని ఆడవాళ్లు ఎందుకు అంటున్నారు? అస్తిత్వవాద కథ అంటే ఏమిటి? కథకు ఉండాల్సిన లక్ష్యం ఏమిటి లక్షణం ఏమిటి? ఓరి నాయన... ఎంత మంచి సెషన్‌లు. 

ప్రపంచమంతా ట్రావెల్ రైటింగ్‌లో బిజిగా ఉంది. తెలుగు ట్రావెల్ రైటింగ్ ఎక్కడ ఉంది? ఒక స్ఫూర్తివంతమైన సెషన్. 

అయ్యా... అసలు ఊళ్లు ఎలా ఉన్నాయి... రైతులు ఎలా ఉన్నారు... వారి వెతలు ఏమిటి అంటే ఇద్దరు ఊరి రచయితలు చెప్పిన మాటలు... అందరి కళ్లల్లో అశ్రువులు... ఇదొక ఉద్వేగపు ఉప్పదనం నిండిన సెషన్. 

గత ఐదేళ్లుగా వస్తున్న తెలుగు కథలో వస్తువు ఏమిటి, ఆత్మిక సంఘర్షణను తెలుగు కథ పట్టుకుంటున్నదా, కలల్లో వచ్చే ఘటనలు కథలు అవుతాయా, మనిషిలో ఉండే క్రైమ్‌ను కథగా ఎందుకు చూపించలేకపోతున్నాం, పాలనలో ఉన్న ప్రభుత్వ ధోరణి వల్ల కథలు తోక ముడుచుకుంటాయా, డిజిటల్ మీడియాలో కథను ఎలా ప్రచారం చేయాలి.... 
ఈ సందేహాలకు రెండురోజులు సరిపోతాయా? 
*** 

రెండు పగళ్లు చాల్లేదు. రెండు రాత్రులు చాల్లేదు. ముప్పై అయిదు మంది ఆలోచనలు, అభిప్రాయాలు ఒకరికొకరికి చాల్లేదు. కాలం చాల్లేదు. కబుర్లు చాల్లేదు. స్తబ్దుగా మార్చేసిన ఆలోచనల తీవ్రత చాల్లేదు. కనుకొలకుల్లో జారిన అశ్రువు వేడిమి చాల్లేదు. నవ్వి నవ్వి రొప్పిన ఛాతీ అదురుపాటు చాల్లేదు. అసలేమీ చాల్లేదు. 
కాని- 
ఈ రెండు రోజులు దొరక్కపోతే కచ్చితంగా మొసళ్లకు చిక్కిపోయేవాళ్లం. జలగలకు దొరికిపోయేవాళ్లం. బద్దకం, నిర్లిప్తత, అనాసక్తి, సందేహాల క్రౌడ్ తాలూకు బరువు... వీటి కింద పడి నలిగిపోయేవాళ్లం. 

థాంక్స్ టు వీరశంకర్ అండ్ హెచ్‌టిఓ క్లబ్. 
థాంక్స్ టు హిడన్ కాజిల్ అండ్ న్యూస్ హెరాల్డ్. 
ఎటువంటి రెండు రోజులు ఇవి. 
మనసులో ఉన్న లక్ష కందకాలను ఒక్క ఊపులో దాటించేసిన గొప్ప రోజులు. 
తిరిగి రావు. తిరిగి రావు అవి మరల ముత్యాలు రాసి పోసినా. 

(మార్చ్ 23, 24 - 2018 రెండు రోజుల పాటు హైదరాబాద్ కు 70 కిలోమీటర్ల దూరం లో వున్న మెత్పల్లి హిడెన్ క్యాజిల్లో రైటర్స్ మీట్- HTO Club `వేసవి కథా వుత్సవం` జరిగింది ) 
#రైటర్స్‌మీట్ #WritersMeet #WritersMeet2018




Tuesday, 6 March 2018

రీటోల్డ్ 2

రీటోల్డ్ 2

ఇంకొన్ని కథలు 
సమానత్వాన్ని సాధించే దారిలో 
మనుషులం మనుషులుగా బ్రతకడం 
పక్కవారిని మనుషులుగా గుర్తించడం 
ఇప్పటికైనా గుర్తు చేసుకుందాము 

రీటోల్డ్ కావొచ్చు 
కానీ వేటికవే ఆ కలం లో 
కొత్త ఊపిరి పోసుకొని వస్తున్నాయి 
చదవండి 
 మహిళా దినోత్సవం మార్చ్ 8 సందర్బంగా 
నేను శక్తి సాక్షి హెడింగ్ కింద వ్రాసిన కథలు 
తల్లికి ఇంత కంటే ఋణం ఎవ్వరూ తీర్చుకోలేరు 





కథ తెలుగు ఎల్లలు దాటితే బాగుంటుంది

కథ తెలుగు ఎల్లలు దాటితే బాగుంటుంది 
పక్క భాష లో తన వ్యథను వినిపిస్తే బాగుంటుంది 
అదీ ఎవరినీ అడగకుండా జరిగితే  బాగుంటుంది
ఆ విశేషాలు రచయిత మాటల్లో వింటే ఇంకా బాగుంటుంది 
ఖదీర్ గారి మాటలు .... 

 కన్నడంలో నా ‘కింద నేల ఉంది’ కథ ఇది.
మూడు నాలుగు పేజీల కథకు కూడా ‘ఇబ్బంది’ పడే తెలుగు 
మేగజీన్ల కాలంలో 20 పేజీలకు మించి ఉన్న ఈ కథను
 శ్రద్ధగా, ఐదారు బొమ్మలతో ప్రచురించారు. 
డక్కన్ హెరాల్డ్ గ్రూపుకు చెందిన ‘మయూర’ ఈ కథకు వేదిక అయ్యింది. 
‘గెట్ పబ్లిష్డ్’ తర్వాత అక్కడ వచ్చిన నా కథ ఇది. 
‘న్యూ బాంబే టైలర్స్’ కథను ఉగాది ప్రత్యేక సంచికలో వెలువరించనున్నారట.
రాసిన కథ పరదేశానికి ఏగి తల ఎత్తుకు నిలబడ్డం కథకునికి బాగా అనిపిస్తుంది.
ముఖ్యంగా మనం ఫోన్ చేసి ‘గురూ.. నా కథొకటి ఉంది ట్రాన్స్‌లేట్ చేస్తావా’ 
అని అడక్కపోతే.


Wednesday, 14 February 2018

రీ టోల్డ్ చేస్తూనే ఉందాము

 ఒక్కోసారి చేతివేళ్ళు మంచి పనులు 
చేస్తూ ఉంటాయి 
జాలువారే కన్నీటిని అక్షరాలతో తుడుస్తూ 
హృదయం వెంబడి నడుస్తూ 
ఏదో చరిత్ర సృష్టిస్తూ ఉంటాయి 
అప్పుడు అనిపిస్తూ ఉంటుంది 
లోనుండి నడిపేది ఎవరో కాదు 
మన అమ్మ దీవెన అని!
అక్షర గంగ లో ముంచి మన మలినాలు 
కడుగుతూ తన ఆయుష్షు కూడా 
మనకు పోస్తూ ఉంటుంది 
ఇప్పుడు పీల్చే ఊపిరి వెనుక 
ఉండేది ఆమె రక్ష అని కొందరికే 
తెలుస్తుంది 

తాము వ్రాసుకోలేని వెతలు షీ గా 
ఖదీర్ కలం నుండి జారితే 
వే టు గో అన్నాము 
గాయాల గొంతులు రీటోల్డ్ చేస్తుంటే 
మన గొంతు కలుపుతాము 

రీటోల్డ్ కథల పుస్తకం కోసం ఎదురు చూస్తూ 
దర్గామిట్ట కథలు ,వాన కథలు ఇతర భాషలో 
వచ్చినందుకు అభినందిస్తూ .... 



Sunday, 31 December 2017

2017 నాట్ ఎట్ కంప్లీటెడ్

2017 నాట్ ఎట్ కంప్లీటెడ్ 

అప్పుడే అయిపోయిందా 2017
దోసెడుతో దోసెడు 
నిండుగా అక్షర సన్మానాలు 
జరపకుండా ఎక్కడికి పోతుంది 
మెట్లన్నీ ఎక్కిన వారికి 
ఈ మెట్టు ఒక అడుగు అంతే 
ఇపుడు వాళ్ళు వెనుక వచ్చే వాళ్లకి 
దారి చూపే దీపం 
భుజం తట్టే చేయి 

అయినా కాలం ఊరుకుంటుందా !
మన తాయిలం వాటా మనకు ఇచ్చినా 
అమ్మ మళ్ళీ ఎప్పుడో చివరలో 
తన వాటా తాయిలం ఇచ్చి 
మన కళ్ళలో తనను చూసి మురిసినట్లు 
కాలం కూడా దాచి ఇస్తూ ఉంటుంది 
ఇలా కొన్ని అనందాలు మూటగట్టి 

పెద్దిబొట్ల అవార్డు అందుకున్నందుకు 
ఖదీర్ గారికి అభినందనలు 


 వారందరిలో చిన్నవాడు!
రెండువేల పన్నెండులో, తన డెబ్భైఐదవ జన్మదినోత్సవానికి వేదిక మీదకి ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మన తెలుగు చిత్రకారుడు, పద్మశ్రీ ఎస్ వి రామారావు గారిని ఆహ్వానించే అరుదైన అవకాశాన్నినాకు కల్పించినవారు నవలాకారులు, అంతకంటే గొప్ప కధకులు#పెద్దిభొట్ల_సుబ్బరామయ్య గారు. తన అభిమాన రచయిత మధురాంతకం రాజారాం తనయుడు మధురాంతకం నరేంద్రకి « పెద్దిభొట్ల సాహిత్య స్ఫూర్తి పురస్కారం » ప్రదానం చేసి ఒక గొప్ప సంప్రదాయానికి అంకురార్పణ చేసిన రచయిత#పెద్దిభొట్ల.

తొలి "పెద్దిభొట్ల సాహిత్య స్ఫూర్తి పురస్కారం" అందుకున్నవారు Madhuranthakam Narendra. పురస్కార ప్రదాత, గ్రహీతలిద్దరూ అధ్యాపకులే ! ఆ నాటి ఆ సభకు అధ్యక్షత వహించింది పర్యావరణ ప్రేమికుడు, రచయిత పతంజలి శాస్త్రి గారు.

మళ్ళీ ఈ 2017 లో పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి పేరు మీదగా నెలకొల్పిన "పెద్దిభొట్ల సాహిత్య స్ఫూర్తి పురస్కారం" అందుకుంటున్న వాడు "ఖధీరుడు" . 

ఇంకొన్ని జ్ఞాపకాలు 














ముంబైలో సుధాకర్ ఉణుదుర్తి ఫ్లయిట్ ఎక్కారు. చెన్నైలో మురారి గారి ఫ్లయిట్ టేకాఫ్ అయ్యింది. కావలిలో కృష్ణజ్యోతి సింహపురి క్యాచ్ చేశారు. భూతం ముత్యాలు నల్గొండ బస్‌లో టికెట్ కొట్టించారు. అల్లం రాజయ్య మంచిర్యాలలో బ్యాగ్ తగిలించుకున్నారు. అన్వర్ వరంగల్ నుంచి సీదా రస్తా పట్టారు. కుమార్ కూనపరాజు రొయ్యల చెరువుల్ని వదిలిపెట్టి ప.గో నుంచి ఎకో స్పోర్ట్‌ని పరుగు పెట్టించారు. సిటీలో ఉన్న సాథీలంతా ఓలా క్యాబ్ కోసం వేళ్లు కదిలించారు. అందరి సూట్‌కేసులూ హైదరాబాద్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి చేరాయి. నిద్ర ఎవరికి కావాలి? పుల్కాలు పెరుగున్నం ఎవరికి కావాలి? వెచ్చగా ఉన్న ఆ రాత్రి నలుపు ఎవరికి కావాలి? రచయితలతో మాటలు కావాలి. ఒక హాయ్ గురూ పలకరింపు కావాలి. నవ్వు నవ్వుగా భుజం చరుపు కావాలి. అరే మీరా అన్న ఆశ్చర్యం. పక్కపక్కన తనలాంటి వాళ్లతో కలిసి నిలబడటంలో ఆనందం. తుదకు తన కుదురును చేరిన నిమ్మళం.
అంబేద్కర్ స్మరణకు నీలం. దళిత సాహిత్యపు చేతనకు నీలం. అక్షరానికి ధాతువైన సిరాకు కృతజ్ఞతగా నీలం. కథను విస్తారం చేయడానికి నీలం. విశ్వంబరను చేయడానికి నీలం.

Sunday, 8 October 2017

కథల వాన గురించి ఇంకొన్ని చినుకులు

కథల వాన గురించి ఇంకొన్ని చినుకులు 

వాన కురిసిన తరువాత పచ్చటి ఆకుల పందిరిపై 
నిలిచిన చినుకులు 
రాలుతూ రాలుతూ 
మళ్ళీ ఆ వానను గుర్తుకు తెస్తూ ఉంటాయి 
ఇంకో వానకోసం  ఎదురుచూసేలా 

ఇప్పుడు వాన కథలు పుస్తకం గురించి 
చిన వీరభద్రుడి గారి మాటల చినుకులు 
చదవండి ....... కాదు కాదు తడవండి  
మహమ్మద్ ఖదీర్ బాబు సంకలనం చేసిన 'ఉత్తమ తెలుగు వాన కథలు' 
నిన్న సోమాజీ గూడ ప్రెస్ క్లబ్ లో మిత్రులు ఆవిష్కరించారు.
 కథ వార్షిక సంకలనాల సంపాదకుడు, కథానికా ప్రక్రియ మీద 
విశేష కృషి చేస్తున్న వాసిరెడ్డి నవీన్ సభకి అధ్యక్షత వహించారు
. ప్రసిద్ధ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ముఖ్య అతిథి.
 ప్రసిద్ధ కవయిత్రి మెర్సీ మార్గరెట్, ప్రసిద్ధ కథకుడు,
 చలనచిత్ర విశ్లేషకుడు వెంకట సిద్ధారెడ్డిలతో పాటు 
నేను కూడా ఆ కథాసంకలనాన్ని స్వాగతిస్తో మాట్లాడేం.
తెలుగులో ఒక ఋతువునో లేదా ఒక ఇతివృత్తాన్నో
 (ప్రాంతాన్నో, పట్టణాన్నో కాకుండా) ఆలంబన చేసుకుని వచ్చిన 
మొదటి కథాసంకలనం ఇదే అని వక్తలన్నారు.
మొత్తం 20 కథలు. మొదటి కథ 1950 లో శారద రాసిన 'అదృష్టహీనుడు '
, చివరి కథ 2012 లో పూడూరి రాజిరెడ్డి రాసిన 'నగరంలో వాన'. పద్మరాజు,
 రావిశాస్త్రి, తిలక్ వంటి పూర్వమహాకథకులతో పాటు, 
కె.శ్రీకాంత్, పూడూరి రాజిరెడ్డి, అద్దేపల్లి ప్రభు వంటి యువకథకులదాకా
 సుమారు ఏడుదశాబ్దాల పాటు కురిసిన వాన ఇది. 
ఇందులో గత శతాబ్దానివి 14 కథలూ, కొత్త శతాబ్దంలో రాసినవి 6 కథలూ ఉన్నాయి
. కళింగాంధ్ర, గోదావరి,కృష్ణా పరీవాహక ప్రాంతాలు, దిగువ సర్కార్లు, 
రాయలసీమ, తెలంగాణా ప్రాంతాల్లో కురిసిన ఎన్నో వానలు: 
రెండు గాలివానలు, ఒక వర్షం, ఒక ముసురుపట్టిన రాత్రి తోపాటు
 ఒక కథలో కురవని వాన కూడా . (ఒకే ఒక్క లోటు కొండలమీద కురిసిన వాన లేకపోవడం)
పూర్వకథకులూ, నేటి కథకులూ ఒక్కచోట చేరిన 
ఈ సంకలనం తెలుగు కథకుడి గురించీ, తెలుగు కథ గురించీ 
మళ్ళా కొత్తగా కొన్ని ఆలోచనలు రేకెత్తిస్తూ ఉంది. పురాతన గిల్గమేష్
 పురాణ గాథలో నాయకుడిలాగా, తెలుగు కథకుడు, 
తక్కిన సమాజమంతా జలప్రళయానికి లోనవుతూంటే, తననీ, 
తనలాంటి కొద్దిపాటి జీవరాశినీ కాపాడుకోవడం కోసం 
ఒక పడవ రూపొందించుకుంటున్నట్టుగా తెలుగు కథ కనిపిస్తూ ఉంది. 
ఇందులో శ్రీకాంత్ రాసిన 'నిశ్శబ్దపు పాట ' కథలో కథకుడు 
నదిలో ప్రయాణించే ఒక కాగితపు పడవ
 రూపొందించాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు. 
ఎన్ని సార్లు విఫలమయినా విసుగుచెందడు
. ఆ కాగితపు పడవ సాహిత్యమేనని నేను వాచ్యం చేస్తే బావుండదు కదా.
ఈ కథల్లో కథకుడు కొన్నిసార్లు బాగా చదువుకున్నవాడు,
 'ప్రపంచం బాధ తన బాధ' గా మార్చుకోగలినవాడు. కాబట్టే, 
ఇందులో చోటు చేసుకున్న పాలగుమ్మి పద్మరాజు గారి కథ
 'గాలివాన' కి 1952 లో అంతర్జాతీయ కథలో పోటీలో బహుమతి వచ్చింది. 
కొన్ని కథల్లో కథకుడు పసిపిల్లల ప్రపంచాన్ని దాటి ఒక్క అడుగు కూడా 
ముందుకువెయ్యడానికి ఇష్టపడడు, స.వెం.రమేశ్ 'ఉత్తరపొద్దు' కథలో లాగా
. కొన్ని సార్లు కథకుడు మనుష్యప్రపంచం కూడా కాదు,
 చరాచరప్రంచాన్నంతటినీ ప్రేమతో హత్తుకుంటాడు,
 అజయప్రసాద్ రాసిన 'మృగశిర 'కథలో లాగా. కొన్ని కథల్లో కథకుడు 
శిల్పరీత్యా కథని వజ్రంలాగా వన్నె తీరుస్తాడు, రావిశాస్త్రి 'వర్షం', 
మహేంద్ర 'అతడి పేరు మనిషి', అద్దేపల్లి ప్రభు 'అతడు మనిషి' కథల్లోలాగా
. చాలా సార్లు కథకుడు ఈ సమాజం మధ్యనే, ఈ ఇరుకు జీవితం 
మధ్యనే ఎప్పుడు పడుతుందో, ఎక్కడ పడుతుందో 
తెలియని వానకోసం పరితపిస్తూంటాడు బి.ఎస్.రాములు 
'పాలు', జగన్నాథ శర్మ 'పేగు కాలిన వాసన', గుమ్మా ప్రసన్న కుమార్ 
'ముసురుపట్టిన రాత్రి ', అయోధ్యారెడ్డి 'గాలివాన ',
 గంగుల నరసింహా రెడ్డి 'వాన కురిసింది' కథల్లోలాగా. 
చివరికి, 'వాన రాలే ' కథలో స్వామి లాగా అనంతపురం
 ఆకాశం ఎప్పటికీ చినకని ఆ నాలుగు ముత్యాలకోసం 
నిరంతరనిరీక్షణలో గడుపుతాడు. కొన్ని కథలు 
కథస్థాయినిదాటి కవితలుగా మారిపోయినవి, శంకరమంచి సత్యం 'రెండుగంగలు', 
పూడూరి రాజిరెడ్డి 'నగరంలో వాన'. కొన్నిసార్లు కథ అనూహ్యమైన తాత్త్వికగాఢతని 
అందుకోగలిగింది, పద్మరాజుగారి 'గాలివాన', కుప్పిలి పద్మ 'గోడ', శ్రీకాంత్ 'నిశ్శబ్దపు పాట',
 ఖదీర్ బాబు 'ఒక సాయంత్రపు అదృష్టం' లాంటి కథల్లో.
ఇంకో రెండు మాటలు కూడా చెప్పాలి. పూర్వకథకుల కన్నా 
నేటి కథకులు మరింత చురుగ్గా, మరింత alert గా ఉన్నారు. 
పూర్వకథకులు సన్నివేశాల్ని కృత్రిమంగా సమకూర్చుకున్నట్టు 
కనిపిస్తుంది, తిలక్ 'ఊరి చివర ఇల్లు', బీనాదేవి 'డబ్బు', 
శారద 'అదృష్టహీనుడు' కథల్లోలాగా. కాని ఇప్పటి కథకుడికి
 ఆ ప్రయాస లేదు. ఇతడు అడుగు తీసి అడుగు వేస్తే జీవితం 
సహస్రముఖాల్తో సాక్షాత్కరిస్తోంది. అయితే, పూర్వకథకుడికి 
కథ చెప్పే విద్య బాగా పట్టుబడింది. ఇప్పటి కథకుడింకా
 ఆ స్వర్ణవిద్యకోసం నిద్రలేని రాత్రులు గడుపుతూనే ఉన్నాడు.
ద్వేషంతోనూ, దూషణలతోనూ భరించలేనంతగా ఉక్కపోస్తున్న కాలంలో, 
వర్ష ఋతువు అయిపోయాక వచ్చిన ఈ వానకథల్లో అంతా తడిసిముద్దవుతారని 
అక్కడ కొన్ని గొడుగులు కూడా ఉంచారు. కానీ వాన కోరుకునేవాళ్ళు
 సత్యం శంకరమంచి కథలో లాగా, అకాశాన్నీ, 
భూమినీ ఏకంచేసే వానలో తాము కూడా ఒకరైపోవాలనుకుంటారు తప్ప, 
గొడుగుల్తో తమను కాచుకోవాలనుకోరు. తక్కిన ప్రపంచమంతా
 తనని తాను కులాల, మతాల, సిద్ధాంతాల గొడుగుల్తో 
మానవతావర్షధారలనుంచి అడ్డుపెట్టుకుని తప్పించుకుంటున్నప్పుడు
 కథకుడొక్కడే ఆ వానలో అమాయికంగానూ, సాహసంగానూ ముందడుగు వేస్తున్నాడు.
అతడికి మన జేజేలు.




Friday, 22 September 2017

ఒక కథల వాన .... ఒక కన్నీటి వాన

ఒక కథల వాన .... ఒక కన్నీటి వాన 

ఒక్కో  సారి అంతే 
కొన్ని కొన్ని చినుకులు కూర్చుకొని 
వానగా మార్చి 
తడవాలనుకున్నప్పుడల్లా 
ఒక వీడుకోలు కన్నీరు 
వెంటాడుతూ ఉంటుంది 
కొన్ని జ్ఞాపకాలు అంతే 
వద్దన్నా వదలవు 
లోపలి తడిలో మొలకెత్తి 
మనలోని మనిషితనాన్ని 
మేలుకొలుపుతూ ఉంటాయి 
కొన్నిసార్లు ఆగిపోవడమూ అవసరమే 
కొన్ని సార్లు సాగిపోవడము అవసరమే 

రెండురోజుల్లో ఖదీర్ బాబు సంపాదకత్వం లోని 
వాన కథలు సంకలనం ఆవిష్కరణ . 
అందరూ ఆహ్వానితులే 




ఒక మరపురాని మనిషి మోహన్ గారికి వీడుకోలు 





నాకు సంతకం ఇచ్చినవాడు


ప్రకాష్ ఉదయాన్నే లేచి మోహన్ దగ్గరకు బయలుదేరేవాడు. 
రేపట్నించి ఎక్కడకు వెళతాడో. అవార్డు వచ్చిన ఒకడు 
సంతోషం పంచుకోవడానికి సాయంత్రానికి మోహన్ దగ్గరకు చేరేవాడు. 
రేపటి నుంచి ఎక్కడకు వెళతాడో. భార్య తన్ని తగలేసింది. 
రాత్రికి రోషంగా ఇంటికి పోకుండా ఉండటానికి మోహన్ దగ్గరకు 
వెళ్లేవాడొకడు. రేపటి నుంచి ఎక్కడికి వెళతాడో. 
రోహింగ్యా ముస్లింల ఊచకోత మీద ఒకడికి ఆవేశం వచ్చింది. 
కక్కడానికి మోహన్ దగ్గరకు నడి మధ్యాహ్నం వెళ్లేవాడు. 
రేపటి నుంచి ఎక్కడికి వెళతాడో. 
గౌరీ లంకేష్ హత్య మీద ఒకడికి అభిప్రాయం చెప్పాలనిపించింది. 
మోహన్ దగ్గరకు వెళతాడు. రేపటి నుంచి ఎక్కడకు వెళతాడు? 
అసలీ కంచె ఐలయ్య వ్యవహారం ఏమిటి గురూ అని ప్లాస్టిక్ చైర్‌ను
 బర్రున లాక్కుని మోహన్ టేబుల్ మీద మోచేతులు ఒకడు ఆన్చుతాడు.
 రేపటి నుంచి ఎక్కడ టేబుల్ వెతుక్కుంటాడో. 
పేదల, సాదల, బీదా బిక్కీ జనాల, మహా మేధావుల, 
అపర కుబేరుల, లేకపోయినా ఉన్నట్టుండేవాళ్ల, ఉన్నా లేనట్టుండేవాళ్ల, 
చాలా మంది మంచివాళ్ల, అస్సలు మర్యాద లేనివాళ్ల, 
స్రష్టుల, భ్రష్టుల, బాధా సర్పద్రష్టుల అందరి పెద్ద దిక్కు... 
ధర్మసత్రం.. కన్ఫెషన్ బాక్స్... అన్నం ముద్ద... ఆరడుగుల నీడ..
. ప్రశ్నించని జవాబు... సందేహించని కరుణ... 
ఏసుప్రభువు రొట్టెముక్క మోహన్... తండ్రీ.. తండ్రీ...

ఉదయాన్నే ఫోన్ చేసేవాణ్ణి.
‘ఔనబ్బా... కాదబ్బా... అలాగా అబ్బా’ అని అలెర్ట్‌గా సమాధానం చెప్పేవాడు.
ఆయన ఉదయం నాలుగ్గంటలకు లేచి పుస్తకాలు 

చదువుతాడని చాలా కొద్దిమందికే తెలుసు.

రాత్రి పదకొండుకు కూడా ఫోన్ ఎత్తుతాడు.
‘ఔనబ్బా... కాదబ్బా’.. అదే జవాబు.
ఆయన తెల్లవార్లూ బొమ్మలేయగలడు.

వచ్చినవాళ్లని వింటూ, వచ్చినవాళ్లతో మాట్లాడుతున్నట్టు

 నటిస్తూ తనలో తాను రుషిగా ఉన్నవాడు మోహన్. తనలో 
తాను రుషిగా ఉన్నట్టుగా ఉంటూ వచ్చినవాళ్ల బాగోగులు చూస్తూ, 
వాళ్ల గోడు వింటూ, దుఃఖం తుడుస్తూ వైద్యుడుగా ఉన్నవాడు మోహన్.

గూడెంలో ఒకమ్మాయి నెల తప్పి బిడ్డను కంది. 

ఎవడమ్మా తండ్రి అని అడిగితే కొండ మీది భిక్షువు అని చెప్పింది.
 అందరూ వెళ్లి భిక్షువు తలుపు తట్టి ‘నీ బిడ్డ.. నీ దగ్గరే ఉంచుకో’.. 
అనంటే ‘అలాగా’ అని తీసుకుని తలుపేసుకున్నాట్ట. 
పదేళ్ల తర్వాత ఆ అమ్మాయి అసలు సంగతి చెప్పి 
ఆ బిడ్డకు తండ్రి ఫలానా అనంటే అందరూ వెళ్లి
 ‘మా బిడ్డ మాకిచ్చెయ్’ అనంటే ‘అలాగా’ అని ఇచ్చేసి అంతే తలుపేసుకున్నాట్ట.

మోహన్ అలా ఉంటాడు. అలా ఉండగలడు. 

ఇవాళ వంద మంది చుట్టూ. ఒక్కలాగే. 
ఒకోసారి ఎవరూ లేని ఇంట్లో ఒక్కడుగా. 
అప్పుడూ ఒక్కలాగే. జేబులో చెక్ వస్తే లక్ష వస్తుంది.
 ఒక్కలాగే. గురూ కాస్త సిగరెట్ తెచ్చి పెట్టగలవా... చిల్లర లేదూ. ఒక్కలాగే.

పథకాలు పన్ని, కార్యక్రమాలు రచించి, కుటుంబాన్ని ఇలా నిర్వహించాలి,

 కెరీర్‌ని ఇలా బిల్డప్ చేయాలి, ఈ వయసుకల్లా ఫలానా అవార్డు 
మన అకౌంట్‌లో పడాలి, ఈ టైముకు న్యూ సిటీలో విల్లాకు అధిపతి కావాలి...
 ఈ నమూనా పట్టని చిట్టచివరి జనరేషన్‌కు చిట్టచివరి ప్రతినిధి మోహన్.
 అరె... మనుషులు ఉన్నారు.. వాళ్లతో ఉండు. కష్టంలో ఉన్నారు. 
వాళ్లతో ఉండు. కలం పడతావా. పట్టు. కుంచె గీస్తావా.. గియ్యి. 
నోరు లేనివాళ్లకు నోరివ్వడం, గీతలోపల ఉన్నవాళ్లను సరిహద్దు దాటించడం.
2.. ఇదీ మోహన్ చేసిన పని. పుస్తకాల పేర్లు ‘డ్రాప్’ చేస్తూ తిరిగేవాళ్ల
 చాలామంది కంటే చాలా చదివినవాడు మోహన్. 
ఫేస్‌బుక్‌లో పోస్టులు గిలకడం ద్వారా సామాజిక బాధ్యత 
తీర్చుకుని చేతులు దులుపుకునే చాలామంది కంటే 
చాలా బాధ్యత ఉన్నవాడు మోహన్. రేపు ఎలా అనే ఆందోళన కన్నా
 ఒక చెచెన్యా వార్తకూ ఒక పాలస్తీనా బులెటిన్‌కూ అలల అంచున 
ఒక శరణార్థి బాలుడి మృతదేహానికి ఎక్కువ ఆందోళన పడుతూ
 నిస్సహాయంగా కన్నీరు కారుస్తూ కనిపించిన విశ్వమానవుడు మోహన్. 
చాలా మంది జర్నలిస్టుల కంటే బెటర్ జర్నలిస్ట్. చాలామంది
 ఇంటెలెక్చువల్స్ కంటే బెటర్ ఇంటెలెక్చువల్.

టాలెంట్ ఉన్న వాళ్లను చూసి నెత్తిన పెట్టుకోవడం, 

తనను ఆధారం చేసుకుని ఎదిగి ఎవరైనా బాగు పడితే సంబరపడటం, 
వాళ్లు ప్రేమగా ఇంత విజిటెబుల్ బిర్యానియో, గోంగూర పప్పు 
అన్నమో తెచ్చి పెడితే రెండు స్పూనులు తిని ఎంతో సంతృప్తి పడటం 
ఈ పిచ్చిపుల్లయ్య మోహన్. ఊకను ఊక అనీ తోకను తోక అనీ 
కండను గుండె అనీ కనిపెట్టగలిగినవాడు మోహన్.
 ఐదు నిమిషాల్లో తాటాకులు కట్టగలడు. ఆయన దగ్గర డూప్లికేట్లు గౌరవం పొందలేరు.

1995లో రెడ్‌హిల్స్‌లో కలిశాడు. అప్పటి నుంచి ఆయన చేయి విడువలేదు. 

దర్గామిట్ట కతలు, పోలేరమ్మ బండ కతలు, ఫుప్పుజాన్ కతలు... 
నాకు వేసినన్ని బొమ్మలు ఎవరికీ వేయలేదు. నేను గారాలు పోయినట్టు ఎవరూ పోలేదు.
 ఏ ముహూర్తన ఆ మహానుభావుడు తన చల్లని చేతులతో ‘మహమ్మద్ ఖదీర్‌బాబు’ 
అని నా సంతకం చేశాడో ఇప్పటికి నా నుంచి వచ్చిన
 పది పుస్తకాల మీద మెరుస్తూ బర్కత్ చూపుతూనే ఉంది.
 నా వాల్ మీద నిలిచి ఉంది. నాకు సంతకం ఇచ్చినవాడు మోహన్.

ఈ రంజాన్ నెలలో చివరి హలీమ్ ఇచ్చి వచ్చాను. 

వేడి వేడిగా కాసింత తిన్నాడు. ఇక రంజాన్ వచ్చినప్పుడల్లా 
హలీమ్ చూసినప్పుడల్లా ఈ జ్ఞాపకం తిరగబెట్టిన బాధ నేను అనుభవించాలి. 
అంత అనారోగ్యంలో కూడా నిబ్ పట్టి నా కోసం చివరి అక్షరాలు ‘సమగ్ర’ 
అని రాసి ఇచ్చాడు. ఆ జ్ఞాపకపు ఉక్కిరిబిక్కిరి కూడా నేను దాచుకోగలగాలి.

పెద్ద అవార్డు వచ్చినప్పుడు, కొత్త పుస్తకపు మొదటి కాపీ వచ్చినప్పుడు, 

ఎవరి మీదైనా అలిగినప్పుడు, డైలీ రొటీన్ పెద్ద లుచ్ఛా లఫంగీలా అనిపించినప్పుడు, 
చాలా మంచి ఆలోచన మెదిలినప్పుడు, ఊరికూరికే నవ్వుకోవాలి అనిపించినప్పుడు, 
నా తండ్రిలాంటి వ్యక్తి సమక్షంలో నాకు గడపాలనిపించినప్పుడు, 
సకల చింతలను మరిచి కాసింత ధైర్యపడాలి అనుకున్నప్పుడు బండి తీసి 
దిలాసాగా దర్పంగా జాయ్‌మని మోహన్ దగ్గరకు బయలుదేరేవాణ్ణి.

అదిగో తెల్లవారుతోంది.
రేపటి నుంచి ఎక్కడకు వెళ్లాలో ఏమో.

- మహమ్మద్ ఖదీర్‌బాబు